కెప్టెన్‌ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో..! | Sakshi
Sakshi News home page

కెప్టెన్‌ అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో..!

Published Sun, Dec 24 2017 11:11 AM

 Rohit Sharma Opens About Captaining Team In Virat Kohli's Absence - Sakshi

ఇండోర్‌: టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి విశ్రాంతితో తాత్కలిక కెప్టెన్‌గా బాధ్యతను నిర్వర్తిస్తున్న రోహిత్‌ శర్మ.. ఆదివారం జరిగే చివరి టీ20తో తన బాధ్యత ముగింపు చెప్పనున్నాడు. ఈ నేపథ్యంలో ‘కెప్టెన్‌గా అవకాశం మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. కాబట్టి ప్రతి క్షణాన్ని మైదానంలో గడుపూతూ.. ఆస్వాదిస్తున్నానని’ రోహిత్‌ వ్యాఖ్యానించాడు.

‘తొలి సారి కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తుండటంతో కొంతమేర ఒత్తిడి ఉంది. ఇది ముంబై మ్యాచ్‌లో కూడా ఉంటుంది. కెప్టెన్‌గా అవకాశం మళ్లెప్పుడొస్తుందో తెలియదు.కాబట్టి మైదానంలో గడిపే ప్రతిక్షణము నాకు ముఖ్యమే. ధర్మశాల మ్యాచ్‌లో దారుణ ఓటమి తీవ్ర ఒత్తిడిని కలిగించింది. జట్టు గురించి పదే పదే ఆలోచించా. కెప్టెన్సీ చేయడం చాలా కష్టం. ఎందుకంటే మేం 140 కోట్ల ప్రజలకు ప్రాతినిథ్యం వహిస్తున్నాం. ఇది మరింత ఒత్తిడిని పెంచుతోంది. అని’ రోహిత్‌ పేర్కొన్నాడు. 

తన బ్యాటింగ్‌పై స్పందిస్తూ.. ‘నా దగ్గర పెద్ద శక్తి ఏం లేదు. మాములుగానే బ్యాటింగ్‌ చేశాను. నేను నా టైమింగ్‌ నమ్ముకుంటాను. నా బలాలు బలహీనతలెంటో నాకు తెలుసు. ఒక వైపు కాకుండా మైదానమంతా ఆడుతా. దీంతో ప్రత్యర్థులు ఫీల్డింగ్‌ పెట్టుకోవడంలో ఇబ్బంది పడుతారు.  అన్నిఫార్మట్లలో ఇలానే ఆడుతా. ఎప్పుడు సెంచరీ, డబుల్‌ సెంచరీల గురించి చూడను. సిక్సర్ల కొట్టడం కన్నా ఫీల్డర్ల మధ్యలోంచే బంతిని బౌండరీకి తరలించడం సంతోషాన్నిస్తుందని’ రోహిత్‌ చెప్పుకొచ్చాడు. రోహిత్‌ కెప్టెన్సీలో శ్రీలంకపై వన్డే, టీ20 సిరీస్‌లను భారత్‌ గెలుచుకున్న విషయం తెలిసిందే. ముంబై వాంఖడే స్టేడియంలో రాత్రి 7 గంటలకు భారత్‌-శ్రీలంక చివరి టీ20 జరగనుంది.

Advertisement
Advertisement