దుబాయ్: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ లో విశేషమైన ప్రతిభ ఉన్నా దానికి సరైన న్యాయం చేయలేదని భారత మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అభిప్రాయపడ్డాడు. సచిన్ తన టాలెంట్ తో మరిన్ని డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు చేసే అవకాశం ఉన్నా చేయలేకపోయాడని కపిల్ దేవ్ వ్యాఖ్యానించాడు.సచిన్ పై తాను తాజాగా చేసిన వ్యాఖ్యలను తప్పుగా అర్ధం చేసుకోవద్దని కపిల్ తెలిపాడు. సచిన్ తన అవకాశాలను మరికొంత బాగా వినియోగించుకుని ఉంటే క్రికెట్ చరిత్రలో సుదీర్ఘ కాలం నిలిచిపోయేవాడని కపిల్ పేర్కొన్నాడు.
'సచిన్ కు సెంచరీలు చేయడం వరకూ తెలుసు. వాటిని డబుల్ సెంచరీలుగా, ట్రిపుల్ సెంచరీలు ఎలా మలచాలన్నది తెలియదు. ఒకవేళ సచిన్ తన టాలెంట్ ను మరింత వినియోగిస్తే క్రికెట్ చరిత్రలో మరికొన్నికాలాలు పాటు కీర్తి ప్రతిష్టలు అతని సొంతమయ్యేవి అని కపిల్ తెలిపాడు. అలా వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు వివియన్ రిచర్డ్స్ తో సరితూగే క్రికెటర్ గా సచిన్ ఎదిగేవాడన్నాడు. క్రికెట్ ప్రపంచంలో సచిన్ సరైన క్రికెటర్ అని కొనియాడాడు. సాంకేతికంగా సచిన్ లో చాలా పరిణితి ఉన్నా దానిని సక్రమంగా ఉపయోగించుకోలేదన్నాడు. సచిన్ కేవలం సెంచరీలతోనే సరిపెట్టి అతని టాలెంట్ ను పూర్తిగా బయటకు తీయలేదని కపిల్ పేర్కొన్నాడు.