చైనా ఓపెన్ లో 'సై'నా..! | Sakshi
Sakshi News home page

చైనా ఓపెన్ లో 'సై'నా..!

Published Mon, Nov 9 2015 6:29 PM

చైనా ఓపెన్ లో 'సై'నా..!

ఫుజోవు(చైనా): తన పేలవమైన ఆటతీరుతో గత నెల్లో ప్రపంచ నంబర్ వన్ ర్యాంకును కోల్పోయిన భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్.. చైనా ఓపెన్ సూపర్ సిరీస్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతోంది. ఇటీవల జరిగిన జపాన్, డెన్మార్క్, ఫ్రాన్స్ ఓపెన్ సూపర్ సిరీస్ లలో ఆదిలోనే ఇంటి ముఖం పట్టిన సైనా కనీసం చైనా ఓపెన్ లోనైనా స్థాయికి తగ్గ ఆట తీరును ప్రదర్శించాలని భావిస్తోంది. ఈ మేరకు సైనా నెహ్వాల్ మీడియాత మాట్లాడుతూ..  గత కొన్ని వారాల నుంచి ప్రాక్టీస్ లో నిమగ్నమైనట్లు తెలిపింది. అంతకుముందు ఆడిన టోర్నీల్లో కంటే ఈ సిరీస్ కు కాస్త భిన్నంగా సిద్ధమైనట్లు పేర్కొంది. ఆ టోర్నీల్లో కాలి మడమ గాయంతో బాధపడినట్లు సైనా స్పష్టం చేసింది. ప్రస్తుతం ఆ గాయం నుంచి పూర్తిగా తేరుకున్నానని.. ఇక చైనా సూపర్ సిరీస్ పైనే  దృష్టి పెట్టినట్లు పేర్కొంది.

 

మంగళవారం నుంచి ఆరంభం కానున్న చైనా సూపర్ సిరీస్ టోర్నీలో సైనా తొలి రౌండ్ లో సున్ యు(చైనా)తో తలపడనుంది. ఇద్దరి ముఖాముఖి రికార్డులో సైనా 4-1 తేడాతో ముందంజలో ఉంది. ఇదిలా ఉండగా పురుషుల సింగిల్స్ లో కిదాంబి శ్రీకాంత్,  పారుపల్లి కశ్యప్, హెచ్ ఎస్ ప్రణయ్, అజయ్ జయరామ్ లు తమ అదృష్టాలను పరీక్షించుకోనున్నారు. డబుల్స్ విభాగంలో గుత్తా జ్వాల-అశ్విని పొన్నప్పల జోడి పోరుకు సన్నద్ధమయ్యారు. ఈ జోడి తొలి రౌండ్ లో జపాన్ కు చెందిన నాకో ఫుకుమన్-కురుమి యోనవోలతో ద్వయంతో తలపడనుంది.

Advertisement
Advertisement