సెంచూరియన్: టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా తన రెండో ఇన్నింగ్స్లో మరోసారి తడబడింది. భారత పేసర్ మొహ్మద్ షమీ విజృంభించడంతో సఫారీలు స్వల్ప వ్యవధిలో మూడు వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడ్డారు. ఏబీ డివిలియర్స్(80;121 బంతుల్లో 10 ఫోర్లు), డీన్ ఎల్గర్ (61;121 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్), డీకాక్(12; 5 బంతుల్లో 3 ఫోర్లు)లు షమీ వలలో చిక్కి పెవిలియన్కు చేరారు.
సోమవారం మూడో రోజు ఆటలో మర్క్రామ్(1), హషీమ్ ఆమ్లా(1)ల వికెట్లను మూడు పరుగులకే కోల్పోయిన సఫారీలు.. మంగళవారం నాల్గో రోజు ఆటలో ఏబీ, డీన్ ఎల్గర్ వికెట్లను ఏడు పరుగుల వ్యవధిలో కోల్పోయారు. క్రీజ్లో కుదరుకున్న ఈ జోడిని భారత పేసర్ మొహ్మద్ షమీ అవుట్ చేసి టీమిండియాకు మంచి ఆరంభాన్నిచ్చాడు. ఆపై మరో 12 పరుగుల వ్యవధిలో డీకాక్(12)ను కూడా షమీ అవుట్ చేశాడు. వరుసగా మూడు ఫోర్లు కొట్టిన డీకాక్..మరోసారి షాట్కు యత్నించి అవుటయ్యాడు.
90/2 ఓవర్నైట్ స్కోరుతో నాల్గో రోజు ఆట కొనసాగించిన ఏబీ, ఎల్గర్లు ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లే యత్నం చేశారు. అయితే ఇన్నింగ్స్ 42 ఓవర్ రెండో బంతికి ఏబీని బోల్తా కొట్టించిన షమీ..46వ ఓవర్ ఐదో బంతికి ఎల్గర్ను అవుట్ చేశాడు. ఇక 47 ఓవర్ నాల్గో బంతికి డీకాక్ను షమీ అవుట్ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా 163 పరుగుల వద్ద ఐదో వికెట్ను నష్టపోయింది.