దోహా: ప్రపంచ సీనియర్ బాక్సింగ్ చాంపియన్ షిప్ లో ఆకట్టుకుంటూ సెమీ ఫైనల్ వరకూ వెళ్లిన భారత యువ బాక్సర్ శివ థాపా కాంస్యంతో సరిపెట్టుకున్నాడు. 56 కేజీల విభాగంలో పోటీపడ్డ శివ థాఫా సోమవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో 1-2 తేడాతో ఉజకిస్థాన్ బాక్సర్ మురోద్జోన్ అఖ్మాదాలీవ్ చేతిలో పరాజయం పాలయ్యాడు. ఈరోజు పోరులో తృటిలో విజయాకాశాన్ని కోల్పోయినా.. రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ రేస్ లో మాత్రం నిలిచాడు. మరో సెమీ ఫైనల్లో ఓటమి పాలైన దిమిర్తీ అసునౌ తో జరిగే పోరులో శివ థాఫా విజయం సాధిస్తే రియోకు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ కేటగిరి నుంచి ముగ్గురు బాక్సర్లను అక్టోబర్ 15వ తేదీన రియో ఒలింపిక్స్ కు ఎంపిక చేయనున్నారు.
అంతకుముందు శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో శివ థాపా 3-0తో హకన్ ఎర్సెకర్ (ఖతార్)పై గెలుపొంది పతకం ఖాయం చేసుకున్న సంగతి తెలిసిందే.దీంతో ప్రపంచ చాంపియన్షిప్లో పతకం నెగ్గిన మూడో భారతీయ బాక్సర్గా శివ థాపా గుర్తింపు పొందాడు. గతంలో విజేందర్ సింగ్ (2009), వికాస్ కృషన్ (2011) కాంస్య పతకాలు సాధించారు.