టీమిండియాకు ఆధిక్యం దక్కేనా..? | Sakshi
Sakshi News home page

టీమిండియాకు ఆధిక్యం దక్కేనా..?

Published Sat, Aug 22 2015 3:30 PM

టీమిండియాకు ఆధిక్యం దక్కేనా..? - Sakshi

కొలంబో: శ్రీలంకతో రెండో టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించేందుకు శ్రమిస్తోంది. మ్యాచ్ మూడో రోజు శనివారం తొలి సెషన్లో విఫలమైన భారత బౌలర్లు లంచ్ విరామం తర్వాత విజృంభించారు. వెంటవెంటనే నాలుగు వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేశారు. 140/3 ఓవర్నైట్ స్కోరుతో ఈ రోజు ఉదయం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన లంకేయులు టీ విరామానికి 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేశారు. తొలి ఇన్నింగ్స్లో భారత్ 393 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. టీ విరామానికి లంక తొలి ఇన్నింగ్స్లో 93 పరుగులు వెనుకబడి ఉండగా, చేతిలో మూడు వికెట్లున్నాయి.

లంక ఓవర్నైట్ బ్యాట్స్మెన్ మాథ్యూస్ (102) సెంచరీ, తిరుమన్నె (62) హాఫ్ సెంచరీలతో రాణించారు. వీరిద్దరూ నాలుగో వికెట్కు 127 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి సెషన్లో భారత్ బౌలర్లు ఎంత శ్రమించినా ఈ జోడీని విడదీయలేకపోయారు. లంచ్ తర్వాత భారత పేసర్ ఇషాంత్.. తిరుమన్నెను అవుట్ చేసి బ్రేక్ ఇచ్చాడు. కాసేపటి తర్వాత ఇషాంత్.. చండీమల్ (11)ను పెవిలియన్ చేర్చాడు. సెంచరీ హీరో మాథ్యూస్తో పాటు దమ్మిక ప్రసాద్ (5) వెంటవెంటనే అవుటయ్యారు. టీ విరామానికి ముబారక్, హెరాత్ క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో ఇషాంత్, అమిత్ మిశ్రా చెరో రెండు వికెట్లు.. ఉమేష్, బిన్నీ, అశ్విన్ తలా వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లు వీలైనంత త్వరగా లంక టెయిలెండర్లను తొలగిస్తే అంత ఆధిక్యం వస్తుంది.

Advertisement
Advertisement