కోల్ కతా: ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ జట్టుతో ఇక్కడ జరుగుతున్నరెండు రోజుల వార్మప్ మ్యాచ్ లో శ్రీలంక అదుర్స్ అనిపించింది. శనివారం తొలి రోజు ఆటలో భాగంగా బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంకకు శుభారంభం లభించింది. ఓపెనర్లు సమరవిక్రమా(74;77 బంతుల్లో13 ఫోర్లు), కరుణరత్నే(50 రిటైర్డ్ హర్ట్;62 బంతుల్లో7 ఫోర్లు) అర్థ శతకాలతో మెరిశారు. ఈ క్రమంలోనే వారిద్దరూ తొలి వికెట్ కు 134 పరుగులు జోడించిన తరువాత సమరవిక్రమా పెవిలియన్ చేరాడు.
ఆపై లహిరు తిరుమన్నే(17) నిరాశపరిచినా, మాథ్యూస్ (54 రిటైర్డ్ హర్ట్;93 బంతుల్లో6 ఫోర్లు) హాఫ్ సెంచరీ చేయగా, చండిమాల్(29 రిటైర్డ్ హర్ట్;65 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అటు తరువాత డిక్ వెల్లా(73;59 బంతుల్లో13 ఫోర్లు) అర్థ శతకం సాధించాడు. ఇక చివరి వరుస ఆటగాళ్లలో దిల్రువాన్ పెరీరా(48;44 బంతుల్లో6 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. దాంతో 88.0 ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక ఆరు వికెట్లు కోల్పోయి 411 పరుగులు చేసింది. బోర్డు ప్రెసిడెంట్స్ ఎలెవన్ బౌలర్లలో సందీప్ వారియర్, ఆకాశ్ భండారిలు తలో రెండు వికెట్లు సాధించగా, అవేశ్ ఖాన్, సక్సేనాలకు చెరో వికెట్ దక్కింది.