తెలంగాణ శుభారంభం | Sakshi
Sakshi News home page

తెలంగాణ శుభారంభం

Published Tue, Aug 14 2018 10:18 AM

Telangana Football Team wins Opening Game - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అఖిల భారత ఫుట్‌బాల్‌ సమాఖ్య జాతీయ సబ్‌జూనియర్‌ ఫుట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ జట్టు శుభారంభం చేసింది. గచ్చిబౌలి ఫుట్‌బాల్‌ స్టేడియంలో సోమవారం జరిగిన మ్యాచ్‌లో తెలంగాణ 6–1తో పుదుచ్చేరిపై ఘనవిజయం సాధించింది. మ్యాచ్‌ ఆరంభంలో మినహా ఏదశలోనూ తెలంగాణకు పుదుచ్చేరి పోటీనివ్వలేకపోయింది. ఆట 3వ నిమిషంలో లభించిన పెనాల్టీని వి. మణియరసన్‌ గోల్‌గా మలచడంతో పుదుచ్చేరి 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత రెండు నిమిషాలకే టి. పవన్‌ కుమార్‌ (5వ ని.)గోల్‌తో తెలంగాణ 1–1తో స్కోరును సమం చేసింది.

అనంతరం అమన్‌ డంగ్‌ (13వ ని., 15వ ని.) అద్భుత రీతిలో రెండు నిమిషాల వ్యవధిలోనే 2 గోల్స్‌ చేసి తెలంగాణను 3–1తో పటిష్ట స్థితిలో నిలిపాడు. తొలి అర్ధభాగం ముగుస్తుందనగా షేక్‌ షలీమ్‌ (42వ ని.) గోల్‌తో తెలంగాణ మరింత ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో అర్ధభాగంలోనూ తెలంగాణ దూకుడు ముందు పుదుచ్చేరి తేలిపోయింది. 68వ నిమిషంలో సోఫియాన్‌ మొహమ్మద్, 73వ నిమిషంలో కెప్టెన్‌ మొహమ్మద్‌ జైద్‌ ఫరూఖీ చెరో గోల్‌ సాధించడంతో తెలంగాణ 6–1తో పుదుచ్చేరిని చిత్తు చేసింది.

Advertisement
Advertisement