అస్సాంతో రంజీ మ్యాచ్ డ్రా | Sakshi
Sakshi News home page

అస్సాంతో రంజీ మ్యాచ్ డ్రా

Published Sun, Nov 10 2013 11:26 PM

With assam team ranji trophy match draw

గువాహటి: హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ నిరాశపరిచారు. అస్సాంపై ఆధిక్యాన్ని సాధించలేకపోయారు. దీంతో రంజీ ట్రోఫీ గ్రూప్-సిలో భాగంగా ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో అస్సాం ఖాతాలో 3 పాయింట్లు చేరగా, హైదరాబాద్‌కు ఒక పాయింట్ దక్కింది. 218/4 ఓవర్ నైట్ స్కోరుతో  చివరి రోజు ఆట ప్రారంభించిన హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్‌లో 132.2 ఓవర్లలో 370 పరుగులకు ఆలౌటైంది.
 
 
 అస్సాం బౌలర్లు సమష్టిగా రాణించి హైదరాబాద్ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఓవర్‌నైట్ బ్యాట్స్‌మన్ బవనక సందీప్ (221 బంతుల్లో 113, 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించాడు. అయితే మిగతా బ్యాట్స్‌మెన్ అమోల్ షిండే (1), రవితేజ (3) ఘోరంగా విఫలమవడంతో ఇన్నింగ్స్‌ను గాడిన పెట్టే ఆటగాడు లేకపోయాడు. ఈ దశలో సందీప్, ఆశిష్ రెడ్డి (65 బంతుల్లో 25, 3 ఫోర్లు, 1 సిక్స్) అండతో సెంచరీ పూర్తి చేశాడు.
 
 
  అస్సాం బౌలర్లలో అబూ నెచిమ్, అరూప్ దాస్, సయ్యద్ మహ్మద్, తర్జిందర్ సింగ్ తలా 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో అస్సాం జట్టుకు 131 పరుగుల ఆధిక్యం లభించింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన అస్సాం ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో వికెట్ నష్టానికి 20 పరుగులు చేసింది. ఓపెనర్ పల్లవ్ కుమార్ దాస్ (3) రనౌట్ కాగా, మరో ఓపెనర్ శివ శంకర్ రాయ్ (9 నాటౌట్), కునాల్ సైకియా (7 నాటౌట్) అజేయంగా నిలిచారు. హైదరాబాద్ జట్టు తదుపరి మ్యాచ్‌లో మహారాష్ట్రతో తలపడుతుంది. ఈ మ్యాచ్ 14 నుంచి 17 వరకు హైదరాబాద్‌లో జరగనుంది.
 
 సంక్షిప్త స్కోర్లు: అస్సాం తొలి ఇన్నింగ్స్: 501; హైదరాబాద్ తొలి ఇన్నింగ్స్: 370 (సుమన్ 126, సందీప్ 113; తర్జిందర్ 2/35, అరూప్ దాస్ 2/68), అస్సాం రెండో ఇన్నింగ్స్: 20/1
 

Advertisement
Advertisement