ఆప్ కార్యాలయంపై దాడి | Sakshi
Sakshi News home page

ఆప్ కార్యాలయంపై దాడి

Published Wed, Jan 8 2014 11:41 PM

AAP office attack: Hindu Raksha Dal leader arrested

 సాక్షి, న్యూఢిల్లీ: కౌశంబీలోని ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాల యం పై హిందూ రక్షా దళ్‌కు చెందిన కొందరు వ్యక్తులు బుధవారం ఉదయం దాడిచేశారు. ఎర్ర జెండాలు, లాఠీలతో ఆప్ కార్యాలయానికి వచ్చిన కొందరు వ్యక్తులు ఆప్ కార్యాలయం బయట ఉన్న పూల కుం డీలు ధ్వంసం చేశారు. కిటికీల అద్దాలు పగులగొట్టారు. ఆప్ నేత ప్రశాంత్ భూషణ్ కాశ్మీర్‌ైలో సైన్యం ఉపసంహరణపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ దాడి జరిగింది. దాడికి పాల్పడినవారిలో ఒకడైన పింకీ చౌదరిని సాహిబాబాద్ పోలీసులు అరెస్టు చేశారు.
 
 కౌశంబీలో ఆప్‌కు మూడంతస్తుల కార్యాల యం ఉంది. ఇది ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసానికి చాలా దగ్గరలో ఉంది. ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో నాలుగైదు వాహనాలలో వచ్చిన వ్యక్తులు ప్రశాంత్‌భూషణ్‌కు, అరవిం ద్ కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ  జైశ్రీరామ్ అంటూ కార్యాలయంపై దాడిచేశారు. ఆ సమయంలో కార్యాలయంలో కొద్దిమంది మాత్రమే కార్యకర్తలు ఉన్నారు. కానీ దాడిలో వారెవరికీ గాయాలు కాలేదు.  దాడికి వచ్చిన వారిని చూసిన కార్యకర్తలు వెంటనే లోపలికి వెళ్లి తలుపులు మూసుకున్నారు. సుమారు 50 మంది లాఠీలు, కర్రలతో హఠాత్తుగా కార్యాలయంలోకి ప్రవేశించి దాడిచే శారని ఆప్ ప్రతినిధి దిలీప్ పాండే చెప్పారు.
 
  మరికొందరు ఇటుకలు, రాళ్లు కూడా విసిరారని ఆయన చెప్పారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఆప్ కార్యాకర్తలు లోపలకు పరుగెత్తి తలుపులు మూసుకుని పై అంతస్తుకు వెళ్లిపోయారని ఆయన చెప్పా రు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆయన చెప్పారు. సీసీటీవీ పుటేజ్ ద్వారా ఆప్ కార్యాలయంపై దాడిచేసిన వారి ని గుర్తించామని, వారిని అదుపులోకి తీసుకునేందు కు ప్రయత్నిస్తున్నామని ఘజి యాబాద్ ఎస్‌ఎస్‌పీ ధర్మేందర్ సింగ్ చెప్పారు. దాడికి పాల్పడినవారు వచ్చిన వాహనాల నంబర్ల ను కూడా నమోదు చేసుకున్నట్లు ఆయన చెప్పారు. దాడి ఘటనలో ప్రధాన నిందితుడైన పింకీ చౌదరితో పాటు మరో 12మందిని సాహిబాబాద్‌లో యూపీ పోలీసులు అరెస్టుచేశారు. కాగా, కార్యాలయంపై దాడిని తామే చేసినట్లు హిందూ రక్షా దళ్ అధ్యక్షుడు విష్ణు గుప్తా అంగీకరించారు. కాశ్మీర్‌పై ప్రశాంత్ భూషణ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా తాము ఈ దాడికి  పాల్పడినట్లు ఆయన చెప్పారు.
 
  ప్రశాంత్ భూషణ్‌ను  వెంటనే ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా తాను ప్రశాంత్‌భూషణ్‌పై దాడికి పాల్పడినట్లు ఆయన చెప్పారు. స్థానిక భజరంగ్ దళ్, శ్రీరామ్ సేన  కార్యకర్తలు కూడా ఈ దాడిలో పాల్గొన్నట్లు గుప్తా చెప్పారు. అయితే ఈ దాడితో తమకు సంబంధం లేదని భజరంగ్ దళ్ తెలిపింది. కాశ్మీర్‌లో సైన్యం ఉండా లా వ ద్దా అన్న దానిపై ప్రజాభిప్రాయసేకరణ జరపాలని, సైన్యం ఉండనవసరం లేదని  కాశ్మీరీలు అభిప్రాయపడినట్లయితే సైన్యాన్ని అక్కడ నుంచి తొలగించాలని భూషణ్ ఇటీవల ఓ టీవీ కార్యక్రమంలో చెప్పారు. కాగా, అది ప్రశాం త్ భూషణ్ వ్యక్తగత అభిప్రాయమని, కాశ్మీర్‌లో ఎలాంటి ప్రజాబిప్రాయ సేకరణను  ఆమ్ ఆద్మీ పార్టీ కోరడం లేదని ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఇదివరకే స్పష్టం చేశారు.
 
 భద్రత పెంపు
 ఆప్ కార్యాలయంపై జరిగిన దాడితో  కౌశంబీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసం, పార్టీ కార్యాలయాల వద్ద యూపీ పోలీసులు భద్రత పెంచారు. ప్రశాంత్ భూషణ్ కార్యాలయం వద్ద సైతం భద్రతను పటిష్టం చేశా రు. ఢిల్లీ సచివాలయంలో ఎస్‌ఎస్‌బీ జవాన్లను మోహరించారు. జనతా దర్బార్ కోసం తెరచిన గేట్ నంబర్ 4 వద్ద ఎస్‌ఎస్‌బీ జవాన్లను  మోహరించడంతో పాటు బారికేడ్లను అమర్చారు. ఇదిలా ఉండగా దాడి తర్వాత కూడా భద్రతను స్వీకరించడానికి కేజ్రీవాల్ నిరాకరించారు. తనకు భద్ర త అవసరం లేదని, ఇలాంటి దాడుల ముసుగులో భద్రతను పెంచుకోవడాన్ని తాను వ్యతిరేకిస్తానని ఆయన స్పష్టం చేశారు.అయితే భద్రత తీసుకోవాలా లేదా అనేదానిపై కార్యకర్తల అభిప్రాయం తెలసుకుంటానని, వారు అంగీకరిస్తే కార్యాలయం లో భద్రత కోరుతానని కేజ్రీవాల్ చెప్పారు. కాగా ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని ఆ పార్టీతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు ఖండించాయి.  
 
 ‘ప్రశాంత్’వ్యాఖ్యలపై భజరంగ్‌దళ్ ఆందోళన
 జమ్మూకాశ్మీర్ అంశంపై ఆమ్‌ఆద్మీపార్టీ నాయకుడు ప్రశాంత్‌భూషన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. ప్రశాంత్‌భూషన్ వ్యాఖ్యలను నిరసిస్తూ భజరంగ్‌దళ్ సభ్యులు బుధవారం జంతర్‌మంతర్‌లో ఆందోళన నిర్వహించారు. ప్రశాంత్‌భూషన్‌పై చర్యలు తీసుకోవాలంటూ వా రు రాష్ట్రపతికి ఓ లేఖ రాశారు.
 
 జంతర్‌మంతర్‌లో ప్రదర్శనలో భాగంగా ఆమ్‌నేత కే జ్రీవాల్,ప్రశాంత్‌భూషణ్ ఫొటోలను దహ నం చేశారు. భజరంగ్‌దళ్ ఢిల్లీ నాయకులు శివ్‌కుమార్ ఈ ఆందోళనకు నేతృత్వం వహించారు. జమ్మూకాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దాని పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారంతా దేశద్రోహులుగానే పరిగణిస్తామని ఆయన పేర్కొన్నారు. దేశప్రజలకు ప్రశాం త్‌భూషణ్‌తోపాటు ఆప్ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోనూ ఇదే అంశంపై నిరసన ప్రదర్శనలు కొనసాగాయి.    
 
 దుండగులకు బీజేపీతో సంబంధాలు
 ప్రశాంత్ భూషణ్ విమర్శ
 ఆప్ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారికి భారతీయ జనతాపార్టీతో సంబంధాలున్నాయి. ఆప్‌కు పెరుగుతున్న ప్రజాదరణ చూసి భయంతోనే బీజే పీ, సంఘ్‌పరివార్ ఇలా పరోక్షంగా దాడులకు దెగబడుతున్నాయి. ఇప్పటి దాడికి పాల్పడినట్లు చెప్పుకుంటున్న విష్ణు గుప్తా 2011లో తేజేందర్ సింగ్ బగ్గాతో కలిసి సుప్రీం కోర్టులోని నా చాంబర్‌లోనే నాపై దాడికి పాల్పడ్డారు. బగ్గాకు బీజేపీకి చాలా సన్నిహితమైన వ్యక్తి.
 
 బీజేపీ హస్తముంది: కుమార్ విశ్వాస్
 దాడిలో బీజేపీ హస్తముంది. ఢిల్లీ ఎన్నికల్లో వారు ఊహించిన దానికి వ్యతిరేకంగా జరగడంతో, ఇప్పు డు లోక్‌సభ ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి ఎదురవుతుందనే భయంతోనే ఆప్ కార్యాలయంపై దాడిచేయించారు. ఇది కరెక్ట్ కాదు... ఎవరి వ్యాఖ్యలైనా నచ్చకపోతే ఆందోళనలు చేయొచ్చు.. ధర్నాలు నిర్వహించవచ్చు.. లేదా కోర్టుకు వెళ్లవచ్చు.. అంతేకాని భౌతిక దాడులకు దిగడం వల్ల సమస్య మరింత జటిలమవుతుందే తప్ప పరిష్కారం కాదు.
 
 నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి:
 బీజేపీ నే అబ్బాస్ నఖ్వీ
 ఆప్ కార్యాలయంపై దాడిని ఖండిస్తున్నాం. నింది తులు ఎవరైనా సరే.. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే హక్కు ఎవరికీ లేదు. అలాగే ప్రశాంత్ భూషణ్ వ్యాఖ్యలపై మేం ఇంతకుముందే స్పందించాం. ఆయన వ్యాఖ్యలు దేశ సమగ్రత ముప్పు అని అప్పుడే వ్యాఖ్యానించాం.
 దాడి అహేతుకం: కాంగ్రెస్ నేత రాషిద్ అల్వీ ఆప్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. చట్టాన్ని ఎవరు అతిక్రమించినా చర్యలు తీసుకోవాల్సిందే. శాంతి భద్రతల విషయంలో యూపీ ప్రభుత్వం మరింత జాగ్రత్తగా వ్యవహరిం చాలి. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలి.
 
 ఎవరిని చంపాలనుకుంటున్నారు..?
 ఆప్ కార్యాలయంపై దాడి హేతుకం కాదు. హింసతో సమస్యలు పరిష్కా రం కావు. దాడికి పాల్పడిన వారు నాతో చర్చకు రావాలి. వారు ఏం కోరుకుంటున్నారు.. ప్రశాంత్‌జీని చంపాలనుకుంటున్నారా..లేక నన్ను చంపాలనుకుం టున్నారా.. మమ్మల్ని చంపడం ద్వారా కాశ్మీర్ సమస్య పరిష్కా రం అవుతుందనుకుంటే చావడానికి మేం సిద్ధం. కాశ్మీర్ సమస్యపై ప్రశాంత్ జీ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని, దానికి పార్టీతో ఎటువంటి సంబంధం లేదని మేం పార్టీ తరఫున ఎన్నో సార్లు స్పష్టం చేశాం. అయి నా ఇంకా వారు దాడులు కొనసాగిస్తున్నారు అంటే వివాదాన్ని సజీవంగా ఉంచడం కోసమే వారు ఇలా ప్రవర్తిస్తున్నారనిపిస్తోంది. దీనిపై చర్చకు రమ్మంటే ఎక్కడకు రమ్మన్నా రావడానికి నేను సిద్ధం..
 
 

Advertisement
Advertisement