బతికే అవకాశం ఫిఫ్టీ...ఫిఫ్టీ | Sakshi
Sakshi News home page

బతికే అవకాశం ఫిఫ్టీ...ఫిఫ్టీ

Published Mon, Dec 5 2016 1:53 PM

బతికే అవకాశం ఫిఫ్టీ...ఫిఫ్టీ

న్యూఢిల్లీ: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు ఆదివారం సాయంత్రం తీవ్రస్థాయిలో గుండెపోటు రావడంతో ఆమెకు ‘ఈసీఎంవో’ ఏర్పాటు చేశామని చెన్నైలోని ఆపోలో ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ఈసీఎంవో అంటే ఎక్‌స్ట్రాకార్పోరియల్ మెబ్రేన్ ఆక్సిజెనేషన్. శారీరక ధర్మాలను గుండె, ఊపిరితిత్తులు నిర్వహించలేక పోయినప్పుడు ఈ యాంత్రిక వ్యవస్థ ద్వారా వాటి విధులను నిర్వహింపజేస్తారు. రోగికి అత్యంత ప్రాణాపాయం ఉన్నప్పుడు మాత్రమే ఈ యాంత్రిక వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. ఇందులో రోగి బతికే అవకాశాలు ఫిఫ్టీ, ఫిఫ్టీ మాత్రమే ఉంటాయని ప్రముఖ హృద్రోగ నిపుణులు నరేశ్ ట్రెహాన్ తెలిపారు.

ఈ ఈసీఎంవో వ్యవస్థపై రోగులు కొన్ని రోజులు లేదా కొన్ని వారాలు కూడా జీవించే అవకాశం ఉంటుంది. ఏ రకంగాను వైద్యానికి రోగి శరీరం స్పందించకపోయిన పరిస్థితుల్లో చివరి అవకాశంగా మాత్రమే ఈ వ్యవస్థ ద్వారా చికిత్స అందిస్తారు. శరీర రక్తనాళాల నుంచి రక్తాన్ని గ్రహించే ఈ పరికరం, ఆ రక్తాన్ని తిరిగి గుండే, ఊపిరితిత్తుల ద్వారా శరీరం అంతటికి ప్రవహించేలా చేస్తోంది. ఈ ప్రక్రియలో రక్త కణాలకు అవసరమైన ఆక్సిజన్ కూడా అందిస్తుంది. సాధారణంగా ఈ ఈసీఎంఓను ప్రముఖలకు మాత్రమే ఏర్పాటు చేస్తుంటారు.

Advertisement
Advertisement