గుర్తుకొస్తున్నాయి | Sakshi
Sakshi News home page

గుర్తుకొస్తున్నాయి

Published Thu, Nov 20 2014 2:34 AM

గుర్తుకొస్తున్నాయి

 చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి అంటున్నారు ఎవర్‌గ్రీన్ బ్యూటీ శ్రీదేవి. ఈ బహుభాషా నటి బాలతారగా అరంగేట్రం చేసింది మద్రాసులోనే. నాటి నుంచి నేటి వరకు ఆమెది ప్రత్యేక శైలినే. హీరోయిన్‌గా తమిళం, తెలుగు, హిందీ భాషల్లో నటిస్తూ ప్రముఖ నటిగా వెలుగొందుతుండగానే బాలీవుడ్ నిర్మాత బోనీకపూర్‌ను వివాహమాడి ఆ తరువాత కొంతకాలం నటనకు దూరంగా ఉన్నారు. ఇటీవల ఇంగ్లీష్ వింగ్లీష్ చిత్రంతో తెరపైకివచ్చి మరోసారి నటిగా తానేమిటో నిరూపించుకున్నారు. దాదాపు 28 ఏళ్ల తరువాత శ్రీదేవి తమిళ చిత్రంలో నటిస్తుండడం విశేషం.
 
 విజయ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి మారిశన్ అనే పేరును నిర్ణయించినట్లు సమాచారం. సోషియా ఫాంటసీ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో శ్రుతిహాసన్, హన్సిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఒక ముఖ్యపాత్రలో శ్రీదేవి నటిస్తున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే ప్రారంభమైంది. ఈ చిత్రంలో పాల్గొనడానికి చెన్నైకి వచ్చిన శ్రీదేవి చిత్ర యూనిట్ ఆదరాభిమానాలకు సంతోషంతో తబ్బిబ్బైపోతున్నారు. దీనిగురించి ఆమె తన ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ ఒక కొత్తతమిళ చిత్రం కోసం చెన్నై షూటింగ్ పాల్గొంటున్నాను.
 
 చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని ముఖ్యంగా బాలతారగా తొలి చిత్ర షూటింగ్ సంఘటనలు గుర్తుకొస్తున్నాయని పేర్కొన్నారు. చిత్ర యూనిట్ తనపై చాలా ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారని తెలిపారు. ఈ తరహా నటీనటులు, సాంకేతిక వర్గం ఎంతో ప్రతిభను ప్రదర్శిస్తున్నారని కితాబిచ్చారు. వారితో కలిసి పని చేస్తున్నట్లు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటున్నానని అన్నారు. ఎప్పటిలాగే తనపై అభిమానం చూపుతున్న చెన్నై ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని శ్రీదేవి ట్విట్టర్‌లో పోస్టు చేశారు.
 
 

Advertisement
Advertisement