బెంగళూరు : మహబూబ్నగర్ జిల్లాలో పాలెం వోల్వో బస్సు దుర్ఘటన ఇంకా మరవక ముందే కర్ణాటకలో మరో ప్రమాదం చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హుబ్లీ-ధార్వాడ్ వెళుతున్న ఓ ప్రయివేటు బస్సులో మంటలు చెలరేగి ముగ్గురు ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. బెంగళూరు-పుణె జాతీయ రహదారి వరూర్ సమీపంలో గత రాత్రి 11 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది.
మంటల్లో చిక్కుకుని మరో ఎనిమిదిమంది గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 16మంది ప్రయాణిస్తున్నారు. పోలీసు ప్రాథమిక విచారణలో బస్సులో మద్యం సీసాలు, సిగరెట్లు, మండే పదార్థాలను లభించినట్లు తెలుస్తోంది. రాపిడి వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా మృతులను ఇంకా గుర్తించాల్సి ఉంది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.