దోష మంత్రం.. బంగారం మాయం! | Sakshi
Sakshi News home page

దోష మంత్రం.. బంగారం మాయం!

Published Sat, Mar 11 2017 3:09 AM

దోష మంత్రం.. బంగారం మాయం! - Sakshi

►  పట్టపగలే ఘరానా మోసం
► ప్రాణగండం ఉందంటూ పూజలతో బురిడీ
► రూ.4లక్షల విలువ చేసే బంగారు మోసం


రామసముద్రం : ఇంటిలో కుటుంబ సభ్యులకు ప్రాణ గండం ఉందని దడపుట్టించాడు. దోష నివారణ పూజలు చేస్తే బైటవచ్చంటూ నమ్మించాడు. ఆపై పూజల పేరిట బంగారం పిండుకున్నాడు. బాధితులు తాము మోసపోయామని గ్రహించేలోపు అదృశ్యమయ్యాడు. శుక్రవారం పట్టపగలే రామసముద్రంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. మధుమేహం, వాయునొప్పులకు మందులిస్తామంటూ రామసముద్రం దిగువ హరిజనవాడకు మధ్యాహ్నం ముగ్గురు వ్యక్తులు వచ్చారు. వారిలో ఆంజప్ప ఇంటి వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి అతడి భార్య సుబ్బలమ్మ, కుమార్తె భూదేవమ్మను పలకరించాడు.

ఇంటిలో దోషం ఉందని, ఎవరో చెడుపు చేశారని, అనారోగ్యం, ప్రమాదాలతో మరణం తప్పదని చెప్పడంలో హడలిపోయారు. కొన్ని పూజలు చేస్తే దోషం పోతుందని వారిని నమ్మించాడు. అప్పటికే భయపడిన సుబ్బలమ్మ దోషపూజలకు అంగీకరించింది. అతడు చెప్పిన మేరకు పూజా కార్యక్రమంలో ఉంచేందుకు సుబ్బలమ్మ ఐదు జతల కమ్మలు, కాసులదండ, రెండు ఉంగరాలు, రెండు జతల జుంకీలు, నగలతోపాటు పసుపు, ఒక గిన్నెలో బియ్యం తెచ్చి పెట్టింది.

ఆ తర్వాత  నగలను బియ్యం గిన్నెలో ఉంచి పూజకు సిద్ధం చేశాడు.  స్నానం చేసుకుని పూజలో నిష్టగా కూర్చోవాలని చెప్పడంతో సుబ్బులమ్మ నిజమేనని నమ్మి స్నానం చేసి వచ్చి చూసేసరికి బియ్యంతో ఉన్న గిన్నె మాత్రమే కనిపించింది! నగలు, పూజలు చేస్తానన్న వ్యక్తి లేకపోవడంతో బావురుమంది. నోట్లో బియ్యం కొట్టాడ్రా నాయనా! అని గగ్గోలు పెట్టింది. స్థానికులకు విషయం చెప్పి చుట్టుపక్కల గాలించినా ఫలితం శూన్యం. చేసేదిలేక భర్త సాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. బంగారు నగలు రూ.4లక్షలు విలువ చేస్తానని బాధితురాలు భోరున విలపించింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement