చెన్నై: చెన్నై నుంగంబాక్కంలోని స్టార్ హోటల్లో రగడ సృష్టించిన ప్రేమికులను పోలీసులు అరెస్టు చేశారు. తాగిన మత్తులో స్టార్ హోటల్లోని రూ. 50 వేల విలువైన అద్దాలను పగులగొట్టిన ఉత్తరాదికి చెందిన ప్రేమికులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరుణాచల్ప్రదేశ్ కేడాకు చెందిన దాఖర్ (26) చెన్నైలోని ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్నాడు.
సోమవారం అతడు తన ప్రియురాలు జియో జయథాన్ సంగ్ (23)తో కలిసి నుంగంబాక్కం అన్నా వంతెన సమీపంలోని స్టార్ హోటల్కు వెళ్లాడు. రాత్రంతా మద్యం తాగిన ఈ జంట తెల్లవారుజామున 3.30 గంటలకు బయలుదేరారు. అయితే తాగిన మైకంలో ఈ జంట హోటల్ ప్రవేశ ద్వారం వద్ద రూ. 50 వేలతో నిర్మించిన అద్దాలపై పడ్డారు. దీంతో అవి పగిలిపోయాయి. దీనిపై ప్రశ్నించిన హోటల్ సిబ్బందిపై కూడా వీరు దాడికి దిగారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రేమికుల్ని విచారించారు. తాగిన మత్తులో ఉండడంతో వివరాలు తెలియరాలేదు. దీంతో ప్రేమికులను అరెస్టు చేశారు.