మహిళా డాక్టర్‌పై తండ్రి వేధింపులు? | Sakshi
Sakshi News home page

మహిళా డాక్టర్‌పై తండ్రి వేధింపులు?

Published Fri, Mar 13 2015 3:17 AM

Father sexual harassment on Female Doctor

 టీనగర్: తిరునెల్వేలిలో మహిళా డాక్టర్‌పై ఆమె తండ్రి లైంగికంగా వేధించి, హోంలో నిర్బంధించారు. ఆమెను తనతో పనిచేస్తున్న డాక్టర్, స్నేహితురాళ్లు విడిపించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే,తూత్తుకుడికి చెందిన లూర్థురాజ్ చెన్నైలో కెమికల్ వ్యాపారం చేస్తున్నారు. ఇతనికి భార్య శాంత ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. ప్రస్తుతం వీరు చెన్నై ఎర్నావూరు రామకృష్ణానగర్‌లో నివసిస్తున్నారు. కుమార్తె  నందిని చెన్నైలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో దంత వైద్యురాలిగా పని చే స్తున్నారు. అయితే నందినికి మానసిక స్థితి సరిలేదని చెప్పి ఆమె తండ్రి, బంధువులు పాళయంకోట్టైలోని మానసిక వికలాంగుల కేంద్రంలో చేర్పించారు. బుధవారం ఆమెను చూసేందుకు ఆమెతో పాటు పనిచేసిన డాక్టర్, స్నేహితురాళ్లు వచ్చారు.
 
 అయితే నందినిని చూసేందుకు హోం నిర్వాహకులు అనుమతించలేదు. దీనిపై ఐద్వాకు చెందిన న్యాయవాదులు పళని, భాస్కర్‌కు తెలిపారు. వారు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో అనుమతి లభించింది. ఆమెను ప్రత్యేక గదిలో నిర్బంధించి కిటికీ ద్వారా మాత్రమే చూసేందుకు అనుమతినిచ్చారు. అప్పుడు నందిని జరిగిన సంఘటనల వివరాలను వారికి తెలిపి రోదించింది. ఒక లేఖను కూడా వారికి అందజేసింది. దీంతో ఆమెను హోం నుంచి విడిపించేందుకు చర్యలు తీసుకున్నారు. గురువారం ఉదయం 8.30 గంటలకు స్నానం చేసేందుకు వెళ్లిన నందిన హోం నుంచి తప్పించుకుని బయటికి వచ్చింది. అక్కడ సిద్ధంగా వున్న న్యాయవాదులు, స్నేహితురాళ్లు ఆమెను కారులో ఎక్కించుకున్నారు. దీన్ని గమనించిన హోం వార్డెన్లు వారిని అడ్డుకోడానికి ప్రయత్నించారు.
 
 అయినప్పటికీ వారి నుంచి తప్పించుకుని నందినిని పాళయంకోట్టై మహిళా పోలీసు స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అంతలోనే హోం నుంచి నందినిని కిడ్నాప్ చేసినట్లు హోం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ జరిపారు. నందిని వద్ద పోలీసులు జరిపిన విచారణలో అనేక వివరాలు తెలిశాయి. నందిని మానసిక రోగి కాదని, చదువుతున్న సమయంలో యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించిందని, తండ్రి లూర్థురాజ్ కుమార్తెను లైంగికంగా వేధించడంతో, ఆమె 15 రోజుల క్రితం నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసంది. దీంతో ఆమెను పాళయంకోట్టైలోగల ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ నుంచి పాళయంకోట్టైలో గల మహిళా సంరక్షణాలయంలో చేర్చారు. దీనిపై నందిని పాళయంకోట్టై మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  పోలీసులు కేసు నమోదు చేసి లూర్థురాజ్ అతనికి సహకరించిన వారి కోసం గాలిస్తున్నారు.
 
 తండ్రిపై అభాండాలు: తల్లి వసంత
 వివాహమైన డాక్టర్‌తో నందినికి సంబంధం వున్నందు న దీనిని దారి మళ్లించేందుకే తండ్రిపై అభాండాలు వేస్తున్నట్లు నందిని తల్లి వసంత ఆరోపించారు. చెన్నై కు చెందిన డాక్టర్ దినేష్ తన మొదటి భార్య వుండగానే ఆస్పత్రిలో పనిచేస్తున్న మరొక మహిళా డాక్టర్‌ను వివాహం చేసుకునేందుకు ప్రయత్నించగా, ఈ వ్యవహారం పోలీసులకు వెళ్లడంతో వివాహం నిలిచిపోయిందన్నారు.అతను తన కుమార్తెను  లొంగదీసుకున్నాడని ఆరోపించారు. అతడి ప్రేమ మోహం లో ఉన్న నందిని తన తండ్రిపైనే అభాండాలు వేస్తునట్లు తెలిపారు.

Advertisement
Advertisement