మిత్రుల్లో ‘చిచ్చు’కు కుట్ర | Sakshi
Sakshi News home page

మిత్రుల్లో ‘చిచ్చు’కు కుట్ర

Published Sat, Jun 7 2014 11:59 PM

Government trying to secure Alexis Premkumar's release: Pon Radhakrishnan

 సాక్షి, చెన్నై : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పొన్ రాధాకృష్ణన్‌ను కేంద్ర భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి పదవి వరించిన విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టినానంతరం తొలి సారిగా శనివారం ఆయన చెన్నైకు వచ్చారు. మీనంబాక్కం విమానాశ్రయంలో ఆ పార్టీ వర్గాలు ఆయనకు బ్రహ్మరథం పట్టాయి. దారి పొడవున ఫ్లెక్సీలు, బ్యానర్లతో ఘన స్వాగతం పలికారు. టీ నగర్‌లోని కమలాల యంలోను ఆయనకు అపూర్వ స్వాగ తం లభించింది. రాష్ట్రపార్టీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి హోదాతో తొలిసారిగా కమలాలయూనికి వచ్చిన ఆయన్ను అక్కడి సిబ్బంది అభినందించారు. సమాలోచన: కమలాలయంలో తిరువళ్లూరు, కాంచీపురం, చెన్నై జిల్లా పార్టీల నాయకులతో రాధాకృష్ణన్ సమాలోచన జరిపారు. పార్టీ బలోపే తం, ఆయా ప్రాంతాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించారు. ఈ మూడు జిల్లాల పరిధిలో పార్టీకి వచ్చి న ఓటు బ్యాంక్ ఆధారంగా మరింత బలోపేతానికి సూచనలు ఇచ్చారు.
 
 పరిశ్రమలతో ఉపాధి మెరుగు: మీడియాతో పొన్ రాధాకృష్ణన్ మాట్లాడుతూ, పార్టీ అధ్యక్ష మార్పు అధిష్టానం చేతిలో ఉందన్నారు. కొత్త అధ్యక్షుడు ఎవరన్నది త్వరలో అధిష్టానం ప్రకటిస్తుందని పేర్కొన్నారు. తమిళనాడు సీఎం జయలలిత ఢిల్లీ వచ్చిన సందర్భంలో తనతో భేటీ అయ్యారని గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమలు, రానున్న కాలంలో నెలకొల్పాల్సిన పరిశ్రమలు, తదితర అంశాలపై చర్చించినట్లు వివరించారు. రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయని, తద్వారా  ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగు పడనున్నాయని తెలిపారు. తమిళ జాలర్లపై దాడులకు అడ్డుకట్ట వేయడం లక్ష్యంగా కేంద్రం చర్యలు తీసుకుంటోందన్నారు. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం ఈ దాడులకు ఆరు నెలల్లోపు అడ్డుకట్ట వేసి తీరుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈలం తమిళులకు సమ న్యాయం లక్ష్యంగా తప్పకుండా ప్రధాని మోడీ కృషి చేస్తారని పేర్కొన్నారు. కావేరి సంక్షేమ బోర్డు ఏర్పాటు లక్ష్యంగా కేంద్రం తప్పకుండా చర్యలు తీసుకుంటుందని, కర్ణాటక నుంచి తమిళనాడుకు వాటా నీటిని పంపింగ్ చేయించి తీరుతానని ధీమా వ్యక్తం చేశారు.
 
 అసంతృప్తి: కేంద్రంలో పదవులు దక్కలేదన్న అసంతృప్తి పీఎంకే, డీఎండీకేల్లో కనిపిస్తోందే? అని మీడియా ప్రశ్నించగా, అటువంటిదేమీ లేదన్నారు. ఆ పార్టీ నాయకులతో తాను మాట్లాడానని, వారిలో ఎలాంటి అసంతృప్తి లేదని స్పష్టం చేశారు. కూటమిలో చీలిక రాబోతున్నట్టుందే? అని మరో ప్రశ్న సంధించగా, మిత్రులందరం ఏక తాటి మీదే ఉన్నామని, తమలో చీలిక వచ్చే ప్రసక్తే లేదన్నారు. అయితే, మిత్రుల మధ్య చిచ్చు పెట్టి చీల్చే కుట్ర జరుగుతోంద ని, ఈ కుట్ర చేస్తున్న వారి ప్రయత్నాలు ఫలించబోవన్నారు. రాష్ట్రంలో ని బీజేపీ కూటమిలో ఉన్న అన్ని పార్టీల లక్ష్యం రానున్న అసెంబ్లీ ఎన్నికలేనంటూ ముగించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలు వానతీ శ్రీనివాసన్, మోహన్ రాజులు, సవేరా చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement