కూతురి గొంతు కోసి.. కొడుకు మర్మాంగాన్ని కత్తిరించి.. | Sakshi
Sakshi News home page

కూతురి గొంతు కోసి.. కొడుకు మర్మాంగాన్ని కత్తిరించి..

Published Fri, Jul 18 2014 8:14 AM

కూతురి గొంతు కోసి.. కొడుకు మర్మాంగాన్ని కత్తిరించి.. - Sakshi

బళ్లారి (తోరణగల్లు) : పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లే కత్తితో కర్కశంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఆఖరుకు తానూ ఉరేసుకుంది. బళ్లారి జిల్లా సిరిగేరి పోలీసుల సమాచారం మేరకు... కరూరు గ్రామానికి చెందిన మహేష్, లక్ష్మి(24) దంపతులు. వీరికి కూతురు విద్య(5), కుమారుడు శశిధర్(3) ఉన్నారు.

కుటుంబ సమస్యల నేపథ్యంలో బుధవారం రాత్రి దంపతులు గొడవపడ్డారు. అనంతరం పనిపై మహేష్ బయటకు వెళ్లాడు. ఆ సమయంలో పిల్లలను గదిలోకి తీసుకెళ్లిన లక్ష్మి చాకుతో విచక్షణారహితంగా దాడి చేసింది. విద్య తల, గొంతు, శరీరంపై తీవ్రంగా గాయపరిచింది. శశిధర్ మర్మాంగాన్ని కోసి.. తలపై దాడి చేసి గాయపరిచింది. అనంతరం అదే గదిలోని ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

రాత్రి పది గంటలకు ఇంటికి చేరుకున్న మహేష్ తలుపులు తట్టాడు. లోపలి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అనుమానంతో తలుపులు బద్ధలుకొట్టి లోపలకు ప్రవేశించాడు. రక్తపు మడుగులో పడి ఉన్న పిల్లలను, ఉరికి వేలాడుతున్న భార్యను విమ్స్ ఆస్పత్రికి తరలించాడు. లక్ష్మి మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారుల పరిస్థితి విషమంగా ఉంది. కేసు దర్యాప్తులో ఉంది.
 

Advertisement
Advertisement