ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట పెంచాలి | Sakshi
Sakshi News home page

ఢిల్లీ పోలీసుల ప్రతిష్ట పెంచాలి

Published Wed, Sep 24 2014 10:14 PM

Najeeb Jung appeals Delhi Police to increase

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీపోలీసుల ప్రతిష్టను పెంపొం దించేలా చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ పోలీసు ఉన్నతాధికారులకు సూచిం చారు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులతో బుధవారం రాజ్‌భవన్‌లో నిర్వహించిన సమావేశంలో లెఫ్టినెం ట్ గవర్నర్ ప్రసంగించారు. ప్రజలతో సత్ససంబంధాలు, నైతిక విలువలు పెంపొందించుకొనెలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఉన్నతాధికారులు నిజాయతీగా వ్యవహరించి ఎస్‌హెచ్‌ఓలు, కానిస్టేబుల్స్‌కు  స్ఫూర్తిని ఇవ్వాలని ఆయన చెప్పారు. ఢిల్లీ పోలీసుల పట్ల గల దురభిప్రాయం పోవాలంటే వారు అన్ని రకాల అవినీతికి దూరంగా ఉండాలని అన్నారు. కిందిస్థాయి సిబ్బంది అవినీతి అక్రమాలకు పాల్పడకుండా, ప్రజలను వేధించకుం డా, బెదిరించకుండా  ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అన్నారు.
 
 ఈ సందర్భంగా ఎఫ్‌ఐఆర్‌లు దాఖలు చేయడంలో ఢిల్లీ పోలీసులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటున్నారని, దాని వల్ల నగరంలో  కేసుల నమోదు సంఖ్య పెరిగిందని పోలీస్ కమిషనర్ లెఫ్ట్‌నెంట్ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా ఢిల్లీ పోలీసులను లెఫ్ట్‌నెంట్ గవర్నర్ అభినందించారు. ఢిల్లీ పోలీసులు అదే స్ఫూర్తితో ముందుకు సాగాలని సూచించారు. తప్పు చేసిన సిబ్బందిని శిక్షించడం వల్ల కొంత ఫలితం ఉన్నప్పటికీ అదే పరిష్కారం కాదని, విధుల్లో నైతిక విలువలు పాటించేలా అవగాహన కల్పించాలని అన్నారు. ఠానా స్థాయి కమిటీలు మరింత చురుకుగా పనిచేయాలని, ఫీల్డ్ ఆఫీసర్లు ప్రజాప్రతినిధులతో సత్సంబంధాలను కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో పోలీసు కమిషనర్ బస్సీతో పాటు ప్రత్యేక పోలీసు కమిషనర్లు, జాయింట్ పోలీసు కమిషనర్లు, డిప్యూటీ పోలీసు కమిషనర్లు పాల్గొన్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement