2019లో అధికారంలోకి రావడమే లక్ష్యం.. | Sakshi
Sakshi News home page

2019లో అధికారంలోకి రావడమే లక్ష్యం..

Published Sat, Apr 8 2017 7:23 PM

2019లో అధికారంలోకి రావడమే లక్ష్యం.. - Sakshi

భువనగిరి: తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తమ పార్టీ రాష్ట్ర అభివృద్ధికీ సహకరిస్తుందని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ అన్నారు.  భువనగిరిలో శనివారం ఏర్పాటు చేసిన పార్టీ భువనగిరి పార్లమెంట్‌ నియోజకవర్గస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. తెలంగాణలో 2019లో అధికారంలోకి రావడమే లక్ష్యమని స్పష్టం చేశారు. అందుకోసం కార్యకర్తలు ఇప్పటినుంచే సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వ అభివృద్ధి పథకాలకు సహకరిస్తూనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందన్నారు.

సెప్టెంబర్‌ 17న హైదరాబాద్‌ విమోచన దినోత్సవాన్ని అన్ని రాష్ట్రాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నా ఇక్కడెందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉందని చూడకుండా అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూస్తున్నామన్నారు. మోదీ నాయకత్వంలో దేశం శరవేగంతో ప్రగతిపథంలో పయనిస్తుండగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ఊహించని రీతిలో విజయపథంలో దూసుకెళ్తుతుందన్నారు. రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ మాట్లాడుతూ.. అస్సాం, మణిపూర్‌ను ఆదర్శంగా తీసుకొని 2019లో భువనగిరి నియోజకవర్గంలో ఖాతా తెరుస్తామన్నారు. ప్రజలను అన్ని రకాలుగా వంచించిన టీఆర్‌ఎస్‌కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. టీఆర్‌ఎస్‌కు బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమన్నారు. జిల్లా అధ్యక్షుడు శ్యామ్‌సుందర్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో నాయకులు ఇంద్రసేనారెడ్డి, వెదిరె శ్రీరామ్‌, కాసం వెంకటేశ్వర్లు, మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement