ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధం
ఏటూరునాగారం: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదని, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతిఒక్కరూ తప్పకుండా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్వీఈఈపీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారిణి స్వర్ణలత లెనినా అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో శనివారం దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లకు పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయో వృద్ధులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించినట్లు తెలిపారు. నడవలేని వారి కోసం పోలింగ్ రూంలోకి తీసుకెళ్లడానికి వీల్చైర్లతో పాటు ర్యాంపులు ఏర్పాటు చేసినట్లు వివరించారు. అదే విధంగా వీరికోసం ప్రత్యేకమైన క్యూలైన్లు, తాగునీటి వసతితో పాటు మరుగుదొడ్డి వంటి సౌకర్యాలు కల్పించినట్లు వెల్లడించారు. అంధులకు బ్రెయిలీ లిపిలో బ్యాలెట్ పేపర్లతో పాటు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బధిరులకు సైతం ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. అనంతరం ఏటూరునాగారం ఎంపీడీఓ కుమార్ మాట్లాడుతూ ఓటు హక్కుపై పలు సూచనలు చేశారు. అనంతరం ఓటర్లతో ఓటు నమోదుపై ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ఐటీడీఏ కార్యాలయం లోని ఉద్యోగులందరికీ ఎస్వీఈఈపీ కార్యక్రమంలో భాగంగా ఐటీడీఏ వద్ద ఏపీఓ వసంతరావుతో కలిసి ఓటర్ సెల్ఫీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీడీపీఓ హేమలత, దివ్యాంగుల సంఘం నాయకులు పొన్నం సంతోష్, మాణిక్యరావు, స్థానిక బీఎల్ఓలు పాల్గొన్నారు.
వృద్ధాశ్రమంలో ఓటర్లకు అవగాహన
మంగపేట: మండల కేంద్రంలోని కస్తూర్బా వృద్ధాశ్రమంలో ఎస్వీఈఈపీ పీడబ్ల్యూడీ నోడల్ అధికారి స్వర్ణలత లెనినా, ములుగు అసెంబ్లీ నోడల్ అధికారి సతీష్ ఆధ్వర్యంలో వృద్ధులకు ఓటరు అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్లు పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన సౌకర్యాలపై వారు వివరించారు. ముఖ్యంగా దివ్యాంగులు, వయోవృద్ధులను ఇంటి నుంచి పోలింగ్ కేంద్రం వద్దకు తీసుకెళ్లడానికి ఉచిత రవాణా సౌకర్యంతో పాటు తదితర అంశాలపై వివరించారు.