హైదరాబాద్: నల్గొండలో జిల్లా టీడీపీ కార్యాలయంపై దాడికి ముగ్గురు టీఆర్ఎస్ నేతలు బాధ్యులని టీటీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో గవర్నర్ నరసింహన్తో టీటీడీపీ ఎమ్మెల్యే భేటీ అయ్యారు. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు, కరెంట్ కోతలు, టీడీపీ కార్యాలయాలపై దాడులను ఈ సందర్భంగా టీటీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్కు వివరించారు. అనంతరం ఎర్రబెల్లి దయాకరరావు విలేకర్లతో మాట్లాడుతూ... మంత్రి జగదీశ్రెడ్డి రెచ్చగొట్టడం వల్లే ఈ దాడులు జరిగాయని తెలిపారు.
రైతు సమస్యలపై దృష్టి మరల్చేందుకే ఈ దాడులు అని ఆయన విమర్శించారు. జూపల్లి కృష్ణారావు ఎస్ఎంఎస్లు ఇచ్చి ప్రజలను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. జగదీశ్రెడ్డిని మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని... అలాగే జూపల్లిని అరెస్ట్ చేయాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మునుగోడు ఎమ్మెల్యే ప్రభాకర్ దగ్గరుండి మరీ మాపై దాడి చేయించారన్నారు. ఈ దాడిలో తమ కార్ల అద్దాలను పగలగొట్టించారన్నారు. చంద్రబాబు, టీడీపీపై కేసీఆర్ తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నారని అన్నారు. కరెంట్ లేక పంటలు ఎండిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు రూ. 30 వేలు చొప్పున పరిహారం చెల్లించాలని... అలాగే ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి రూ. 10 లక్షలు చెల్లించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.