పోలీసులపై దూసుకెళ్లిన లారీ

3 Jan, 2017 03:27 IST|Sakshi

ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి.. నలుగురికి తీవ్ర గాయాలు

నాగార్జునసాగర్‌: రోడ్డుపై బోల్తాపడిన ట్రాక్టర్‌ని తొలగిస్తున్న పోలీసులు, జెన్‌కో ఉద్యోగులపై ఓ లారీ దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు పోలీసులు సహా నలుగురు మృతి చెందగా, మరో నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌ సమీపంలో సోమవారం రాత్రి ఈ ప్రమా దం చోటు చేసుకుంది. సాగర్‌ దయ్యాలగండి రోడ్డుపై ఓ గడ్డి ట్రాక్టర్‌ బోల్తా పడింది. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో పోలీసులు బోల్తా పడిన ట్రాక్టర్‌ను అక్కడి నుంచి తొలగిస్తుండగా, నాగార్జునసాగర్‌  హైదరాబాద్‌ వైపు వెళ్తున్న లారీ వేగంగా వచ్చి పోలీస్, జెన్‌కో ఉద్యోగులను, వారి వాహనాలను ఢీకొట్టుకుంటూ వెళ్లిపోయింది.

ఎస్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ మరియదాస్‌ (35), పెద్దవూర పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్న బాలు నాయక్‌ (25), గుంటూరు జిల్లా మార్కాపురానికి చెందిన హసీబ్‌ (19), పెద్దవూర మండలం నెల్లికల్లుకు చెందిన చంద్రయ్య(45)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో  ఎడమకాలువపై ఉన్న విద్యుత్‌ ఉత్పాదక కేంద్రంలో పనిచేస్తున్న ఏఈ క్రాంతిభూషణ్‌తో పాటు మరో ముగ్గురు  గాయపడ్డారు. క్షతగాత్రులను సాగర్‌ కమలానెహ్రూ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు