బడి బస్సుకు బాలిక బలి | Sakshi
Sakshi News home page

బడి బస్సుకు బాలిక బలి

Published Tue, Aug 28 2018 8:51 AM

Girl Died In Bus Accident - Sakshi

ఇబ్రహీంపట్నంరూరల్‌ రంగారెడ్డి : అన్నను బస్సెక్కించి బాయ్‌.. అని చెబుతూ వెనక్కి వెళ్తున్న ఆ చిన్నారిని అదే బస్సు చిదిమేసింది. రాఖీ కట్టిన చెల్లి 24 గంటలు గడవక ముందే అన్నకు దూరమైంది. ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ పరి«ధిలో జరిగిన ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు ఇలావున్నాయి.. మంచాల మండలం ఆరుట్ల గ్రామానికి చెందిన బోయిని వెంకటేష్‌ చందన దంపతులు ఇబ్రహీంపట్నం మండలం యంపీపటేల్‌గూడ సమీపంలోని అంతపురం కాలానీలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్‌ ఏఆర్‌ కానిస్టేబుల్‌. ప్రస్తుతం ఆయన రాచకొండ జాయింట్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు వద్ద గన్‌మెన్‌గా పనిచేస్తున్నారు. వీరికి ప్రతీక (18నెలలు), ప్రజ్వాల్‌ (5) సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఉన్నారు.

ప్రజ్వాల్‌ను స్థానికంగా బొంగ్లూర్‌ గేటు వద్ద ఉన్న సాహితీ  పాఠశాలలో నర్సరీ చదివిస్తున్నారు. రోజు స్కూల్‌ బస్సు వచ్చి ప్రజ్వాల్‌ను తీసుకుపోతుంది. రోజులాగే సోమవారం ప్రజ్వాల్‌ను స్కూల్‌ బస్సు ఎక్కించడానికి తల్లి చందన చిన్నారి ప్రతీకను తీసుకొని వచ్చింది.  బస్సు రాగానే ప్రతీకను కింద వదిలేసి ప్రజ్వాల్‌ను ఎక్కించింది. కొడుకుని బస్సు ఎక్కించి కిందికి దిగేలోపే స్కూల్‌ బస్సు కదిలింది.  చిన్నారి ప్రతీక బస్సు ముందు చక్రాల వైపు వచ్చింది. డ్రైవర్‌ చూసుకోకపోవడంతో అలాగే నడిపించాడు.

చిన్నారి తలపై నుంచి ముందు చక్రం వెళ్లడంతో చిన్నారి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కళ్ల ముందే బిడ్డ మరణం చూసిన చందన గుండెలు బాదుకుంది. డ్రైవర్‌ బస్సును వదిలి పరారయ్యాడు. గ్రామస్తులు వచ్చి పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రెండు గంటల అనంతరం చిన్నారి మృతదేహాన్ని సంఘటన స్థలం నుంచి తరలించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ మోహన్‌రెడ్డి తెలిపారు.

Advertisement
Advertisement