Sakshi News home page

భారీగా నిలిచిపోయిన వాహనాలు.. ఓటర్లకు తిప్పలు

Published Wed, Apr 10 2019 10:12 AM

Heavy Traffic Jam At Panthangi Toll Plaza - Sakshi

యాదాద్రి: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటు వేసేందుకు సొంతూళ్లకు బయలుదేరిన ఓటర్లకు తిప్పలు తప్పడం లేదు. హైదరాబాద్‌ -విజయవాడ జాతీయ రహదారిపై పంతంగి టోల్‌ప్లాజా వద్ద వాహనాలు భారీగా నిలిచిపోయాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో రేపు ఎన్నికలు జరుగుతున్నందున ఓటు హక్కును వినియోగించుకునేందుకు హైదరాబాద్‌ నగరం నుంచి ఓటర్లు మంగళవారం రాత్రి నుంచి సొంతూళ్లకు బయల్దేరారు. దీంతో అర్ధరాత్రి నుంచి ఈ రహదారిపై వాహనాలు భారీగా బారులు తీరాయి. బుధవారం తెల్లవారుజాము నుంచి చౌటుప్పల్‌ మండలం పంతంగి టోల్‌గేట్‌ వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.



విజయవాడ వైపుకు వెళ్లే వాహనాలు పోటేత్తడంతో.. ట్రాఫిక్‌ జామ్‌ భారీగా అయ్యింది. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. టోల్‌ ఫీజులేకుండా వాహనాలను వదిలిపెట్టాలని ప్రయాణికులు డిమాండ్‌ చేస్తున్నారు. గంటలకొద్ది వేచిఉండడంతో టోల్‌గేట్‌ సిబ్బందిపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. దీంతో గేట్‌ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఎన్నికల నేపథ్యంలో రైల్వే స్టేషన్లో కూడా పరిస్థితి ఇదే విధంగా ఉంది. ఏపీకి వెళ్లే ఓటర్లు పెద్దఎత్తున రావడంతో రైళ్లన్ని కిక్కిరిసిపోతున్నాయి. (చదవండి: ఓటేయడానికి పోటెత్తారు!)

Advertisement

What’s your opinion

Advertisement