టీఆర్‌టీపై రేపు హైకోర్టు తీర్పు | Sakshi
Sakshi News home page

టీఆర్‌టీపై రేపు హైకోర్టు తీర్పు

Published Thu, Nov 23 2017 2:56 AM

High Court verdict on TRT willbe tomorrow - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కొత్తగా ఏర్పాటైన 31 జిల్లాల ఆధారంగా ఉపాధ్యాయ నియామక పరీక్ష (టీఆర్‌టీ) నిర్వహించడం రాష్ట్రపతి ఉత్తర్వులకు వ్యతిరేకమంటూ దాఖలైన వ్యాజ్యంపై ఈ నెల 24న తీర్పు వెలువడనుంది. బుధవారం పిటిషనర్, ప్రభుత్వ వాదనలు ముగియడంతో తమ నిర్ణయాన్ని శుక్రవా రం 24న వెల్లడిస్తామని హైకోర్టు తాత్కాలిక ప్రధా న న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ జి.శ్యాంప్రసాద్‌తో కూడిన ధర్మాసనం ప్రకటించింది. కొత్తగా ఏర్పాటు చేసిన 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన జి.అరుణ్‌కుమార్‌ మరో ముగ్గురు దాఖలు చేసిన వ్యా జ్యం బుధవారం మరోసారి విచారణకు వచ్చింది.

పరీక్ష వాయిదా పడకుండా చూడండి: ఏజీ
31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నియామకాల్ని సవాల్‌ చేసిన వ్యాజ్యంలో అంతిమంగా పిటిషనర్లు విజయం సాధిస్తే.. పూర్వపు పది జిల్లాలకే టీఆర్‌టీని వర్తింపజేస్తామని ఏజీ దేశాయ్‌ ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇదే జరిగితే దరఖాస్తుల స్వీకరణ గడువు 15 రోజులు పొడిగిస్తామని చెప్పారు. అభ్యర్థులు పది జిల్లాల్లో ఎక్కడి వారో తెలుసుకునేందుకు అధికారులకు ఇబ్బందేమీ లేదన్నారు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకే టీఆర్‌టీ నిర్వహిస్తున్నామని, వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారంలో పరీక్షలు నిర్వహించాలన్న ప్రభుత్వ నిర్ణయం అమలయ్యేలా చూడాలని, పరీక్ష వాయిదా పడకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. 31 జిల్లాలను పరిగణనలోకి తీసుకుని పరీక్ష నిర్వహిస్తే స్థాని క అభ్యర్థులకు అన్యాయం జరగదని, రాష్ట్రపతి ఉత్తర్వుల్ని ఉల్లంఘించినట్లు కాదని ఏజీ వాదించారు.

స్థానికులకు అన్యాయం: పిటిషనర్‌
పాఠశాల విద్యా శాఖ అక్టోబర్‌ 10న జీవో 25, అందుకు అనుగుణంగా 31 జిల్లాల ఆధారంగా టీఆర్‌టీ నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని పిటిషనర్‌ న్యాయవాది ఎస్‌.రాహుల్‌రెడ్డి వ్యతిరేకించారు. తెలంగాణలోని పూర్వపు పది జిల్లాలకే రాష్ట్రపతి ఆమోదముందని, కొత్తగా ఏర్పడిన జిల్లాలకు ఆమోదం లేదని వాదించారు. ఈ పరిస్థితుల్లో కొత్త జిల్లాలోని అభ్యర్థి పూర్వపు జిల్లాలో స్థానికేతరుడిగా నష్టపోతున్నారని చెప్పారు. 1976లోనే లోకల్‌ కేడర్‌ నిర్ధారణ జరిగిందని, కొత్త జిల్లాలకు రాష్ట్రపతి ఆమోదం లేనప్పుడు 31 జిల్లాల్ని పరిగణనలోకి తీసుకోవడం చెల్లదన్నారు. పాలనా సౌలభ్యం కోసమే 31 జిల్లాల ఏర్పాటు జరిగిందని చెప్పిన ప్రభుత్వం ఉద్యోగ నియామకాలకు కూడా కొత్త జిల్లాల్ని ప్రామాణికంగా తీసుకోవడం చట్ట విరుద్ధమని పేర్కొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement