Sakshi News home page

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ

Published Sun, Mar 29 2015 2:26 AM

ఇంట్లోకి దూసుకెళ్లిన లారీ - Sakshi

నిద్రలోనే తల్లి, కుమారుడు, కుమార్తె దుర్మరణం
 
నర్సింహులపేట: వరంగల్ - ఖమ్మం ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లోకి లారీ దూసుకెళ్లడంతో అందులో నిద్రిస్తున్న తల్లి, కుమారుడు, కుమార్తె మృతిచెందిన సంఘటన వరంగల్ జిల్లా నర్సింహులపేట మండలం బీరిశెట్టిగూడెంలో శనివారం వేకువజామున జరిగింది. బీరిశెట్టిగూడెం గ్రామానికి చెందిన  బండి ఐల్‌రెడ్డి, బండి సునీత దంపతులు గ్రామ స్టేజీ సమీపంలో ఇల్లు అద్దెకు తీసుకుని హోటల్ నడుపుతూ జీవనం సాగిస్తున్నారు. శుక్రవారం రాత్రి సునీత(35), కుమారుడు రాహుల్‌రెడ్డి(15), కూతురు ప్రగతి(13) ఇంట్లో నిద్రిస్తుండగా, ఐల్‌రెడ్డి ఇంటి బయట మంచంలో నిద్రపోయాడు.

శనివారం వేకువజామున సుమారు 2.45 గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న హర్యానాకు చెందిన లారీ అతివేగంగా వారింట్లోకి దూసుకెళ్లింది. దీంతో గోడలు కూలడంతో నిద్రలో ఉన్న సునీత, రాహుల్‌రెడ్డి, ప్రగతి అక్కడికక్కడే మృతిచెందారు. బయట పడుకున్న ఐల్‌రెడ్డిపై రేకులు పడడంతో వెంటనే నిద్రలేచాడు. అదే ఇంట్లో మంచంలో నిద్రిస్తున్న పక్కింటికి చెందిన వృద్ధురాలు పిట్సోజు శ్రీశైలమ్మపై కూడా కొన్ని మట్టిపెళ్లలు పడినా  ఎలాంటి గాయూలు కాలేదు. మహబూబాబాద్ డీఎస్పీ నాగరాజు, తొర్రూరు, కురవి సీఐలు శ్రీధర్‌రావు, కరుణసాగర్‌రెడ్డి సంఘటన స్థలాన్ని సందర్శించారు. డోర్నకల్ ఎమ్మెల్యే  రెడ్యానాయక్ ఉదయాన్నే సంఘటన స్థలాన్ని సందర్శించి జరిగిన ఘటనపై పోలీసు అధికారులను, స్థానికులను అడిగి తెలుసుకున్నారు.
 
 

Advertisement

What’s your opinion

Advertisement