విధిగా ఓటేసేలా చట్టం రావాలి: హరీశ్‌ | Sakshi
Sakshi News home page

విధిగా ఓటేసేలా చట్టం రావాలి: హరీశ్‌

Published Sat, Jan 26 2019 4:07 AM

The leader who serves the people in a democratic country is possible - Sakshi

సాక్షి, సిద్దిపేట: ‘మనకు నచ్చిన.., ప్రజలకు సేవ చేసే నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఒక్క ప్రజాస్వామ్య దేశంలోనే సాధ్యం. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ విధిగా ఓటు వేసేలా ప్రత్యేక చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అవసరమైతే చట్టాల్లో మార్పులు చేయాలి’ అని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకొని వైబ్రెంట్స్‌ ఆఫ్‌ కలాం ఆర్గనైజేషన్‌ ఆధ్వర్యంలో శుక్రవారం సిద్దిపేట ప్రభుత్వ పాఠశాల మైదానంలో వంద మీటర్ల ఈవీఎం పెయింటింగ్‌ను వేశారు. వంద మీటర్ల జాతీయ పతాకంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

దీనికి ముఖ్య అతిథిగా హాజరైన హరీశ్‌రావు మాట్లాడుతూ, ప్రభుత్వాలను ఎన్నుకునేందుకు 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడికి రాజ్యాంగం ఓటు హక్కును కల్పించిందని అన్నారు. వయోజనులందరూ కలసి మంచి నాయకుడిని ఎన్నుకుంటే మంచిపాలన అందుతుందని, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని మహాత్మాగాంధీ కలలు కన్నారని వివరించారు. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో పోలింగ్‌ శాతం తగ్గడం ప్రజాస్వామ్యానికి విఘాతం వంటిదని అన్నారు. ఎంత ఎక్కు వ మంది ఎన్నికల్లో పాల్గొని ఓటు హక్కును వినియోగించుకుంటే.. అంత మంచి పాలకులు వస్తారన్నారు. ఈ కార్యక్రమంలో  మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, సిద్దిపేట మున్సిపల్‌ చైర్మన్‌ రాజనర్సు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement