ఓవర్ టేక్ చేస్తూ.. | Sakshi
Sakshi News home page

ఓవర్ టేక్ చేస్తూ..

Published Thu, May 7 2015 12:37 AM

one person died in road accident

కంటైనర్ లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
అక్కడికక్కడే ఒకరి మృతి,
మరో 12 మందికి గాయాలు
సూర్యాపేట శివారులో ఘటన

సూర్యాపేట రూరల్ అతివేగంతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు కంటైనర్ లారీని వెనుక నుంచి ఢీకొట్టడంతో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో 12 మందికి గాయాలయ్యాయి. ఈ ఘటన సూర్యాపేట పట్టణ సమీపంలో సువెన్ కెమికల్ కంపెనీ ఎదుట జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది.  స్థానికులు, పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారు జామున కంటైనర్ లారీ విజయవాడ నుంచి హైదరాబాద్‌కు  వెళ్తోంది. ఈ క్రమంలో వైజాగ్ నుంచి హైదరాబాద్‌కు ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ బస్సు సూర్యాపేట పట్టణ సమీపంలోని సువెన్ కెమికల్ కంపెనీ సమీపంలోకి రాగానే కంటైనర్ లారీని ఓవర్ టేక్ చేస్తూ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు ఎడమ పక్కన పూర్తిగా దెబ్బతిని ఇంజన్ లారీ వెనుక భాగంలో ఇరుక్కు పోయింది.

ఈ ప్రమాదంలో వైజాక్‌కు చెందిన అవినాష్ (19) అక్కడికక్కడే మృతిచెందగా,  రాజమండ్రికి చెందిన గుత్తుల సాయినాథ్, విశాఖపట్టణానికి చెందిన సందీప్, శ్రీకాంత్, అమీత్, సంతోష్, శాలిని, కాకినాడకు చెందిన బస్సు క్లీనర్ పరుశరాంతో పాటు పూర్తి సమాచారం తెలియని వి.గుప్తా, రవితేజ, మాణిక్యమ్మ, ఎస్.సయ్యద్, రామక్రిష్ణకు గాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలుసుకుని ఎస్‌ఐ పవన్‌కుమార్‌రెడ్డి ఘటన స్థలాన్ని పరిశీలించారు. 108 వాహనంలో క్షతగాత్రులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని కంటైనర్ లారీ డ్రైవర్ చాపరాల తాత య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేటరూరల్ ఎస్‌ఐ తెలిపారు.

ఎంసెట్ పరీక్షకు వెళ్తూ..
వైజాక్‌కు చెందిన అవినాష్  ఈ నెల 14న జరిగే ఎంసెట్ పరీక్ష కోసం తన పెద్దనాన్న ఇంటికి హైదరాబాద్‌కు వెళ్తూ ప్రమాదానికి గురయ్యాడు. ఉన్నత చదువుల కోసం పెద్దనాన్న పిలుపు మేరకు పరీక్షకు ముందే పెద్దనాన్న ఇంటికి వెళ్తున్న అవినాష్ ప్రమాదంలో మృతిచెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. అవినాష్ మృతదేహానికి సూర్యాపేట ఏరియా ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు.

కారు- ఆటో ఢీకొని..
నార్కట్‌పల్లి కారు, ఆటో ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతిచెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్‌పల్లి శివారులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పీఏపల్లి మండలం, పెరుమల్ల గ్రామానికి చెందిన ఎడ్ల అనిల్, సోదరుడు ఆంజనేయలు నల్లగొండలో ఆటోనడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం అనిల్ (18) ఆటోలో సామగ్రిని తీసుకుని నార్కట్‌పల్లికి వచ్చి తిరిగి వెళ్తుండగా  బైపాస్ వద్దకు రాగనే హైదారాబాద్ నుంచి నల్లగొండకు వెళుతున్న కారు ఢీకొట్టింది. దీంతో అదుపుతప్పిన ఆటో పక్కనే ఉన్న డీవైడర్‌ను మరోమారు ఢీకొంది. ప్రమాదంలో ఆటోలో ఉన్న అనిల్ అక్కడికక్కడే మృతిచెందగా ఆంజనేయులుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమితం స్థానిక కామినేని అస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మోతీరామ్ తెలిపారు.
 

Advertisement
Advertisement