కేసీఆర్ పాలనపై వ్యతిరేకత.. | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాలనపై వ్యతిరేకత..

Published Sun, Aug 17 2014 11:42 PM

opposition on the kcr  rule

 మహేశ్వరం: టీడీపీ అధికారంలో ఉన్నప్పుడే తెలంగాణ  అన్నీ రంగాల్లో అభివృద్ధి చెందిందని  తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ అన్నారు. అంతర్జాతీయ విమానాశ్రయం, ఫ్యాబ్‌సీటి, హార్డ్‌వేర్ పార్కు, ఔటర్ రింగ్ రోడ్డు, పలు కంపెనీలను తీసుకొచ్చింది టీడీపీనే అని   పేర్కొన్నారు. ఆదివారం మండల పరిధిలోని ఇమాంగూడ శ్రీశైలం రహదారిపైన సామ సంజీవరెడ్డి గార్డెన్‌లో  టీడీపీ నియోజకవర్గ విసృ్తత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు.కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరై మాట్లాడారు.

తెలంగాణ రాష్ట్రానికి అనుకూలంగా ప్రథమంగా లేఖ ఇచ్చిన ఘనత టీడీపీదే అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పరిపాలనను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్  కుటుంబ పార్టీ అని అభివర్ణించారు. సమగ్ర సర్వే పేరుతో స్థానికేతరులను భయపేట్టే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికలకు ముందు ప్రజలకు జీ 4 పరిపాలన ఇస్తానని హామీ ఇచ్చి గెలుపొందాక కే 4 (కేసీఆర్ కుటుంబం... కేసీఆర్, కేటీఆర్, కవిత, హరిష్‌రావు) పాలన అందిస్తున్నాడని  ఆరోపించారు.

 మూడు నెలల పాలనలో పలువురు రైతులు, విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నాక కూడా  సీఎం కేసీఆర్ స్పందించడం లేదన్నారు. ఈ సందర్భంగా టీ టీడీపీ  కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ త్వరలో జరిగే జీఎచ్‌ఎంసీ ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. సర్వేల పేరుతో కేసీఆర్ ప్రజలకు అయోమయానికి గురి చేస్తున్నారన్నారు. ఎల్‌బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ..కేసీఆర్ పిట్టల దొరలా వ్యవహరిస్తున్నారన్నారు.

టీఆర్‌ఎస్ ఆకర్ష్‌లకు ఎవరు లొంగరన్నారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మాట ఇచ్చి తప్పారని అన్నారు. 2019లో ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.  మహేశ్వ రం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మాట్లాడుతూ బతికున్నంత కాలం టీడీపీలోనే  కొనసాగుతానని, పార్టీని వీడే ప్రసక్తి లేదన్నారు. నాయకులు, కార్యకర్తలు కన్నతల్లిలాంటి టీడీపీని వీడొద్దని సూచించారు.  అంతకుముందు  ఇటీవల గెలుపొందిన ఎంపీటీసీలు, నగర పంచాయతీ వార్డు సభ్యు లు, సర్పంచ్‌లకు ఘనంగా సన్మానించారు.

 కార్యకర్తలు లేక వెలవెల
 ఇమాంగూడలో జరిగిన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం  కార్యకర్తలు లేక ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. మహేశ్వరం , కందుకూరు నుండి నాయకులు, కార్యకర్తలు అశించినంతగా హజరుకాలేదు.  సరూర్‌నగర్ డివి జన్, ఆర్‌కేపురం నుండి జనాలను తీసుకొచ్చారు. టీఆర్‌ఎస్‌లో చేరే టీడీపీ నాయకులు, కార్యర్తలు సమావేశానికి గైర్హాజరయ్యారు.

 ముఖ్యనేతలు ప్రసంగిస్తున్నప్పుడు కార్యకర్తలు ఏమాత్రం పట్టించుకోకుండా బయట తిరుగుతున్నారు. దీంతో నేతలు ఒకింత అసహనానికి గురయ్యారు.  ఈ కార్యక్రమంలో మాల్కజ్‌గిరి ఎంపీ మల్లారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు, మాజీమంత్రి పెద్దిరెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ప్రకాష్‌గౌడ్, సరూర్‌నగర్ జెడ్పీటీసీ జె. నరేందర్‌రెడ్డి,  పార్టీ మండల అధ్యక్షుడు చంద్రయ్య, ప్రధానకార్యదర్శి ఎడ్మ మోహన్‌రెడ్డి, సర్పంచ్ లు జె.లక్ష్మయ్య, డి. సుధాకర్, ఆనందం, మంద కవిత, ముత్యం, పోచయ్య, సాలీ, యాదమ్మ , పార్టీ సీనియర్ నాయకులు కరుణాకర్‌రెడ్డి,  కృష్ణ, యాదగిరి, కందుకూరు, సరూర్‌నగర్ మండలాల అధ్యక్షులు పి. ఆనంద్, తీగల అమర్‌నాథ్‌రెడ్డి, నాయకులు జయేందర్, లక్ష్మినర్సింహ్మరెడ్డి, సత్యనారాయణ  వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement