రేపు అద్భుత ఖగోళ సంఘటన  | Sakshi
Sakshi News home page

రేపు అద్భుత ఖగోళ సంఘటన 

Published Sat, Jun 20 2020 12:36 PM

Planetary Society Scientist Raghunandan About Solar Eclipse - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : రేపు(ఆదివారం) అద్భుత ఖగోళ సంఘటన జరగబోతోందని ప్లానిటరీ సొసైటీ సైంటిస్ట్ రఘునందన్ అన్నారు. పూర్తి స్థాయి వలయాకార సూర్య గ్రహణం జరుగుతుందని తెలిపారు. విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 నుండి మధ్యాహ్నం 3.04 వరకు సూర్య గ్రహణం ఉంటుందని వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మన దేశంలో గుజరాత్ రాష్ట్రంలోని ద్వారకలో ఈ గ్రహణాన్ని మొదట చూస్తారు. కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా కనపడుతుంది. మామూలుగా సూర్యుని కిరణాలు నేరుగా భూమిపై పడతాయి. కానీ రేపు గ్రహణం కారణంగా అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడతాయి. కాబట్టి కరోనా 0.001 శాతం చనిపోయే అవకాశం ఉంది. 100 శాతం అంతం కాదు. తెలంగాణలో సూర్యగ్రహణం రేపు ఉదయం 10.15 గంటల నుండి 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం ఉంటుంది. ( 21న ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ )

ఆంద్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుండి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం ఉంటుంది. గ్రహణం సమయంలో తినకూడదు, గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదంటూ ప్రచారం చేస్తున్నారు. కొందరు నరబలి ఇవ్వాలని చూస్తుంటారు. గతంలో హైదరాబాద్‌లో ఒక అమ్మాయిని కూడా నరబలి ఇచ్చారు. అవన్నీ మూఢనమ్మకాలు అలాంటి వాటిని నమ్మకూడదు. సూర్యుని ద్వారా కరోనా వచ్చింది అని ప్రచారం జరుగుతుంది. రేపటి గ్రహణంతో కరోనా అంతం అవుతుందని అంటున్నారు. అది అవాస్తవం’’ అని తెలిపారు.

Advertisement
Advertisement