‘గాంధీ’లో లక్ష్మారెడ్డి తనిఖీ, అధికారులతో భేటీ | Sakshi
Sakshi News home page

‘గాంధీ’లో లక్ష్మారెడ్డి తనిఖీ, అధికారులతో భేటీ

Published Wed, Mar 29 2017 3:44 PM

‘గాంధీ’లో లక్ష్మారెడ్డి తనిఖీ, అధికారులతో భేటీ

హైదరాబాద్‌: గాంధీ ఆస్పత్రిలో ఎక్కడ సమస్య వచ్చినా ఆర్‌ఎంవోలదే బాధ్యత అని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి హెచ్చరించారు. విధులను నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. బుధవారం మంత్రి సి.లక్ష్మారెడ్డి  గాంధీ ఆస్పత్రిని సందర్శించి, తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రి అధికారులతో సమావేశమయ్యారు. నెల రోజుల్లో ఇక్కడ 65 పడకల ఐసీయూను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పూర్తి అధునాతన యంత్ర పరికరాలతో మరో ల్యాబ్ ను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

గాంధీలో ప్రస్తుతం 100 బెడ్లు ఉండగా రెండువేలమంది ఇన్ పేషెంట్లకు చికిత్స అందుతోందని వివరించారు. ఇకపై వైద్యులకు మరిన్ని బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలిపారు. 157 పీజీ సీట్లు తెలంగాణకు ఇవ్వడం గొప్ప ఘనత అని చెప్పుకోవచ్చునన్నారు. గాంధీలో కొందరు బయటి వ్యక్తులు పెత్తనం చేస్తున్నారని, ప్రమేయాన్ని తగ్గిస్తామని స్పష్టం చేశారు.

నర్సుల భర్తీ ఈ వారంలో నోటిఫికేషన్ వస్తుందని వెల్లడించారు. సాయి ప్రవళిక మృతిపై ఆయన మాట్లాడుతూ..పాప బతకదని వైద్యులు ముందే డిక్లేర్ చేశారని, కావాలనే ఆ ఘటనను వివాదం చేశారని,  మీడియాను కొంత మంది పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమణి, గాంధీ వైద్యశాల ప్రిన్సిపాల్, ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ మంజుల తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement