వెనుకబాటుకు కాంగ్రెస్, టీడీపీలే కారణం | Sakshi
Sakshi News home page

వెనుకబాటుకు కాంగ్రెస్, టీడీపీలే కారణం

Published Mon, Nov 10 2014 5:39 AM

Telangana regio Backward  reason Congress TDP

 నూతనకల్  : తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడడానికి కాంగ్రెస్, టీడీపీలే కారణమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. ఆదివారం మం డల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ కూడా విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించకుండా రైతాంగానికి కరెంటు కష్టాలు తెచ్చిపెట్టారని విమర్శించారు. తెలంగాణకు ద్రోహం చేసే ఆంధ్రా పార్టీల జెండాలను వదిలి టీఆర్‌ఎస్‌లో చేరాలని ప్రజలను కోరారు. ప్రపంచస్థాయి విద్యా ప్రమాణాలను క్రోడీకరించి కేజీ నుంచి పీజీ వరకు ఉన్నత విద్యనందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు.
 
 రాష్ట్రంలో భూగర్భ జలాలు వృద్ధిచెంది ప్రజలకు తాగు,సాగు నీరు అందించడానికి 45వేల చెరువులు, కుంటలను ఆధునికీకరించి నీటినిల్వ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తోం దన్నారు. జిల్లాలో రహదారుల అభివృద్ధికి రూ. 2వేల కోట్లను మంజూరు చేశామని తెలిపారు. పింఛన్లు, ఆహా ర భద్రత కార్డుల మంజూరు విషయంలో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు అర్థరహితమన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు, ఆహార భద్రత కార్డులు అందిస్తామని పేర్కొన్నారు. టీడీపీ హయాంలో పింఛన్‌దారుల కోసం రూ. 62 కోట్లు, కాంగ్రెస్ గత పదేళ్ల కాలం లో రూ. 762కోట్లు ఖర్చు చేయగా ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం 4వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం మంజూరు చేసిందన్నారు.
 
 తెలంగాణను పూర్తిస్థాయిలో అభివృద్ధిచేసేం దుకు కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ హర్షించాలన్నారు. ఎమ్మెల్యే గాదరి కిశోర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానన్నారు. గత ప్రజాప్రతినిధుల తీరుతో నియోజకవర్గం అభివృద్ధికి ఆమడదూరంలో నిలిచిందన్నారు. అనంతరం మాచినపల్లి గ్రామ సర్పంచ్ మంద బజార్‌తో పాటు చిల్పకుంట్ల, నూతనకల్, ముకుందాపురం, పోలుమళ్ల, దిర్శనపల్లి గ్రామాలకు చెందిన టీడీపీ, సీపీఎం,కాంగ్రెస్ పార్టీలకు  చెందిన కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌చార్జి పల్లా రాజేశ్వర్‌రెడ్డి, జిల్లా నాయకులు ఎస్‌కె.రజాక్, మండల శాఖ అధ్యక్షుడు తీగల మల్లారెడ్డి, గుంటకండ్ల అశోక్‌రెడ్డి, డువెంకన్న, బిక్కి బుచ్చయ్య, బానాల సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement