త్వరలో ‘పట్నం’ చెరువుకు జలకళ | Sakshi
Sakshi News home page

త్వరలో ‘పట్నం’ చెరువుకు జలకళ

Published Fri, Apr 24 2015 12:06 AM

The condition of the pond review Metro waterboard Managing Director Jagadish

- చెరువు స్థితిగతులు పరిశీలించిన మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీష్
ఆదిబట్ల:
ఇబ్రహీంపట్నం పెద్ద చెరువుకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. గురువారం పట్నం చెరువును మెట్రో వాటర్‌బోర్డు ఎండీ జగదీష్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో కలిసి సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదేళ్లుగా వర్షాలు లేక చెరువు నిండక రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. అదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి, నీటిపారుదలశాఖ మంత్రి హరీష్‌రావు దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు.

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువను కృష్ణాజలాలతో నింపితే దాదాపు 50 గ్రామాల రైతులు సంతోషంగా ఉంటారని మంత్రికి వివరించినట్టు చెప్పారు. తక్షణమే మంత్రి హరీష్‌రావు అధికారులకు ఆదేశాలిచ్చారని, అందులో భాగంగా పట్నం చెరువును అధికారులు గురువారం సందర్శించారని చెప్పారు. చెరువు నిండేందుకు 0.8 టీఎంసీల నీరు అవసరమని, ప్రస్తుతం 0.5 టీఎంసీల నీటితో పట్నం చెరువును పునరుద్ధరించనున్నట్టు చెప్పారు. చెరువు కృష్ణా నీటిని ఏ విధంగా తరలించాలి.. చెరువు సామర్థ్యం ఎంత.. తదితర వివరాలను అధికారులు సేకరించారు. చెరువుకు నీరందించే ప్రణాళికపై అధికారులు సుధీర్ఘంగా చర్చించారు.

అనంతరం వాటర్‌బోర్డు ఎండీ జగదిష్ విలేకరులతో మాట్లాడుతూ.. పట్నం చెరువుకు 400 ఎకరాల ఆయకట్టు ఉందని, పూర్తి స్థాయి వివరాలను ప్రభుత్వానికి నివేదిక రూపంలో ఇస్తామని చెప్పారు. వారి వెంట డీజీఎం దశరథ్‌రెడ్డి, వాటర్‌బోర్డు డెరైక్టర్ కొండారెడ్డి, డీఈఈ విజయలక్ష్మి, తహసీల్దార్ ఉపేందర్‌రెడ్డి, నగర పంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్ తదితరులు ఉన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement