జయశంకర్.. ఓ దిక్సూచి | Sakshi
Sakshi News home page

జయశంకర్.. ఓ దిక్సూచి

Published Thu, Aug 6 2015 11:29 PM

జయశంకర్.. ఓ దిక్సూచి

మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి
పటాన్‌చెరులో జయశంకర్ విగ్రహం ఆవిష్కరణ
 
 పటాన్‌చెరు : సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు ప్రొఫెసర్ జయశంకర్ ఒక దిక్సూచి అని, ఆయన మార్గం అనుసరణీయమని మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి కొనియాడారు. గురువారం పట్టణంలో జయశంకర్ విగ్రహాన్ని మంత్రులు ఆవిష్కరించారు. అనంతరం పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.  ఈ కార్యక్రమానికి మంత్రులతో పాటు, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ జయశంకర్ ఆశయ సాధన దిశగా బంగారు, హరిత తెలంగాణ సాధించితీరుతామన్నారు. 

పేదలందరికీ మంచి వైద్యం, వారి ఆర్థిక స్థితి మెరుగు పడేందుకు ప్రాజెక్టులు రావాలని కోరేవారన్నారు.  దేశపతి శ్రీనివాస్ ప్రసంగిస్తూ జయశంకర్ తెలంగాణ ఉద్యమానికి పితామహుడని గుర్తు చేశారు. జయశంకర్ సార్ తెలంగాణ తల్లి ఏర్పాటు చేసుకున్న న్యాయవాదని అభివర్ణించారు. ప్రజాకోర్టులో ఆయన తెలంగాణలో జరుగుతున్న అన్యాయంపై జీవితాంతం వాదించారని వివరించారు. జయశంకర్‌తో ఆయనకున్న గత స్మృతులను గుర్తు చేశారు.   

 రూ. 270 కోట్లతో అభివృద్ధి
 ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి మాట్లాడుతూ సీమాంధ్ర పాలనలో కోటి రూపాయలు సాధించేందుకు ప్రభుత్వాల చుట్టూ ప్రజాప్రతినిధులు చెప్పులరిగేలా తిరిగేవారని గుర్తు చేశారు. కాని తమ ప్రభుత్వ హయాంలో తాను ఎమ్మెల్యేగా ఎన్నికైన తరువాత ఒక్క పటాన్‌చెరుకే రూ. 270 కోట్లతో అభివృద్ధి జరిగిందన్నారు. మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ పటాన్‌చెరు వంద పడకల ఆసుపత్రికి ఆర్వో వాటర్ ప్లాంట్‌ను తన సొంత నిధులనుంచి వెచ్చించి నిర్మిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో  ఎంపీ కొత్తప్రభాకర్‌రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొన్నారు. జయశంకర్ విగ్రహాన్ని తీర్చిదిద్దిన శిల్పి ప్రసాద్‌ను మంత్రి హరీశ్‌రావు ప్రత్యేకంగా సన్మానించారు.

 జీహెచ్‌ఎంసీ కార్యాలయానికి శంకుస్థాపన
 పటాన్‌చెరులో రూ. రెండు కోట్లతో నిర్మించనున్న జీహెచ్‌ఎంసీ కార్యాలయం నూతన భవన నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. పటాన్‌చెరు మైత్రిగ్రౌండ్స్‌లో రూ. రెండు కోట్లతో అధునాతన స్టేడియం నిర్మాణం కోసం మరో శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఎంజీ రోడ్డు నాలుగు లేన్లుగా వేసేందుకు మరో శిలాఫలకాన్ని మంత్రులు  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ పటాన్‌చెరు ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి రూ. 1.40 కోట్లతో కొత్త భవంతిని త్వరలో నిర్మిస్తామన్నారు. 

కార్యక్రమంలో ఎంపీపీలు శ్రీశైలం యాదవ్, యాదగిరి యాదవ్, రవీందర్‌రెడ్డి, బీహెచ్‌ఈఎల్ మాజీ యునియన్ నాయకులు ఎల్లయ్య, టీఆర్‌ఎస్ నాయకులు గాలిఅనిల్‌కుమార్, ఆర్.కుమార్ యాదవ్, వంగరి అశోక్, జడ్పీటీసీ ప్రభాకర్, జీహెచ్‌ఎంసీ డిప్యూటి కమిషనర్ విజయలక్ష్మీ, నియోజక వర్గ స్థాయి నాయకులు, అన్ని గ్రామాల సర్పంచ్‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Advertisement
Advertisement