జెడ్పీ పాలనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం | Sakshi
Sakshi News home page

జెడ్పీ పాలనా తీరును పరిశీలించిన కేంద్ర బృందం

Published Tue, Feb 23 2016 1:01 AM

The team observed the behavior of the administration zp

హన్మకొండ : జిల్లా ప్రజాపరిషత్ పనితీరు, వివిధ పథకాల ద్వారా చేపడుతున్న అభివృద్ధి పనులు, ఉద్యోగుల సేవలు తదితర వివరాలు సేకరించేందుకు కేంద్ర బృందం సోమవారం వరంగల్ జిల్లా పరిషత్‌కు వచ్చింది. తెలంగాణలో ఉత్తమ జిల్లా పరిషత్‌గా వరంగల్ ఎంపిక కావడంతో పనులను పరిశీలించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో జెడ్పీల పనితీరుపై కేంద్ర ప్రభుత్వం ఆన్‌లైన్ ద్వారా వివరాలు సేకరించింది. దేశంలోని అన్ని జిల్లా ప్రజాపరిషత్‌లు ఈ ఫార్మాట్‌లో వివరాలు పొందుపరిచాయి. అరుుతే తెలంగాణలో వరంగల్ జెడ్పీ అత్యధిక పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ప్రథమ స్థానంలో నిలిచిన జెడ్పీలలో ఆన్‌లైన్‌లో పొందుపర్చిన మేరకు పనులు జరిగాయా? లేదా అని తెలుసుకునేందుకు కేరళ, మణిపూర్‌లకు చెందిన ఐఏఎస్ అధికారులు రాంనాయర్, కె.కె.ఠక్కర్‌తో కూడిన కేంద్ర బృందం జిల్లా పర్యటనకు వచ్చింది.

అందుబాటులో ఉన్న జెడ్పీటీసీ సభ్యులతో బృందం అధికారులు సమావేశమై వారి నుంచి పలు సమాధానాలు రాబట్టారు. అధికారాల బదలాయింపు, సమావేశాల నిర్వహణ తీరు, నిధుల వినియోగం, అభివృద్ధి పనులు జరుగుతున్న తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కొందరు జెడ్పీటీసీ సభ్యులు తమ సమస్యలను వివరించారు. జెడ్పీలకు నిధులు నిలిచిపోవడంతో అభివృద్ది కుంటుపడుతోందని చెప్పారు. కాగా, ఈ బృందం మూడు రోజుల పాటు జిల్లాలో పర్యటించనుంది. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పథకాల అమలు, నిధుల వినియోగంపై తెలుసుకోనున్నారు. కేంద్ర బృందాలు అన్ని రాష్ట్రాలలో పర్యటించి పనితీరును పరిశీలించిన తర్వాత జాతీయ స్థాయిలో అధిక పాయింట్లు సాధించిన జిల్లాకు ప్రత్యేక నిధులు కేటారుుస్తారని జెడ్పీ సీఈవో అనిల్‌కుమార్‌రెడ్డి చెప్పారు. జాతీయ స్థాయిలో ఉత్తమ జిల్లా ప్రజాపరిషత్‌గా ఎంపికైతే కేంద్రం నుంచి పారితోషికం కింద రూ.40 లక్షలు వస్తాయన్నారు. బృందం వెంట జిల్లా ప్రజాపరిషత్ చైర్‌పర్సన్ గద్దల పద్మ తదితరులు ఉన్నారు.

 

Advertisement
Advertisement