ముఖ్యమంత్రిని కలుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి | Sakshi
Sakshi News home page

ముఖ్యమంత్రిని కలుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి

Published Wed, Oct 22 2014 3:08 AM

ముఖ్యమంత్రిని కలుస్తాం : పొంగులేటి శ్రీనివాసరెడ్డి - Sakshi

వైరా రిజర్వాయర్‌కు సాగర్ జలాల కోసం
ముఖ్యమంత్రిని కలుస్తాం

 
వైరా: వైరా రిజర్వాయర్‌ను సాగర్ జలాలతో నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను త్వరలో కలవనున్నట్టు వైఎస్‌ఆర్ సీపీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. వైరా రిజర్వాయర్‌ను  ఆయన మంగళవారం సందర్శించారు. అనంతరం, విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... వైరా రిజర్వాయర్ కింద అధికారికంగా 17,390; అనధికారికంగా 23,000 ఎకరాలు సాగులో ఉందని అన్నారు. వర్షాభావ పరిస్థితులతో ఇప్పటికే ఖరీఫ్‌లో రైతులు పంటలు సాగు చేయలేకపోయారని అన్నారు.

కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జున సాగర్ ఆయకట్టు ఈ ఏడాది పెరిగిందన్నారు. వైరా రిజర్వాయర్ సమీపం నుంచి నాగార్జున సాగర్ జలాలు వెళ్తున్నప్పటికీ రిజర్వాయర్‌లోకి మాత్రం ఎన్నెస్పీ నీరు వచ్చే అవకాశం లేదని అన్నారు. ఈ రిజర్వాయర్ నుంచి సుజల స్రవంతి మంచినీటి పథకం ద్వారా మధిర నియోజకవర్గంలోకి ప్రతి రోజు లక్ష లీటర్ల నీరు అందుతోందని అన్నారు.

ఈ రిజర్వాయర్‌లోకి ప్రతి ఏటా ఆరు టీఎంసీల నీటిని ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీనిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానన్నారు. కృష్ణా పరివాహక ప్రాంతంలోగల వైరా రిజర్వాయర్ ఆయకట్టు పరిధిలోని రైతులను ఆదుకోవాల్సిన అవసరముందన్నారు. ‘‘ఈ రిజర్వాయర్‌ను సాగర్ జలాలతో నింపేంత వరకు ప్రభుత్వానికి విన్నవిస్తాం. లేదంటే, వైఎస్‌ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతులపక్షాన పోరాడతాం’’ అని ప్రకటించారు.

రిజర్వాయర్ సందర్శన కార్యక్రమంలో పార్టీ వైరా నియోజకవర్గ కన్వీనర్ బొర్రా రాజశేఖర్, మండల కన్వీనర్ సూతకాని జైపాల్, జెడ్పీటీసీ సభ్యురాలు బొర్రా ఉమాదేవి, ఎంపీటీసీ సభ్యుడు ముళ్ళపాటి సీతారాములు, గరికపాడు సర్పంచ్ శీలం కరుణాకర్‌రెడ్డి, సిరిపురం సర్పంచ్ తాటి వెంకటేశ్వర్లు, నాయకులు తడికమళ్ళ నాగేశ్వరావు, దొడ్డపనేని రామారావు, రాయల పుల్లయ్య, తేలప్రోలు నర్సింహారావు, పాముల వెంకటేశ్వర్లు, నల్లమల్ల శివకుమార్, తాతా రంగారావు, షేక్ ఖాసీం, పాపారావు, ధార్న శేఖర్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement