పాముకాటుతో మహిళ మృతి | Sakshi
Sakshi News home page

పాముకాటుతో మహిళ మృతి

Published Thu, May 28 2015 6:29 PM

Woman dies from Snake bite

రంగారెడ్డి : పాము కాటుతో మహిళ మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని సాల్వీడ్ గ్రామంలో గురువారం చోటు చేసుకుంది. పాము కాటు వేసిన వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా.. భూతవైద్యుడిని   ఆశ్రయించడంతోనే ఆమె మృతి చెందిందని స్థానికులు వాపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే... సాల్వీడ్ గ్రామానికి చెందిన దాదాపూర్ ఆశమ్మ(50) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. కాగా బుధవారం రాత్రి పనికి వెళ్లి వచ్చాక భోజనం చేసి ఆరుబయట పడుకుంది. అయితే అర్ధరాత్రి సమయంలో ఆమెకు ఏదో కుట్టినట్లు అనిపించడంతో లేచి చూసింది.. మంచంలో పాము కనిపించడంతో కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబసభ్యులు పామును చంపేశారు.

ఆ తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలించకుండా..  గండేడ్ మండలం మొకర్లబాద్ గ్రామంలోని భూతవైద్యుడి వద్దకు తీసుకెళ్లారు. అతను తెల్లవారుజాము వరకు ఆమెను అక్కడే ఉంచి, తెల్లారాక.. పాము విషం దిగిపోయిందని, ఇప్పుడెలాంటి ప్రమాదం లేదని చెప్పి ఇంటికి పంపించాడు. అయితే ఇంటికి వచ్చిన కాసేపటికే ఆమె నురగలు కక్కుతూ పడిపోయింది. దీంతో కుల్కచర్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతిచెందిందని,  కాసేపు ముందు తీసుకొచ్చి ఉంటే బతికుండేదని వైద్యులు తెలపడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

Advertisement
Advertisement