న్యూఢిల్లీ: సోషల్ మీడియాను నియంత్రించాలని పదేపదే చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు..ఢిల్లీలోనూ అదేమాట వల్లెవేశారు. విమర్శించడంలో తప్పులేదంటూనే..పోస్టింగ్స్, కామెంట్స్ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేసే ప్రయత్నం చేశారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన ఏర్పేడు ఘటన, సోషల్ మీడియా, ఏపీ ప్రత్యేక హోదా అంశాలను ప్రస్తావించారు.
'సోషల్ మీడియాలో అసభ్యంగా ఫొటోలు పెట్టడం తప్పు. మీపై వేసే ఆ ఫొటోలను మీ భార్యలు చూస్తే ఎంత బాధపడతారు! అందుకే సోషల్ మీడియాలో బాధ్యతతో, సంయమనంతో వ్యవహరించాలి'అని చంద్రబాబు అన్నారు. పొలిటికల్ పంచ్ నిర్వాహకుడు రవికిరణ్ అరెస్టు, వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కార్యాలయంపై పోలీసుల దాడి ఘటనలతో చంద్రబాబు సర్కారుకు రివర్స్ పంచ్ పడిన నేపథ్యంలో సీఎం మరోమారు సోషల్ మీడియా అంశాన్ని ప్రస్తావించడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే సీఎం చెప్పిన నీతి సూత్రాలు టీడీపీ, దాని అనుబంధ సోషల్ మీడియా విభాగాలకు వర్తిస్తాయా? లేదా? అనేదానిపై క్లారిటీ కొరవడింది.
హోదా అడగలేదు..
'కీలకమైన నీతి ఆయోగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అంశాన్ని అడిగారా?' అన్న విలేకరుల ప్రశ్నకు బదులిచ్చిన సీఎం చంద్రబాబు.. 'హోదా అడగలేదు.. ప్యాకేజీ అమలు చేయమని మాత్రమే కోరాను'అని చెప్పారు. తలసరి ఆదాయంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడిందని, అయిదో స్థానంలో దిగువన ఉన్నామని, రూ.16 వేల కోట్ల లోటు ఉందని, విభజనవల్లే ఈ సమస్యలు తలెత్తినందున కేంద్ర ప్రభుత్వ సాహాయాన్ని కోరినట్లు సీఎం తెలిపారు. రైల్వే జోన్ ఇవ్వాలని ప్రధానిని అడిగినట్లు కూడా చంద్రబాబు చెప్పారు.