అమ్మకోసం.. గుక్కపెట్టి ఏడ్చింది | Sakshi
Sakshi News home page

అమ్మకోసం.. గుక్కపెట్టి ఏడ్చింది

Published Wed, Jul 6 2016 11:26 AM

అమ్మకోసం.. గుక్కపెట్టి ఏడ్చింది

చెన్నై: అనారోగ్యంతో తల్లి మరణించడంతో ఓ గున్న ఏనుగు కన్నీరు కారుస్తూ.. తల్లి శరీరానికి కాపలా కాస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మంగళవారం సాయంత్రం కోయంబత్తూరుకు దగ్గరలోని నర్సిపురం గ్రామంలో ఓ 20 సంవత్సారాల ఆడ ఏనుగు అనారోగ్యంతో కన్నుమూసింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న జంతు ప్రేమికులు షాకయ్యారు. ఆ తల్లి కోసం పిల్ల ఏనుగు కన్నీరు కారుస్తూ దాని శవం పక్కనే నిలబడి ఉంది. గత 15 రోజులలో తమిళనాడు అడవుల్లో వరుసగా ఐదు ఏనుగులు అనారోగ్య కారణాలతో మరణించాయి.

అటవీశాఖ అధికారులు ఏనుగుల అకాల మరణాలపై పరిశోధనలు చేయాలని జంతుప్రేమికుడు మోహన్ రాజ్ కోరారు. అటవీ ప్రాంతాన్ని వదలి జనావాసాల్లోకి వచ్చిన ఏనుగలను పట్టుకునేందుకు ప్రయత్నించడం కన్నా ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలన్నారు. సహజ కారణాల వల్ల ప్రతి ఏటా రెండు శాతం ఏనుగులు దేశంలో మరణిస్తున్నాయని ప్రముఖ బయాలజిస్ట్ రామన్ సుకుమార్ అన్నారు. 2012 లెక్కల ప్రకారం తమిళనాడులో 4,000 ఏనుగులు ఉన్నాయని, వీటిలో 2,400 ఆడ ఏనుగులని చెప్పారు.

20 సంవత్సరాల వయసులో ఓ ఏనుగు మరణించిందంటే అందుకు సహజసిద్ధమైన కారణాలే ఎక్కువగా ఉంటాయని అన్నారు. 2015 కరువు సంవత్సరం కావడంతో ఆ ప్రభావంతో కూడా ఏనుగులు మరణించి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. నగరాల్లోని వ్యర్ధాలను అక్రమంగా తరలించి అడవుల్లో పడేయడం వల్ల వాటిని ఆహారంగా తీసుకుని ఏనుగులు అనారోగ్యానికి గురై మరణించొచ్చని చెప్పారు. గుడలూరు అటవీ ప్రాంతంలో ఏనుగులు తిరిగే ప్రదేశాల్లో వ్యర్ధాలను డంప్ చేసినట్లు పర్యావరణవేత్తలు చెప్పారు.

Advertisement
 

తప్పక చదవండి

Advertisement