హస్తిన కేంద్రంగా యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలు, క్షమాభిక్ష పిటిషన్ తిరస్కరణ లాంటి అంశాలపై బుధవారం రాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాత్రికి రాత్రే హడావుడిగా నిర్ణయం తీసుకోవాలని అనుకోవట్లేదంటూ జాతీయ మీడియాలో కొన్ని కథనాలు వచ్చాయి. అయితే, రాత్రి దాదాపు 8 గంటల నుంచి 10.30 గంటల వరకు కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్.. రాష్ట్రపతి భవన్ లోనే, ప్రణబ్ ముఖర్జీతో సమావేశమయ్యారు. మరోవైపు ప్రణబ్ ముఖర్జీ ఇదే అంశంపై సాలిసిటర్ జనరల్ ను కూడా సలహా అడిగారు. అన్నీ అయిన తర్వాత రాత్రి 10.45 గంటల సమయంలో యాకూబ్ మెమన్ క్షమాభిక్ష పిటిషన్ ను రాష్ట్రపతి తిరస్కరించినట్లు బయటకు తెలిసింది. దాంతో ఉత్కంఠకు తెరవీడింది. మరోవైపు మహారాష్ట్రలోని నాగపూర్ లో కూడా ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.
- నాగపూర్ మొత్తం 144 సెక్షన్ విధించారు
- నాగపూర్ జైలు బయట నిషేధాజ్ఞలు విధించారు
- ముంబైలో పోలీసు ఉన్నతాధికారులంతా సమావేశమయ్యారు
- పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు
- రాష్ట్రపతి నుంచి క్షమాభిక్ష పిటిషన్ పై నిర్ణయం రాగానే తగిన చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు
- నాగపూర్ జైలు అధికారులు కూడా పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు