న్యూఢిల్లీ:మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఆకస్మిక మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. భారత దేశం గొప్ప శాస్త్రవేత్తను కోల్పోయిందని మోదీ తన సంతాపాన్ని తెలియజేశారు.
మాజీ రాష్ట్రపతిగా, దేశం గర్వించదగ్గ అంతరిక్ష, రక్షణ శాస్త్రవేత్తగా అబ్దుల్ కలాం దేశానికి చేసిన సేవలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన కలాం స్వయంకృషితో ఎదిగిన తీరు అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచిపోతుందని మోదీ తెలిపారు.
ఏపీజే అబ్దుల్ కలాం మృతిపట్ల పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ , పలువురు కేంద్ర మంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు, వివిధ పార్టీల నాయకులు సంతాపం తెలియజేశారు.
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, చంద్రబాబు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తదితరులు కలాం మృతిపట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కలాం లాంటి దార్శనికుడు లేకపోవడం భారత జాతికే పెద్ద లోటని అభివర్ణించారు.