తెలంగాణ ఎంపీలు ఆంధ్రాకు.. ఆంధ్రా ఎంపీలు తెలంగాణకు!
Published
Fri, May 30 2014 5:15 PM
ఢిల్లీ: రాజ్యసభ సభ్యుల ఎంపికకు సంబంధించి నిర్వహించిన లాటరీ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో శుక్రవారం జరిగిన ఈ ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటి వరకూ ఒకే రాష్ట్రంలో ఉన్న ఇరు ప్రాంతాల్లోని అభ్యర్థులు.. ఇక నుంచి వేరు పడనున్నారు. ఈ క్రమంలో రాజ్యసభ ఎంపిక ప్రక్రియ అనివార్యం కావడంతో లాటరీ పద్దతిలో వీరిని ప్రాంతాల వారీగా విభజించారు. ఇందులో కొంతమంది సీమాంధ్ర ఎంపీలు తెలంగాణ రాష్టానికి ఎంపికవ్వగా, టీ.ఎంపీలలో కొందరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలోకి రానున్నారు. ఆంధ్రప్రదేశ్ క పదకొండు మంది, తెలంగాణకు ఏడుగురు రాజ్యసభ సభ్యులను కేటాయించారు. ఆంధ్రప్రదేశ్ కోటాలో ప్రస్తుతం ఒక రాజ్యసభ సీటు ఖాళీగా ఉంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి (కాంగ్రెస్ పార్టీ) మరణంతో ఇది ఖాళీ అయ్యింది. ఈ స్థానానికి త్వరలో ఉపఎన్నిక నిర్వహించనున్నారు.
సీమాంధ్రలో ఉన్న ఇద్దరు ఎంపీలు సీఎం రమేష్, కేవీపీలను ఏర్పడబోయే తెలంగాణ రాష్ట్రానికి కేటాయించగా, టి.ఎంపీలలో కేకే, ఎంఏఖాన్, దేవేందర్గౌడ్, రేణుకాచౌదరి ఏపీకి కేటాయించారు. మిగిలిన ఎంపీలందరూ ఏ ప్రాంతానికి చెందిన వారు ఆ ప్రాంతానికి పరిమితం కానున్నారు. కాగా, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ ను మాత్రం ఏపీకే కేటాయించారు.