యాంటీ బయాటిక్స్ లేవు | Sakshi
Sakshi News home page

యాంటీ బయాటిక్స్ లేవు

Published Tue, Apr 14 2015 5:09 AM

యాంటీ బయాటిక్స్ లేవు

కోళ్ల బరువు పెంచడానికి యాంటీ బయాటిక్స్, హార్మోన్లు ఇస్తున్నారనడం అవాస్తవం
 పౌల్ట్రీ రంగ సంస్థలు, నిపుణుల స్పందన

 
 సాక్షి ఆదివారం ‘ఫోకస్’ పేజీలో ‘గుడ్డు మందా.. కోడి మందా’ అనే శీర్షికతో ఇచ్చిన కథనంపై పలు సంస్థలు స్పందించాయి. ఈ సందర్భంగా పౌల్ట్రీ బ్రీడర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ జి.రంజిత్‌రెడ్డి మాట్లాడారు. ‘‘కోళ్ల బరువు పెంచడం కోసం హార్మోన్లు, యాంటీ బయాటిక్స్ ఇస్తున్నారన్న విషయంలో నిజం లేదు. కేవలం మన దగ్గరున్న నాణ్యమైన బ్రీడ్ కారణంగానే కోళ్ల ఎదుగుదల బాగుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కోళ్ల పరిశ్రమ ప్రస్తుతం గడ్డుకాలాన్ని ఎదుర్కోంటోంది. ఒకవైపు గుడ్లకు సరైన ధర లేదు. మరోవైపు దాణా రేట్లు బాగా పెరిగాయి. బ్రాయిలర్ అయినా, లేయర్ కోళ్లయినా వాటికి కడుపు నిండా దాణా పెట్టలేని పరిస్థితుల్లో ఉన్న మన రెండు రాష్ట్రాల రైతులు కోళ్ల పెంపకంలో రసాయనాలు వాడుతున్నారనడం అవాస్తవం.
 
  తెలుగు రాష్ట్రాల్లో రైతులు నెలకు 3 కోట్ల బ్రాయిలర్ కోళ్లను ఉత్పత్తి చేస్తున్నారు. రెండు రాష్ట్రాల్లో 20 లక్షల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా పౌల్ట్రీని నమ్ముకుని బతుకుతున్నారు. మన దగ్గర కోళ్లలో యాంటీ బయాటిక్స్ అవశేషాలు ఉన్నాయంటూ కిందటేడు సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ వాళ్లు ఢిల్లీలో చేసిన పరిశోధనను కూడా మేం ఖండించాం. ఆ రిపోర్టులో ఉన్న అవశేషాల స్థాయి యూరోపియన్ ప్రమాణాలకు లోబడే ఉన్నట్టు అప్పుడే మేం స్పష్టం చేశాం కూడా. కోళ్లకు బొటాక్స్ వాడుతున్నారన్న విషయంలో కూడా నిజం లేదు. అంతేకాదు ఈ నలభై రోజుల కాలంలో నాలుగు కిలోల ఆహారం తీసుకునే మన కోడిని ఇరవై ఐదు రోజుల నుంచి నలభై రోజుల వరకూ ఎప్పుడైనా తినొచ్చు..’’ అని చెప్పారు.  
 
 సరైన ధరే లేదు..
- కె.జి.ఆనంద్, నేషనల్ ఎగ్
 కోఆర్డినేషన్ కమిటీ (నెక్) సీఈవో
 
 రెండు తెలుగు రాష్ట్రాల్లో లేయర్ కోళ్ల రైతులు 5,000 మంది వరకు ఉన్నారు. ఏడాదికి పదివేల కోట్ల గుడ్లను ఉత్పత్తి చేస్తున్నారు. కోళ్ల దాణాగా ఉపయోగించే మొక్కజొన్న కనీస మద్దతు ధరను గత ఐదేళ్లుగా ప్రభుత్వం పెంచుతూ పోవడంతో.. ఆ ప్రభావం పడి గుడ్ల ధర విషయంలో రైతులు చాలా నష్టపోవాల్సి వస్తోంది. గుడ్ల ఉత్పత్తికి రసాయన పదార్థాలను ఆశ్రయిస్తున్నారనే విషయాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ధరల కారణంగా మన రైతులకు కోడికి కడుపునిండా దాణా పెట్టే పరిస్థితే లేదు. అలాంటిది యాంటీ బయాటిక్స్ వాడి గుడ్ల ఉత్పత్తిని పెంచుతున్నారనే వార్తల్ని వ్యతిరేకిస్తున్నాం. అంతేకాదు మన దగ్గర మోల్టింగ్ పద్ధతిని కూడా కేవలం 20శాతం మంది రైతులు పాటిస్తున్నారు.
 
 రైతు క్షేమం
 - ఎస్.బాలసుబ్రమణ్యన్, ఆలిండియా డెవలప్‌మెంట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ (వెంకాబ్ చికెన్)
 
ఇంటిగ్రేటెడ్ వ్యవస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న పౌల్ట్రీల వల్ల రైతులు నష్టపోతున్నారనే విషయాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మన రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 శాతం ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ ఉండడమే దీనికి కారణం. మరో 35 శాతం సొంతంగా పెట్టుబడులు పెట్టి పౌల్ట్రీఫామ్‌లను నడిపిస్తున్నారు. ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీ కారణంగా బహుళజాతి కంపెనీల పెత్తనం పెరిగిపోతుందన్న విషయం పక్కనపెడితే.. పౌల్ట్రీని నమ్ముకుని బతుకుతున్న తెలుగు రైతులు సురక్షితంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించాలి. ఇంటిగ్రేటెడ్ పౌల్ట్రీలో రైతులకు పెట్టుబడి రిస్క్ ఉండదు. రెండు నెలలు తిరగకుండానే లాభాల్ని ఆర్జించవచ్చు. అలాగే ఇంటిగ్రేటెడ్ సంస్థలు కోట్ల సొమ్ము ఆర్జిస్తున్నాయన్న విషయం కూడా అవాస్తవం. రైతులకు వచ్చే లాభం కంటే కంపెనీలకు తక్కువగా వస్తుంది.


 

Advertisement
Advertisement