మోదీపై రతన్‌ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు | Sakshi
Sakshi News home page

మోదీపై రతన్‌ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు

Published Wed, Sep 20 2017 7:32 PM

మోదీపై రతన్‌ టాటా ఆసక్తికర వ్యాఖ్యలు - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా కంపెనీ అధినేత రతన్‌ టాటా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై ప్రశంసల జల్లు కురిపించారు. 'నవభారతం' కోసం ప్రధాని మోదీ కలలు కంటున్నారని, తన కలల మేరకు నవభారతాన్ని నిర్మించేందుకు ప్రధాని మోదీకి ఒక అవకాశాన్ని ఇవ్వాలని టాటా సూచించారు.

సీఎన్‌బీసీ టీవీ18కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చిన టాటా.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఉన్ననాటి నుంచి నరేంద్రమోదీని సన్నిహితంగా  గమనిస్తున్నట్టు తెలిపారు. వేగంగా విధాన నిర్ణయాలు తీసుకునే ఆయన సామర్థ్యాన్ని టాటా కొనియాడారు. కేవలం మూడురోజుల్లో భూకేటాయింపులు జరిపి.. పశ్చిమబెంగాల్‌ నుంచి గుజరాత్‌కు టాటా నానో కారు ఫ్యాక్టరీ తరలిరావడానికి మోదీ ఎంతగానో సహకరించారని గుర్తుచేసుకున్నారు.

'ప్రధానిగా మోదీ ఓ కొత్త భారతాన్ని అందించాలని అనుకుంటున్నారు. ఇందుకు మనం ఆయనకు ఒక అవకాశాన్ని ఇవ్వాలి. భారత్‌ను కొత్తగా మలచడానికి అవసరమైన సృజనాత్మకత, సామర్థ్యం ఆయనకు ఉన్నాయి. ఆయన నాయకత్వంలో నవభారతం సాకారం కాగలదని నేను ఆశాభావంతో ఉన్నాను' అని టాటా అన్నారు.
 

Advertisement
Advertisement