ముజఫర్నగర్ ప్రాంతంలో ఈ రోజు పర్యటించాల్సిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు రాజనాథ్ సింగ్ పర్యటన రద్దు అయిందని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించింది. అల్లర్లు జరిగిన ప్రాంతంలో పర్యటనను రద్దు చేసుకోవాలని రాజనాథ్ సింగ్ ముజఫర్నగర్ జిల్లా మేజిస్ట్రేట్ కోరారని విడుదల చేసిన ఆ ప్రకటనలో తెలిపింది.
ఈ నేపథ్యంలో ఆయన పర్యటన రద్దు అయిందని పేర్కొంది. అయితే రాజనాథ్ సింగ్ పర్యటనను రద్దు చేసుకోవాలని జిల్లా మేజిస్టేట్ సూచించడం పట్ల ఆ పార్టీ సీనియర్ నాయకుడు వినయ్ కతియార్ మండిపడ్డారు. ఇటీవల యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధాని మన్మోహన్ సింగ్లకు ఆ ప్రాంతంలో పర్యటించారని, అలాంటిది తమ పార్టీ అధ్యక్షుడు రాజనాథ్, ఉమాభారతీలను పర్యటించేందుకు అనుమతించక పోవడంపై ఆయన ఆగ్రహాం వ్యక్తం చేశారు. అఖిలేష్ ప్రభుత్వం ఆడుతున్న నాటకంలో భాగంగానే ఈ చర్య అని ఆయన వాఖ్యానించారు.
ముజఫర్నగర్లో అల్లర్లు చోటు చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రంలో సమాజవాది పార్టీ సర్కార్ను రద్దు చేసి, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గతంలో బీజేపీ అధ్యక్షుడు రాజనాథ్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే యూపీలో మత ఘర్షణలు సృష్టించి ఆధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆయన ఆరోపించారు.
ఇప్పుడిప్పుడే ప్రశాంత వాతావరణం ఏర్పడుతున్న ముజఫర్నగర్లో రాజనాథ్ పర్యటనతో మరల ఉద్రిక్త వాతావరణం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అందులోభాగంగా పర్యటన రద్దు చేసుకోవాలని రాజనాథ్కు జిల్లా మేజిస్ట్రేట్ సూచించారు. అలాగే ముజఫర్నగర్ అల్లర్లపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై బీజేపీ ఎమ్మెల్యే సంగీత సోమ్ను శనివారం ఉత్తర ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు.
సంగీత సోమ్ శుక్రవారం ముజఫర్నగర్లో అల్లర్లు జరిగని ప్రాంతంలో ప్రజలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారు. దాంతో ఆయన్ని అరెస్ట్ చేయాలని పలు సంఘాలు డిమాండ్ చేశాయి. దాంతో సంగీత సోమ్ను శనివారం అరెస్ట్ చేశారు.