Sakshi News home page

అలుపెరుగని సమరం

Published Sat, Sep 21 2013 3:28 AM

Seemandhra strike continues on 52nd day

సాక్షి నెట్‌వర్క్: రాష్ర్ట విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సీమాంధ్రలో ఎగసిన ఉద్యమం అలుపెరగకుండా సాగుతోంది. వరుసగా 52వరోజూ శుక్రవారం  ధర్నాలు, రాస్తారోకోలు, వినూత్న ఆందోళనలతో దద్దరిల్లాయి. ఏపీఎన్‌జీఓల   కమిటీ పిలుపు మేరకు రెండోరోజూ సమైక్యవాదులు కేంద్రప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులను మూయించారు. విశాఖలో తూర్పు, పశ్చిమ, ఉత్తరా్రంధ జిల్లాల మార్కెటింగ్ శాఖ ఉద్యోగులు భారీ నిరసన ప్రదర్శన చేశారు. తూర్పుగోదావరి జిల్లా తూర్పుపాలెంలో ఓఎన్‌జీసీ గ్యాస్ కలెక్షన్ సెంటర్‌ను సమైక్య వాదులు ముట్టడించారు. రాజమండ్రిలో మునిసిపల్ కమిషనర్ రాజేంద్ర ప్రసాద్ రిక్షా తొక్కి నిరసన తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో మాదిగల ఆధ్వర్యంలో జరిగిన దండోరా కార్యక్రమంలో మందకృష్ణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ముస్లింలు  భారీ ప్రదర్శన చేపట్టారు. చీపురుపల్లి  మూడు రోడ్ల జంక్షన్‌లో వెయ్యి అడుగుల జాతీయ జెండాతో సమైక్యవాదులు  భారీర్యాలీ నిర్వహించారు.

 

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయానికి తాళం వేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ఎరుకల కులస్తులు, ఏకలవ్యల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. గుత్తిలో ఉపాధ్యాయులు శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజ కవుల వేషధారణలతో సమైక్య వాదాన్ని చాటిచెప్పారు  వైవీయూ విద్యార్థులు, ఉద్యోగులు, సిబ్బంది వర్శిటీ నుంచి కడప కలెక్టరేట్ వరకు 20 కిలోమీటర్ల మేర వేలాది మంది మహా పాదయాత్ర చేపట్టి సమైక్యాంధ్ర ఆవశ్యకతను చాటారు.  చిత్తూరు జిల్లా బికొత్తకోటలో మహిళా ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ చేసి నిరసన తెలియజేశారు. 

 

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో రైతులు మానవహారం నిర్మించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో మత్స్యకారులు వలలు, బోట్లను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. నెల్లూరులో ఆర్టీసీ కార్మికులు బస్సుకు తాళ్లు కట్టి లాగి వినూత్న నిరసన తెలిపారు. దిగ్విజయ్ వ్యాఖ్యలకు నిరసనగా గుంటూరు జిల్లా మంగళగిరి మునిసిపల్ కార్యాలయంపైకి  ప్రభుత్వ ఉద్యోగులు ఎక్కి దూకేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాలలో రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ప్రజలు భారీఎత్తున రోడ్డుపైకి వచ్చి నిరసన తెలిపారు. రైతులు ఎడ్లబండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఒంగోలులో సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో కేంద్రమంత్రి పనబాక లక్ష్మి దిష్టిబొమ్మతో శవయాత్ర నిర్వహించారు. కృష్ణా జిల్లా నాగాయలంకలో జేఏసీ నేతలు, ఉద్యోగులు రిక్షాలు తొక్కి నిరసన తెలియజేశారు.  ఇదిలా ఉంటే, రాష్ట్ర విభజనపై కేబినెట్ నోట్ తయారైందన్న కేంద్ర మంత్రి షిండే ప్రకటన టీవీలో చూస్తూ  శుక్రవారం మరో ఇద్దరు గుండెపోటుతో మరణించారు.
 
 ‘గర్జించి’న సీమాంధ్ర
 సాక్షి నెట్‌వర్క్: సమైక్య నినాదంతో రాష్టంలో పలుచోట్ల వివిధ ‘గర్జన’ల పేరుతో నిర్వహించిన కార్యక్రమాలకు జనం భారీగా తరలివచ్చారు.  శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ  వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సిక్కోలు సమైక్య గర్జన’కు జనం పోటెత్తారు. జిల్లా అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, భారీ సంఖ్యలో ప్రజలు, విద్యార్థుల నినాదాలతో కార్యక్రమం హోరెత్తింది. పలాసలో వర్షంలోనూ నిర్వహించిన లక్ష జనకేక కార్యక్రమంలో వేలాదిమంది పాల్గొన్నారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరిలో  జరిగిన మహిళాగర్జనలో ఐకేపీ, అంగన్‌వాడీ, ఆర్యవైశ్య మహిళా మండలిలతోపాటు పలు మహిళా సంఘాల ఆధ్వర్యంలో మహిళలు, విద్యార్థినులు వేలాదిగా తరలివచ్చారు. అనంతపురం జిల్లా కదిరిలో వేలాది మంది రైతులు‘రైతు ఆవేదన’ను  నిర్వహించారు. కర్నూలులో ఇంజనీరింగ్, ఫార్మసీ జేఏసీ ఆధ్వర్యంలో  నిర్వహించిన మహాగర్జన విజయవంతమైంది. వేలాది మంది విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు తమ చివరి రక్తపుబొట్టు వరకు పోరాడతామంటూ గుంటూరు జిల్లా నరసరావుపేటలో ‘విద్యార్థి గర్జన’ నిర్వహించారు.  ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయశాఖ, రాజకీయ, ఆర్టీసీ, మున్సిపల్, విద్యుత్, ప్రైవేటు పాఠశాలల జే ఏసీ ప్రతినిధులు, సీమాంధ్ర విద్యార్థి జేఏసీ చైర్మన్ కృష్ణయాదవ్ పాల్గొన్నారు.
 
 రాష్ట్రాన్ని ఏ శక్తీ విడదీయలేదు : పరకాల
 శ్రీకాకుళం, న్యూస్‌లైన్ : ‘రాష్ట్రాన్ని ఏ శక్తీ విడదీయలేదు, విభజించే ప్రయత్నం చేస్తున్న వారు ఈ రాష్ట్రం వారు కాదు, వారికి మనం ఎలాంటి అధికారాలు ఇవ్వలేదు. అలాంటప్పుడు విడదీసే హక్కు వారికెలా ఉంటుంది..’ అని విశాలాంధ్ర మహాసభఅధ్యక్షుడు పరకాల ప్రభాకర్ ప్రశ్నించారు. శుక్రవారం శ్రీకాకుళంలో సమైక్యాంధ్ర పరిరక్షణ  వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సిక్కోలు సమైక్య గర్జన’ సభలో ఆయన ప్రసంగించారు.  సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులందరూ వాజమ్మలు, దద్దమ్మలు, భజనపరులుగా తయారయ్యారని, ఇటలీ గాంధీ చెప్పు చేతల్లో ఉన్నారని దుయ్యబట్టారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి నాయకులు లేరని, త్వరలోనే ముగిసిపోతుందని వ్యాఖ్యానిస్తున్న వారికి తెలిసేలా ఈ ఉద్యమం ఎన్జీవోలది. ప్రజలదని, వారే నాయకులని తెలియజెప్పాలన్నారు. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం ఇక సాగదని స్పష్టం చేశారు.
 
 డల్లాస్‌లో 29న ‘సమైక్య’ వంటావార్పు
 నాయుడుపేట, న్యూస్‌లైన్: కలసి ఉంటేనే కలదు సుఖం అంటూ ప్రవాస భారతీయులు సమైక్యాంధ్ర ఉద్యమంలో తాము సైతం... అంటున్నారు. డల్లాస్ సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు చేపట్టినట్లు ప్రవాస భారతీయుడు చిల్లకూరు గోపిరెడ్డి శుక్రవారం ఈ-మెయిల్ ద్వారా ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. ఈనెల 29న అమెరికాలోని లెవీస్‌విల్లీ లేక్ సమీపంలో 600 సాండీబీచ్ వద్ద వంటావార్పు కార్యక్రమాన్ని నిర్వహించనున్నామన్నారు.  రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే అన్నిరంగాల్లో అభివృద్ధి సాధ్యమని, అందులో భాగంగా తామూ ఉద్యమంలో భాగస్వాములవుతున్నామన్నారు.
 
 24న తిరుమలకు వాహనాలు బంద్
 సాక్షి, తిరుపతి : రాష్ట్ర విభజనను నిరసిస్తూ ఈనెల 24న చేపట్టనున్న సీమాంధ్ర బంద్‌లో భాగంగా చేపడుతున్న రహదారుల దిగ్బంధం తిరుమల రహదారులకూ వర్తిస్తుందని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, ఆర్‌డీవో రామచంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన తిరుపతిలో విలేకరులతో మాట్లాడుతూ 24న రహదారులను దిగ్బంధం చేస్తున్నామని, ఇందులో తిరుమలకూ మినహాయింపు ఇవ్వడంలేదన్నారు. దీనిపై ఇప్పటికే తిరుమల-తిరుపతి టాక్సీ డ్రైవర్ల సంఘంతో కూడా సంప్రదింపులు పూర్తిచేసినట్లు తెలిపారు. తిరుమలకు పబ్లిక్, ప్రయివేటు వాహనాలను కూడా అనుమతించబోమన్నారు. భక్తులు ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని కోరారు.
 
 టీడీపీ, కాంగ్రెస్ నేతలపై ప్రజాగ్రహం
 సాక్షి నెట్‌వర్క్ : టీడీపీ, కాంగ్రెస్ నేతలపై జనాగ్రహం కొనసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే అశోక్‌గజపతిరాజును శుక్రవారం గజపతినగరంలో సమైక్యవాదులు అడ్డుకున్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణాకు అనుకూలంగా లేఖ ఇచ్చి సమైకాంధ్రకు మద్దతుగా ఆందోళనలు చేయడంలో అర్ధమేమిటని ప్రశ్నించడంతో ఆగ్రహించిన ఆయన ఆవేశంతో ఊగిపోయి చేతిలో ఉన్న మైక్‌ను నేలకేసి కొట్టి  వెళ్లిపోయారు. బొబ్బిలిలో కూడా అశోక్‌ను అడ్డుకుని మీ పార్టీకి చెందిన ఎంపీ హరికృష్ణ రాజీనామా సమర్పించి ఆమోదింపచేసుకున్నారని మీరెందుకు అలా చేయడం లేదని నిలదీశారు. ఏపీ ఎన్జీఓలు, ఉపాధ్యాయుల పట్ల  మంత్రి రామచంద్రయ్య చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా ఆయన దిష్టిబొమ్మలను దగ్ధం చేశారు. పోరుమామిళ్ల పట్టణంలో టీచర్లు చొక్కాలు విప్పి రోడ్డుపై బైఠాయించి మంత్రి తీరును ఎండగట్టారు. ప్రొద్దుటూరులో ఆయన దిష్టిబొమ్మకు దహనం చేశారు.

Advertisement

What’s your opinion

Advertisement