భారత్-పాక్ బోర్డర్లో మానవ రహిత విమానాలు! | Sakshi
Sakshi News home page

భారత్-పాక్ బోర్డర్లో మానవ రహిత విమానాలు!

Published Tue, Oct 4 2016 5:48 PM

భారత్-పాక్ బోర్డర్లో మానవ రహిత విమానాలు!

న్యూఢిల్లీ: భారత్-పాక్ బోర్డర్లో మంగళవారం అలజడి రేగింది.  మానవ రహిత విమానాలు(యూఎవీ)లు తిరుగుతున్నట్లు బీఎస్ఎఫ్ గుర్తించింది. దీంతో అప్రమత్తమైన బలగాలు బంగ్లాదేశ్ సరిహద్దు ప్రాంతాల్లో గస్తీని పెంచాయి. సరిహద్దు ప్రాంతాల్లో భారత్ హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
 
పాక్ తో సరిహద్దును కలిగిన ఉన్న పశ్చిమ ప్రాంతంలో పరిస్ధితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. నియంత్రణ రేఖకు అవలి నుంచి తరచూ దాడులు జరుగుతుండటంతో ఆర్మీకి దన్నుగా నిలిచేందుకు బీఎస్ఎఫ్ బలగాలను కూడా మోహరించినట్లు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ చెప్పారు. బంగ్లాదేశ్ కు చెందిన బోర్డర్ గార్డ్ బంగ్లాదేశ్(బీజీబీ)తో చర్చలు జరిపినట్లు తెలిపారు.
 
ఇరువర్గాలు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేసేందుకు జరిపిన సంప్రదింపులు విజయవంతమైనట్లు పేర్కొన్నారు. బంగ్లాదేశ్ భూభాగం నుంచి ఉగ్రదాడులు జరుగుతాయనే సమాచారం లేకపోయినప్పటికీ ముందస్తు చర్యగా సంప్రదింపులు జరిపినట్లు వెల్లడించారు. ఇండో-పాక్, ఇండో-బంగ్లా బోర్డర్లో గస్తీని పెంచినట్లు చెప్పారు.
 
సరిహద్దు రాష్ట్రాలైన జమ్మూ, పంజాబ్, రాజస్ధాన్, గుజరాత్ లలో ఎలాంటి భద్రతా ఒప్పందాల ఉల్లంఘన జరగలేదని తెలిపారు. భారత్ సరిహద్దులకు 100 మీటర్ల దూరంలో వచ్చిన మానవ రహిత విమానంపై ఆయన స్పందించారు. భారత్ సంసిద్ధతను తెలుసుకునేందుకు పాక్ యూఏవీని ఉపయోగించి ఉంటుందని అన్నారు. ఎలాంటి దాడులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. 
 
సరిహద్దు గ్రామాలను బలగాలు ఖాళీ చేయించలేదని, ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే ముందస్తు చర్యగా ప్రజలను తరలించాయని చెప్పారు. భారత్-పాక్ సరిహద్దుల్లో ఉన్న పొలాలకు రైతులను వెళ్లనిస్తున్నట్లు తెలిపారు. 
 

Advertisement

తప్పక చదవండి

Advertisement