-
Children's Inspirational Story: 'యుద్ధకాంక్ష'! పూర్వం సింహపురిని..
పూర్వం సింహపురిని విక్రమసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఆ రాజ్యం చుట్టూ పెద్దపెద్ద దేశాలు ఉన్నా ఈ రాజ్యం కేసి కన్నెత్తి చూసే సాహసం లేదెవరికి. కానీ పొరుగు దేశమైన విజయపురినేలే జైకేతుడికి మాత్రం ఎలాగైనా సింహపురిని జయించి తన రాజ్యంలో కలుపుకోవాలనే కోరిక ఉండేది. అందుకోసం రెండుసార్లు యుద్ధం చేసి ఓటమి చవిచూశాడు. అయినా అతనిలో ఆశ చావలేదు.ఒకసారి మంత్రి మండలిని సమావేశపరచి ‘సింహపురి మన కంటే చాలా చిన్న దేశం. సైనికబలమూ తక్కువే. అయినా దాన్ని మనం ఎందుకు జయించలేకపోతున్నాం? ఈసారి యుద్ధంలో ఎట్టిపరిస్థితుల్లో సింహపురిని ఓడించాల్సిందే. మన దేశంలో విలీనం చేసుకోవాల్సిందే. మన విజయపురిని సువిశాల సామ్రాజ్యంగా తీర్చిదిద్దాల్సిందే’ అన్నాడు రాజు. అతనిలోని ఈ యుద్ధకాంక్ష వల్ల దేశంలో కరువుకాటకాలు పెరిగిపోవడమే కాక ఎంతోమంది సైనికులు ప్రాణాలు కోల్పోసాగారు.ఎలాగైనా ఈ యుద్ధకాండను ఆపించి రాజు కళ్ళు తెరిపించాలని మంత్రి నిర్ణయించుకున్నాడు. అందుకే రాజుతో ‘క్షమించండి మహారాజా! దేశం.. సైన్యం.. ఎంత పెద్దవైనా.. ఎదుటివారి శక్తిని అంచనా వేయకుండా యుద్ధం ప్రకటిస్తే ఏమవుతుందో మీకు తెలిసిందే! ఇప్పుడు శక్తి కన్నా యుక్తి కావాలి. సింహపురి బలమేంటో.. బలహీనతేంటో వారి విజయరహస్యం ఏమిటో తెలుసుకోగలగాలి. అప్పుడు విజయం మనకు సులువు అవుతుంది.అందుకోసం సమర్థుడైన వ్యక్తిని వినియోగిద్దాం’ అన్నాడు మంత్రి. రాజుకు మంత్రి సలహా సరియైనదే అనిపించింది. ఒక్క క్షణం ఆలోచించి ‘ఎవరినో ఎందుకు? మనమే మారు వేషాలతో వెళ్దాం. అక్కడి రాజకీయ పరిస్థితులు, వారి విజయరహస్యాలను తెలుసుకుందాం’ అన్నాడు. దానికి మంత్రీ సరే అన్నాడు. మరునాడు ఉదయాన్నే రాజు, మంత్రి.. మామూలు ప్రయాణికుల్లా.. తమ గుర్రాలపై సింహపురికి బయలుదేరారు.ఆ నగరంలో అడుగు పెడుతూనే ఇద్దరికీ విస్మయం కలిగింది. నగరం చుట్టూ పొలాలు.. పండ్లతోటలతో ఆ నేలంతా ఆకుపచ్చ తివాచీ పరచినట్టు శోభయమానంగా కనిపించింది. జలాశయాలన్నీ నిండుగా కళకళలాడసాగాయి. నగరవీథులైతే.. శుభ్రంగా అద్దంలా మెరిసిపోసాగాయి. నగరవాసులు ఎవరిపనుల్లో వాళ్ళు నిమగ్నమై ఉన్నారు. కుటీర పరిశ్రమల్లో రకరకాల వస్తువులు.. రంగురంగుల దుస్తులు తయారవసాగాయి.ఒక ఇంటి ముందు పనిచేసుకుంటూ కనిపించిన వృద్ధుడిని చూసి.. రాజు, మంత్రి తమ గుర్రాలను అతని దగ్గరకు నడిపించారు. అతణ్ణి సమీపిస్తూనే ‘అయ్యా మేము బాటసారులం. విదేశ సంచారం చేస్తూ ఈ దేశానికి వచ్చాము. ఈ దేశం ఇంత అభివృద్ధి చెందడానికి కారణాలు ఏమిటో చెబుతారా?’ అని అడిగారు. దానికా వృద్ధుడు ‘మా రాజు పాలనాదక్షుడు. ప్రజారంజకుడు. మా దేశవాసులు స్వయంకృషిని నమ్ముకుంటారు. మాకు ఆహార కొరతలేదు.మేం పండించిన ధాన్యాన్ని, తయారుచేసిన వస్తువులను మా చుట్టుపక్కల దేశాలకు ఎగుమతి చేస్తుంటాం. మా పొరుగున ఉన్న విజయపురి అయితే అచ్చంగా మా దేశ ఉత్పత్తుల మీదనే ఆధారపడి ఉంది. ఆ దేశవాసులు కొనే వస్తువులన్నీ మా దేశానివే. మా విజయ రహస్యానికి వస్తే.. మా దేశంలో ప్రతి పౌరుడు సైనిక శిక్షణ పొందవలసిందే! యుద్ధం అంటూ వస్తే అందరూ సైనికులై పోరాడుతారు. వారిని ప్రజాదళం అంటారు. వారిది స్వచ్ఛంద పోరాటం’ అని చెప్పాడు.తర్వాత రాజు, మంత్రి తమ గుర్రాలపై అలా నగర వీథుల్లో తిరుగుతూ.. పౌరులతో మాట్లాడుతూ కొత్త కొత్త విషయాలను తెలుసుకున్నారు. ఆరాత్రి అక్కడే బసచేసి మర్నాడు తిరిగి తమ దేశానికి బయలుదేరారు. మార్గంలో మహారాజు.. మంత్రితో ‘సింహపురి వైభవం చూశాక నాకెంతో సిగ్గుగా అనిపిస్తుంది. ఆ పరిపాలన, అక్కడి ప్రజల క్రమశిక్షణ నాకెంతో నచ్చాయి’ అన్నాడు. దానికి మంత్రి ‘ఆ దేశం చిన్నదైనా పచ్చని పాడిపంటలతో తులతూగుతూ ఉంది. ఎటు చూసినా కుటీర పరిశ్రమలు నెలకొని ఉన్నాయి.అక్కడి ప్రజలు తమ అవసరాలకే కాదు ఎగుమతులకూ అవరసమయ్యేంత శ్రమిస్తూ దేశ ఆర్థికపరిపుష్టికి పాటుపడుతున్నారు. క్షమించండి రాజా.. సింహపురితో మన దేశాన్ని పోల్చుకోలేము. మన దేశం విశాలమైందే. కానీ ఎక్కడ చూసినా ఎండిన బీళ్ళు. ఇంకిపోయిన చెరువులు, ఆకలి, నిరుద్యోగం దర్శనమిస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో పొరుగు దేశాన్ని గెలుచుకుని మన సువిశాలసామ్రాజ్యాన్ని పెంచుకోవటమంటే మన దారిద్య్రాన్ని, కరువుని పెంచడమే! మీరు తప్పుగా అనుకోకపోతే ఒక మాట చెబుతాను.. ముందు మనల్ని మనం సంస్కరించుకుందాం.మన దేశాన్ని పాడిపంటలతో తులతూగేలా చేద్దాం. ప్రతి పౌరుడికీ చేతినిండా పని కల్పిద్దాం. సింహపురిని ఆదర్శంగా తీసుకుందాం. ఇప్పుడు యుద్ధానికి కన్నా మనకు ఈ సంస్కరణలు అవసరం’ అని చెప్పాడు. అదంతా విన్నాక రాజు ‘నిజమే! ముందు మన దేశాన్ని సుభిక్షంగా.. సుస్థిరంగా తయారు చేద్దాం! వ్యవసాయానికి పెద్ద పీట వేద్దాం. త్వరలోనే విజయపురిని మరో సింహపురిగా మార్చేద్దాం! అందుకు కావలసిన ప్రణాళికను సిద్ధం చేయండి’ అని ఆజ్ఞాపించాడు రాజు.‘చిత్తం మహారాజా! మీ ఆశయం తప్పక నెరవేరుతుంది’ అంటూ భరోసా ఇచ్చాడు మంత్రి. — బూర్లె నాగేశ్వరరావు -
ఉత్తముడి వృత్తాంతం.. ‘మహారాజా! నేను అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో..
ఉత్తానపాదుడికి, సురుచికి ఉత్తముడు అనే కుమారుడు జన్మించాడు. ఉత్తముడు సార్థకనామధేయుడు. సకల శాస్త్రాలు, శస్త్రవిద్యలు నేర్చుకున్నాడు. తండ్రి గతించిన తర్వాత రాజ్యాధికారం చేపట్టి, ధర్మప్రభువుగా పేరు పొందాడు. బభ్రు చక్రవర్తి కుమార్తె బహుళను ఉత్తముడు పెళ్లాడాడు.ఉత్తముడు భార్య బహుళను అమితంగా ప్రేమించేవాడు. అయినా ఆమె భర్త పట్ల విముఖురాలిగా ఉండేది. అతడు ఆమెకు దగ్గర కావాలని చూసినా, ఆమె ఏదో వంకతో అతడిని దూరం పెట్టేది. ఉత్తముడు ఒకనాడు తన మిత్రులను పిలిచి విందు ఇచ్చాడు. వాళ్లంతా తమ తమ భార్యలతో సహా వచ్చారు. విందులో అందరూ ఆనందంగా రుచికరమైన వంటకాలను ఆరగిస్తూ, మధువు సేవించసాగారు. ఉత్తముడు తన భార్య బహుళకు మధుపాత్ర అందించాడు. ఆమె అందరి ఎదుట ఉత్తముడిని తిరస్కరించి చరచరా లోపలకు వెళ్లిపోయింది. భార్య చర్యతో ఉత్తముడికి సహనం నశించింది. వెంటనే భటులను పిలిచి, ఆమెను ‘అడవిలో విడిచిపెట్టి రండి’ అని ఆజ్ఞాపించారు. కోపం కొద్ది భార్యను విడిచిపెట్టినా, ఉత్తముడికి ఆమెపై ప్రేమ తగ్గలేదు. లోలోపల బాధను అణచుకుని పాలన కొనసాగించసాగాడు.ఒకనాడు ఒక విప్రుడు ఉత్తముడి వద్దకు వచ్చాడు. ‘మహారాజా! నిన్న అర్ధరాత్రి నిద్రిస్తున్న సమయంలో ఎవరో నా భార్యను అపహరించుకుపోయారు. దయచేసి ఆమెను వెదికించి నాకు ఇప్పించు’ అని కోరాడు. ‘బ్రాహ్మణోత్తమా! నీ భార్య ఎలా ఉంటుంది?’ అడిగాడు ఉత్తముడు.‘మహారాజా! నా భార్య కురూపి. అంతేకాదు, గయ్యాళి. భార్య ఎలాంటిదైనా ఆమెను భరించడం భర్త ధర్మం. అందువల్ల నా భార్యను వెదికి తెప్పించు. రాజుగా అది నీ ధర్మం’ అన్నాడు విప్రుడు. విప్రుడి భార్యను వెదకడానికి ఉత్తముడే స్వయంగా సిద్ధపడ్డాడు. విప్రుడిని వెంటపెట్టుకుని రథంపై బయలుదేరాడు. రాజధాని దాటిన కొంతసేపటికి ఒక అడవిని చేరుకున్నాడు. అక్కడ ఒక ముని ఆశ్రమాన్ని గమనించి, రథాన్ని నిలిపి ఆశ్రమం లోపలకు వెళ్లాడు.రాజును గమనించిన ముని, అతణ్ణి ఆదరంగా పలకరించాడు. అర్ఘ్యాన్ని తెమ్మని శిష్యుడికి చెప్పాడు. ఆ ముని రాజు వృత్తాంతం తెలుసుకుని అర్ఘ్యం ఇవ్వకుండానే ఆసనం సమర్పించి, సంభాషణ ప్రారంభించాడు. ‘మునీశ్వరా! మీ శిష్యుడు అర్ఘ్యం తేబోయి, మళ్లీ తిరిగి వెనక్కు ఎందుకు వెళ్లాడో అంతుచిక్కడం లేదు. కారణం తెలుసుకోవచ్చునా?’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! నా శిష్యుడు త్రికాలవేది. నిన్ను చూసిన వెంటనే గతంలో నువ్వు నీ భార్యను అడవిలో ఒంటరిగా వదిలేశావని తెలుసుకున్నాడు. అందుకే నువ్వు అర్ఘ్యం స్వీకరించడానికి యోగ్యతను పోగొట్టుకున్నావు’ అన్నాడు. ‘స్వామీ! నా తప్పును తప్పక దిద్దుకుంటాను. నాతో వచ్చిన ఈ విప్రుడి భార్యను ఎవరో అపహరించారు. ఆమెను ఎవరు తీసుకువెళ్లారో, ఎక్కడ బంధించారో చెప్పండి’ అడిగాడు ఉత్తముడు. ‘రాజా! ఈ విప్రుడి భార్యను బలాకుడు అనే రాక్షసుడు అపహరించాడు. ఉత్తాలవనంలో బంధించాడు’ అని చెప్పాడు.ఉత్తముడు విప్రుడిని వెంటపెట్టుకుని ఉత్తాలవనం చేరుకున్నాడు. అక్కడ రాక్షసుడి చెరలో ఉన్న విప్రుడి భార్యను చూశాడు. రాజును చూడగానే ఆమె ‘రాజా! ఎవరో రాక్షసుడు నన్ను అపహరించి ఇక్కడ బంధించాడు. ఇప్పుడు అతడు తన అనుచరులతో వనానికి అటువైపు చివరకు వెళ్లాడు’ అని చెప్పింది. ఉత్తముడు ఆమె చెప్పిన దిశగా బయలుదేరాడు. అక్కడ బలాకుడు తన అనుచరులతో కనిపించాడు. ఉత్తముడు విల్లంబులను ఎక్కుపెట్టగానే ఆ రాక్షసుడు భయభ్రాంతుడై కాళ్ల మీద పడ్డాడు. ‘ఓరీ రాక్షసా! నువ్వు వేదపండితుడైన ఈ విప్రుడి భార్యను ఎందుకు అపహరించావు?’ అని గద్దించాడు ఉత్తముడు.‘రాజా! ఈ విప్రుడు యజ్ఞాలలో రక్షోఘ్న మంత్రాలను పఠిస్తూ, నేను ఆ పరిసరాల్లో సంచరించకుండా చేస్తున్నాడు. అతడి నుంచి భార్యను దూరం చేస్తే అతడు యజ్ఞాలు చేయడానికి అనర్హుడవుతాడు. అందుకే ఆమెను అపహరించుకు వచ్చాను. అంతకు మించి నాకే దురుద్దేశమూ లేదు’ అని బదులిచ్చాడు. ‘అయితే, రాక్షసా! నువ్వు ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను విప్రుడికి అప్పగించు’ అన్నాడు ఉత్తముడు.అతడు సరేనంటూ, ఆమెలోని దుష్టస్వభావాన్ని భక్షించి, ఆమెను సురక్షితంగా విప్రుడికి అప్పగించి వచ్చాడు. ‘రాజా! ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను తలచుకుంటే వచ్చి సాయం చేస్తాను’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు బలాకుడు.విప్రుడి భార్యను అప్పగించాక ఉత్తముడు తన భార్య ఆచూకీ కోసం తిరిగి ముని ఆశ్రమానికి వచ్చాడు.‘నీ భార్యను కపోతుడనే నాగరాజు మోహించి, రసాతలానికి తీసుకుపోయాడు. అతడి కూతురు నంద నీ భార్యను రహస్యంగా అంతఃపురంలో దాచింది. నాగరాజు కొన్నాళ్లకు తిరిగి వచ్చి తాను తెచ్చిన వనిత ఏదని అడిగితే కూతురు బదులివ్వలేదు. దాంతో కోపించి, ‘నువ్వు మూగదానిగా బతుకు’ అని శపించాడు. ఇప్పుడు నీ భార్య నాగరాజు కూతురి సంరక్షణలో సురక్షితంగా ఉంది’ అని చెప్పాడు ముని.ఉత్తముడు వెంటనే బలాకుడిని తలచుకున్నాడు. నాగరాజు చెరలో ఉన్న తన భార్యను తీసుకురమ్మని చెప్పాడు. బలాకుడు ఆమెను అక్కడి నుంచి విడిపించి తెచ్చి ఉత్తముడికి అప్పగించాడు. — సాంఖ్యాయనఇవి చదవండి: ఆ నీళ్లు.. దేన్నైనా 'రాయిగా మార్చేస్తున్నాయంటే నమ్ముతారా'? -
Short Story: ఉదయాన్నే ఒక గంట శబ్ధం వినపండింది.. అదేంటో కనుక్కోండి..!
ఒకనాటి ఉదయాన్నే అడవిలోంచి ఒక గంట శబ్దం మృగరాజైన సింహం చెవుల్లో సోకి ఎంతగానో ఆకట్టుకుంది. దాని ఉనికి తెలుసుకోవాలన్న కుతూహలంతో వెంటనే అన్ని జంతువులనూ సమావేశపరచింది. ‘ఈరోజు ఉదయాన్నే ఒక గంట శబ్దం నా చెవిన పడి నన్ను ముగ్ధుడిని చేసింది. తక్షణమే దాని గురించి కనుక్కుని చెప్పండి’ అని తన గుహలోకి పోయింది. అది విన్న జంతువులన్నీ తమలో తాము గుసగుసలాడుకున్నాయి.‘ఔను! నేనూ ఈరోజు ఆ గంట శబ్దం విన్నాను భలేగా ఉంది.. గణగణలాడుతూ..’ అన్నది కుందేలు. ‘ఆ చప్పుడుకి తెల్లవారుతూనే నాకు తెలివొచ్చేసింది. ఏదో కొమ్మ మీంచి కొమ్మకు గెంతుతుంటే అదోవిధమైన ధ్వని నా మనసును హత్తుకుంది’ తోడేలు చెప్పింది. ‘మీకెందుకలాగ అనిపించిందో నాకైతే బోధపడటం లేదు. పదేపదే ఆ గంట మారుమోగుతుంటే చెడ్డ చిరాకేసింది. అది ఎవరు చేస్తున్నదీ తెలిస్తే చంపకుండా వదలను’ అని కోపం ప్రదర్శించింది ఎలుగుబంటి.‘మృగరాజు చెప్పిన పనిని మనం చేయడం ధర్మం. సరేనా!’ అన్నది ఒంటె. మళ్ళీ గంట శబ్దం అదేపనిగా వినబడసాగింది. చీకటిపడే సమయానికి కూడా దాని ఉనికి కనుక్కోలేక తమ గూటికి చేరాయన్నీ. మర్నాడు ఉదయం ఒక కోతి గెంతుకుంటూ వచ్చి ‘ఒక పిల్లి తన గంట మెడలో కట్టుకుంది. అది కదిలినప్పుడల్లా మారుమోగి అడవి అంతా వ్యాపిస్తోంది. ఇదే విషయం మనం సింహానికి చెప్పేద్దామా?’ అని సాటి జంతువులతో అన్నది. ‘చెబితే మనల్ని ఆ గంట తెమ్మని అడగవచ్చు. దానికి సిద్ధపడితేనే మనం చెప్పాలి. లేకపోతే అంతా ఆలోచించాక చెవిన వేద్దాం’ అన్నది ఏనుగు.అదే సమయంలో గుహలోంచి సింహం గర్జిస్తూ బయటకొచ్చి ‘మీరంతా గంట సంగతి ఏం చేశారో చెప్పారు కాదు. ఈ ఉదయం కూడా అది నాకు వినబడి మరింత ఆకట్టుకుంది. చెప్పండి..’ అని హుంకరించింది. ‘మరి.. మరి.. అది.. ఒక పిల్లి మెడలో ఉండటం ఈ కోతి కళ్ళబడింది’ అని చెప్పేసింది కుందేలు.‘ఆ! ఒక పిల్లి మెడలో గంటా? అది దాని మెడలోకి ఎలావచ్చింది? ఎవరు కట్టారు? ఒక పిల్లి అంత ధైర్యంగా గంట కట్టుకుని అడవంతా తిరగటమేమిటి? ఈ రోజు ఎలాగైనా ఆ గంటను తెచ్చి నా మెడకు కట్టండి. లేకుంటే ఏంచేస్తానో నాకే తెలీదు’ అని గర్జించింది సింహం. వెంటనే జంతువులన్నీ అడవిలో గాలించడం మొదలెట్టాయి. అదే సమయంలో ఒక లేడి చెంగుచెంగున గెంతుకుంటూ వచ్చి ‘పిల్లి మెడలో గంట కట్టింది ఎలుకలని తెలిసింది. అవి ఎందుకలా కట్టాయో వాటికి కబురుపెట్టి అడగండి..’ అని చెప్పింది.ఎలుకలకు కబురు వెళ్ళింది. ఎలుకల నాయకుడు జంతువుల ముందు హాజరై ‘మా ఎలుకలకు ప్రాణహాని కలిగిస్తున్న ఒక పిల్లి నుండి రక్షించుకోడానికి మెడలో గంటకడితే ఆ చప్పుడుకి దాని ఉనికి తెలుస్తుందని అప్పుడు మేమంతా జారుకోవచ్చని ఉపాయం ఆలోచించాం’ అన్నది. ‘మరి మీరు చేసిన పనికి మేమంతా ఇప్పుడు ఇరుక్కున్నాం. ఆ శబ్దం మృగరాజుకు తెగ నచ్చేసింది. అందువలన మీరు ఆ గంటను దాని మెడలోంచి తీసి మాకివ్వాలి. మేము దాన్ని సింహం మెడలో కట్టాలి. ఆ పని మీరు త్వరగా చేయాలి’ అని ఎలుగుబంటి హుకుం జారీ చేసింది. ‘అయ్యో రామ! మా రక్షణ నిమిత్తం చచ్చేంత భయంతో ధైర్యం చేసి కట్టాం. మళ్ళీ దాన్ని తీసి తేవాలంటే గండకత్తెరే! మా కంటే మీరంతా శక్తిమంతులు. ధీశాలులు. దయచేసి మీలో ఎవరో ఒకరు పిల్లి మెడలో గంటను తొలగించండి. మళ్ళీ మాకు పిల్లి నుండి ప్రాణగండం తప్పదు. అయినా భరిస్తాం’ నిస్సహాయంగా చెప్పింది ఎలుకల నాయకుడు. ‘ఐతే సరే! వెళ్ళు. దానిపని ఎలా పట్టాలో మాకు తెలుసు. మృగరాజు కోరిక తీర్చడం మాకు ముఖ్యం’ అని ఎలుకను పంపేసింది ఏనుగు.కుందేలు ఎగిరి గంతేస్తూ ‘పిల్లి మెడలో గంట శబ్దం మన మృగరాజుకి నచ్చడం మన అదృష్టం. సింహానికి ఎప్పుడు ఆకలి వేసినా ఎవరని కూడా చూడకుండా వేటకు సిద్ధపడుతుంది. అలాంటప్పుడు మెడలో గంట ఉంటే ఆ చప్పుడు మనందరికీ వినిపించి తప్పించుకోడానికి అవకాశం వస్తుంది. అందువలన ఆ పిల్లి మెడలో గంటను తీసుకొచ్చి సింహానికి కట్టేయాలి’ అని అందరి వైపు చూసింది.‘పిల్లి మెడలో గంట తస్కరించడం ఏ మాత్రం? మీరు ఊ అంటే చాలు.. సాయంత్రంకల్లా తెచ్చేస్తా’ అన్నది కోతి హుషారుగా. జంతువులు ‘ఊ’ కొట్టాక కోతి అడవిలోకి పోయి గంట చప్పుడైన దిశగా పయనించింది. కోతి రాకను గమనించిన పిల్లి చెట్లన్నిటి పైనా తిరిగి తప్పించుకో చూసింది. అప్పుడు కోతి ‘మిత్రమా! నీరాక తెలుసుకొని నీ నుండి తప్పించుకోడానికి ఎలుకలు పన్నిన కుట్రలో భాగమే నీ మెడలో ఈ గంట. దాన్ని తీసిస్తే నీకే మంచిది. నువ్వు సడి చప్పుడు లేకుండా వెళ్ళి ఎలుకల పనిపట్టి నీ ఆకలి తీర్చుకోవచ్చును’ అన్న మాటలకి సంతోషపడి ఒప్పుకుంది. దాని మెడలోని గంటను విప్పి పట్టుకెళ్లి జంతువులందరి ముందు ఎలుగుబంటి చేతిలో పెట్టింది కోతి. ‘ఇక చూడండి.. మన మృగరాజు తన గోతిలో తానే పడే సమయం వచ్చింది’ అని తోడేలు అంటున్నంతలోనే.. గుహ లోపలున్న సింహం దగ్గరకి వెళ్ళి గంట దొరికిందని చెప్పింది కుందేలు.‘ఆహా! ఎంత అదృష్టం! నేను కోరుకున్న గంటను ఇక నామెడలో అలంకరించండి. ఆ శబ్దంతో అడవంతా మారుమోగి పోవాలి’ అన్నది బయటకొచ్చిన సింహం. ఎలుగుబంటి తన దగ్గర ఉన్న గంటను ఏనుగుకు ఇవ్వగా అది మృగరాజు మెడలో వేసింది. గంటను పదేపదే చూసుకుని మెడను తిప్పుతూ గంట శబ్దానికి తెగ ముచ్చట పడిపోతూ అడవిలోకి పరుగు తీసింది మృగరాజు. దాని వైఖరికి జంతువులన్నీ ‘గంట చప్పుడుకి మురిసిపోతోంది కాని అది తనకే గండమన్న సంగతి తెలుసుకోలేకపోయింది పాపం!’ అంటూ నవ్వుకున్నాయి. ‘సింహం కోరిక తమ పాలిట వరం’ అనుకుంటూ తమ దారిన తాము వెళ్లిపోయాయి. – కె.కె.రఘునందనఇవి చదవండి: ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది.. ఒకరోజు.. -
ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడేది! ఒకరోజు..
పూర్వం అంగీరస మహర్షికి భూతి అనే శిష్యుడు ఉండేవాడు. భూతి ముక్కోపి, మహా తపస్సంపన్నుడు. అతడికి కోపావేశాలకు అందరూ భయపడేవారు. ప్రకృతి కూడా అతడి కోపానికి భయపడి సక్రమంగా ప్రవర్తించేది. అంగీరసుడి వద్ద విద్యాభ్యాసం పూర్తయ్యాక భూతి స్వయంగా ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. వివాహం చేసుకుని, గృహస్థాశ్రమం చేపట్టాడు.భూతి మహర్షి తన ఆశ్రమంలో శిష్యులకు వేదవేదాంగాలను బోధించేవాడు. అతడి ఆశ్రమం నిత్యాగ్నిహోత్రంతో వేదమంత్రాలతో కళకళలాడుతూ ఉండేది. భూతి కోపాన్ని ఎరిగిన శిష్యులు అతడికి కోపం రాకుండా వినయంగా మసలుకుంటూ, శుశ్రూషలు చేసేవారు. భూతి మహర్షికి సువర్చుడు అనే సోదరుడు ఉన్నాడు. సువర్చుడు ఒకసారి యాగాన్ని చేయాలనుకున్నాడు. యాగానికి రమ్మంటూ సోదరుడు భూతిని ఆహ్వానించాడు. సోదరుడి యాగానికి వెళ్లాలని నిశ్చయించుకున్న భూతి, తన శిష్యుల్లో శాంతుడు అనేవాణ్ణి పిలిచి ఆశ్రమ బాధ్యతలను అప్పగించాడు.‘నేను తిరిగి వచ్చేంత వరకు ఆశ్రమంలో అగ్నిహోత్రం చల్లారకూడదు. అగ్నిహోత్రం చల్లారకుండా ఉండేందుకు నిత్య హోమాలు కొనసాగేలా చూడు’ అని ఆజ్ఞాపించి, సోదరుడి యాగాన్ని చూడటానికి బయలుదేరాడు. ఒకరోజు శాంతుడు, మిగిలిన శిష్యులు ఆశ్రమానికి సంబంధించిన వేరే పనుల్లో ఉండగా, అగ్నిహోత్రం చల్లారిపోయింది. అది చూసిన శిష్యులు గురువు తిరిగి వస్తే తమను ఏమని శపిస్తాడోనని భయపడుతూ గజగజలాడారు. జరిగిన దానికి శాంతుడు మరింతగా దుఃఖించాడు. గురువు తనకు ముఖ్యమైన బాధ్యత అప్పగించినా, అది సక్రమంగా నిర్వర్తించలేని తన అసమర్థతకు, నిర్లక్ష్యానికి విపరీతంగా బాధపడ్డాడు. ఇప్పుడు తాను తిరిగి హోమగుండాన్ని వెలిగించినా, గురువు దివ్యదృష్టితో జరిగిన తప్పు తెలుసుకుని, తనను శపించి భస్మం చేసేస్తాడనుకుని భయపడ్డాడు. ఇలాంటి విపత్కర పరిస్థితిలో ఇప్పుడు ఏం చేయాలని పరిపరి విధాలుగా ఆలోచించాడు. చివరకు అగ్నిదేవుడిని శరణు వేడుకుంటే, ఆయనే ఆపద నుంచి గట్టెక్కించగలడని తలచాడు. ‘నమః సర్వభూతానాం సాధనాయ మహాత్మనే/ ఏక ద్విపంచధిష్ణ్యాయ తాజసూయే షడాత్మనే...’ అంటూ అగ్నిదేవుడిని స్తుతిస్తూ ఆశువుగా స్తోత్రం పలికాడు. ‘ఓ అగ్నిదేవా! దేవతలందరికీ ముఖానివి నీవే! హోమ యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను, ఆజ్యాన్ని ఆరగించి దేవతలందరికీ తృప్తి కలిగిస్తున్నావు. దేవతలందరికీ నువ్వే ప్రాణస్వరూపుడివి. హుతాశనా! ‘విశ్వ’ నామధేయం గల నీ జిహ్వ ప్రాణులందరికీ శుభాలను ప్రసాదిస్తుంది. ఆ నాలుకతోనే మహాపాపాల నుంచి, భయాల నుంచి మమ్మల్ని రక్షించు. నా అశ్రద్ధ వల్లనే హోమగుండం చల్లారిపోయింది. నన్ను అనుగ్రహించు’ అని ప్రార్థించాడు.శాంతుడి ప్రార్థనకు అగ్నిదేవుడు సంతుష్టుడయ్యాడు. వెంటనే అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. ‘వత్సా! ఏమి నీ కోరిక? ఏ వరాలు కావాలో కోరుకో!’ అని అడిగాడు. ‘దేవా! నా అలక్ష్యం వల్ల హోమగుండం చల్లారిపోయింది. ఈ హోమగుండంలో పూర్వం నుంచి ఉన్న విధంగానే అగ్ని నిలిచి ఉండాలి. నా గురువుకు ఇప్పటి వరకు సంతానం లేదు. ఆయనకు పుత్రసంతానాన్ని అనుగ్రహించాలి. నా గురువు ఇకపై ప్రాణులపై స్నేహభావంతో ఉండాలి. నీ అనుగ్రహం కోసం నేను చేసిన స్తోత్రాన్ని ఎవరు పఠించినా వారిపై నీ అనుగ్రహాన్ని కురిపించాలి. ఇవే నేను కోరే వరాలు’ అన్నాడు శాంతుడు. శాంతుడి మాటలకు అగ్నిదేవుడు ముగ్ధుడయ్యాడు. అతడు కోరిన వరాలన్నింటినీ అనుగ్రహించాడు. ‘లోకంలో నువ్వు ఉత్తమ శిష్యుడివి. నీకోసం ఒక్క వరమైనా కోరుకోకుండా, నీ గురువు గురించే వరాలు కోరుకున్నావు. నీ గురువుకు పుట్టబోయే పుత్రుడు ‘మనువు’ అవుతాడు. నువ్వు చెప్పిన అగ్నిస్తోత్రం పఠించిన వారికి çసకల శుభాలూ జరుగుతాయి’ అని పలికి అదృశ్యమయ్యాడు. సోదరుడి యాగం పూర్తికావడంతో భూతి మహర్షి తన ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఆశ్రమంలో హోమగుండంలోని అగ్ని దేదీప్యమానంగా మండుతూ ఉండటంతో సంతృప్తి చెందాడు. శాంతుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘శిష్యా! ఎన్నడూ లేనివిధంగా నాకు అందరి మీద స్నేహభావం కలుగుతోంది. ఇదేదో వింతలా ఉంది. నాకు అంతుచిక్కడం లేదు. నీకమైనా తెలిస్తే చెప్పు’ అని అడిగాడు.గురువు ఆశ్రమాన్ని విడిచి వెళ్లినప్పటి నుంచి జరిగినదంతా శాంతుడు పూసగుచ్చినట్లు చెప్పాడు. అయితే, శాంతుడు భయపడినట్లుగా భూతి మహర్షి కోపగించుకోలేదు. శపించలేదు. పైగా అంతా విని ఎంతో సంతోషించాడు. తన శిష్యుడైన శాంతుడు అగ్నిదేవుడిని ప్రసన్నం చేసుకున్నందుకు గర్వించాడు. శాంతుడిని అభినందించాడు. నాటి నుంచి మరింత ప్రత్యేక శ్రద్ధతో శాంతుడికి సకల వేద శాస్త్రాలనూ, వాటి మర్మాలనూ క్షుణ్ణంగా బోధించి, తనంతటి వాడిగా తయారు చేశాడు.కొంతకాలానికి అగ్నిదేవుడి వరప్రభావంతో భూతి మహర్షికి కొడుకు పుట్టాడు. అతడే భౌత్యుడు. కాలక్రమంలో భౌత్యుడు పద్నాలుగో మనువుగా వర్ధిల్లాడు. అతడి భౌత్య మన్వంతరం ఏర్పడింది. – సాంఖ్యాయనఇది చదవండి: బౌద్ధవాణి.. మట్టికుండ నేర్పిన పాఠం -
ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా.. ఒకనాడు..
శ్రీరామ పట్టాభిషేకం తర్వాత కొన్నాళ్లకు ఆంజనేయుడు రాముని వద్ద సెలవు తీసుకుని, తపస్సు చేసుకోవడానికి గంధమాదన పర్వతానికి చేరుకున్నాడు. అక్కడ ఆశ్రమాన్ని నిర్మించుకుని, నిరంతరం తపస్సు కొనసాగించేవాడు. సముద్రాన్ని లంఘించి, లంకకు వెళ్లి అక్కడ సీతమ్మవారిని చూడటమే కాకుండా, రావణుడి ఆజ్ఞపై రాక్షసులు తోకకు నిప్పంటిస్తే లంకను తగులబెట్టి మరీ తిరిగి వచ్చిన వైనం సహా రామ రావణ యుద్ధంలో హనుమంతుని సాహసాలను జనాలు కథలు కథలుగా చెప్పుకొనేవారు. అయోధ్యవాసులకే కాదు, రామరాజ్యం అంతటా జనాలకు శ్రీరాముడితో పాటు ఆంజనేయుడు కూడా ఆరాధ్యుడయ్యాడు. గంధమాదన పర్వతం మీద నిర్మించుకున్న ఆంజనేయుడి ఆశ్రమం తాపసులకు ఆశ్రయంగా ఉండేది. ఆశ్రమంలో ప్రతిరోజూ వేదపఠనం సాగేది. తాత్త్విక చర్చలు సాగుతుండేవి. ప్రశాంతంగా కాలం గడిచిపోతుండగా, ఒకనాడు ఆంజనేయుడికి శ్రీరాముడిని దర్శించుకోవాలని కోరిక పుట్టింది. వెంటనే తన ఒంటె వాహనం మీద అయోధ్య నగరానికి బయలుదేరాడు. జానకీ సమేతుడైన శ్రీరాముడిని దర్శించుకుని, పరిపరి విధాలుగా స్తుతిస్తూ ప్రణమిల్లాడు. శ్రీరాముడు ఆంజనేయుడిని ఆలింగనం చేసుకుని, ఉచితాసనంపై కూర్చుండబెట్టాడు. ‘ఇక్కడి నుంచి గంధమాదనానికి వెళ్లిపోయాక చాన్నాళ్లకు వచ్చావు. నీ రాక నాకే కాదు, సీతకు కూడా ఆనందదాయకమే! నువ్వు ఉంటున్న చోటు సౌకర్యంగానే ఉందా? ఆశ్రమవాసంలో అంతా కుశలమే కదా?’ అంటూ కుశలప్రశ్నలు వేశాడు. ‘రామా! నీ దయ నిరంతరం నా మీద ఉండగా నాకు చింత ఏమిటి? క్షేమంగానే ఉన్నాను స్వామీ!’ అని బదులిచ్చాడు ఆంజనేయుడు. ‘హనుమా! సీతాన్వేషణ మొదలుకొని రావణుడితో యుద్ధం వరకు నాకు ఎన్నో రకాలుగా తోడుగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు నాకు మరొక పని చేసిపెట్టాలి’ అన్నాడు రాముడు. ‘ఆజ్ఞాపించు ప్రభూ! నీ ఆజ్ఞను నెరవేర్చడమే నా కర్తవ్యం’ చేతులు జోడించి అన్నాడు హనుమంతుడు. ‘నా అంగుళీయకాన్ని అడిగితే దానిని బ్రహ్మదేవుడికి ఇచ్చాను. లంకలో ఉన్నప్పుడు సీత ఆ ఉంగరాన్ని చూసుకుంటూ తన దుఃఖాన్ని తీర్చుకునేది. ఇప్పుడు ఆ ఉంగరం కావాలి. నువ్వు వెంటనే సత్యలోకానికి వెళ్లి, ఆ ఉంగరాన్ని తెచ్చి ఇవ్వు’ అన్నాడు రాముడు. శ్రీరాముడి మాట పూర్తికావడమే తడవుగా ఆంజనేయుడు రివ్వున ఆకాశానికి ఎగిరాడు. వాయువేగ మనోవేగాలతో నేరుగా సత్యలోకానికి చేరుకున్నాడు. సత్యలోకంలో బ్రహ్మదేవుడి కొలువు నిండుగా ఉంది. అష్టదిక్పాలకులు, సనక సనందాది మహామునులు అక్కడ ఉన్నారు. ఆంజనేయుని చూడగానే వారందరూ లేచి నమస్కరించి, అతడిని ఉచితాసనంపై కూర్చుండబెట్టారు. సభలోకి బ్రహ్మదేవుడు అడుగుపెట్టాడు. సభాసదులందరూ ఆయనకు నమస్కరించారు. ఆంజనేయుడు కూడా లేచి నిలుచుని బ్రహ్మదేవుడికి నమస్కరించాడు. ‘దేవా! మా శ్రీరామచంద్రుడు తన రత్నఖచిత కనక అంగుళీయకాన్ని నీకు ఇచ్చాడట. ఆ ముద్రికను తీసుకు రమ్మని నన్ను ఇక్కడకు పంపాడు. ఆ ముద్రికను వెంటనే ఇచ్చేస్తే, నేను దానిని తీసుకువెళ్లి నా ప్రభువుకు అందిస్తాను’ అన్నాడు. ‘ఇది సత్యలోకం. ఇక్కడ ఒకసారి ఇచ్చినది ఏదైనా తిరిగి ఇవ్వడానికి వీలుపడదు’ అని పలికాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడి మాటలకు ఆంజనేయుడికి కోపం వచ్చింది. ‘బ్రహ్మదేవా! బొత్తిగా కృతజ్ఞత లేకుండా మాట్లాడుతున్నావు. నాకు ఇక్కడ ఆలస్యం చేయడానికి వీలుపడదు. నువ్వు ఇవ్వకుంటే, ఈ సత్యలోకాన్నే పెళ్లగించుకుని పోయి నా ప్రభువు పాదాల ముందు ఉంచుతాను’ అంటూ తన దేహాన్ని విపరీతంగా పెంచి విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. సత్యలోకంలో ఉన్నవారంతా ఆంజనేయుని భీకర విశ్వరూపాన్ని చూసి హాహాకారాలు చేశారు. ఇంతలో సనక మహర్షి కల్పించుకుని, ‘బ్రహ్మదేవా! రామదూత ఆంజనేయుడి బలవిజృంభణను చూశావు కదా! పరిస్థితి అదుపు తప్పక ముందే ఆ ముద్రికను అతడికి ఇచ్చి పంపడమే మంచిది’ అని పలికాడు. అప్పుడు బ్రహ్మదేవుడు పక్కనే తామరలతో నిండి ఉన్న కొలనను చూపించి, ‘ఆ ముద్రిక అందులోనే ఉంది. తీసుకువెళ్లు’ అన్నాడు. హనుమంతుడు కొలనులోకి చూస్తే, నీటి అడుగున అసంఖ్యాకంగా రామ ముద్రికలు కనిపించాయి. అన్నిటినీ తీసుకువెళ్లడానికి రామాజ్ఞ లేదు. ఏం చేయాలో తోచక ఆంజనేయుడు రిక్తహస్తాలతోనే అయోధ్యకు చేరుకుని, రాముడికి జరిగిన సంగతంతా చెప్పాడు. ‘హనుమా! ఆ సరస్సున ఉన్నవి నా అంగుళీయకానికి బింబ ప్రతిబింబాలే! వాటి మహిమతోనే బ్రహ్మదేవుడు సత్యలోకాన్ని సకలలోక సమ్మతంగా పరిపాలిస్తున్నాడు. వాటిలో ఒకటి తీసుకురా’ అని చెప్పాడు. హనుమంతుడు వెంటనే మళ్లీ సత్యలోకానికి వెళ్లి సరస్సులో ఉన్న ముద్రికల్లో ఒకదానికి తీసుకువచ్చి, రాముడికి అందజేశాడు. రాముడు సంతోషించి, ‘హనుమా! భవిష్యత్తులో నువ్వే సత్యలోకాధిపత్యం పొంది భవిష్యద్బ్రహ్మవై వర్ధిల్లగలవు’ అని ఆశీర్వదించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: బౌద్ధవాణి: నిద్రకు దూరం చేసే పనులు.. -
Funday Story: బాలిశెట్టి అహం..!
బాలిశెట్టి.. కిరాణా కొట్టు వ్యాపారి. నిత్యావసర సరుకులు బియ్యం, బెల్లం, పప్పు, ఉప్పు, చింతపండు వంటివి అమ్మేవాడు. వ్యాపారం బాగా సాగటంతో చేతికింద పనివాడిని పెట్టుకోవాలని అనుకున్నాడు. పక్క గ్రామంలో ఉండే నర్సయ్య పనికి కుదిరాడు. బాలిశెట్టికి తన కింద పనిచేసేవారంటే చులకన ఎక్కువ. తన ముందు వాళ్లు దేనికీ సరితూగరనీ, ఎందుకూ పనికిరారనే అహంతో ఉండేవాడు. నర్సయ్యది కష్టపడి పనిచేసే స్వభావం. దుకాణం తెరిచినప్పటి నుండి మూసేవరకు బాలిశెట్టి చెప్పే రకరకాల పనులన్నిటినీ కాదనకుండా చేసేవాడు. దుకాణంలో దుమ్ము దులపడం, సరుకులు పొట్లాలు, మూటలు కట్టడం చేసేవాడు. అతనికి ఏమాత్రం విరామం దొరికినా.. పప్పులు, బియ్యంలో ఉండే రాళ్లు ఏరమని పురమాయించేవాడు బాలిశెట్టి. ఎంతపని చేసినా తృప్తి ఉండేది కాదు. పని వేళలు ముగిసి నర్సయ్య ఇంటికి వెళ్లబోతుంటే ఉల్లిగడ్డల బస్తాను కరణం గారింట్లోనో, బియ్యం బస్తాను మునసబు గారింట్లోనో వేసి పొమ్మనేవాడు. ఇంటికి ఆలస్యం అవుతుంది, మరునాడు వేస్తానంటే కించపరుస్తూ, వెక్కిరిస్తూ మాట్లాడేవాడు. బాలిశెట్టి కూతురు పెళ్ళీడు కొచ్చింది. చదువుకున్న పిల్ల కావటంతో మంచి సంబంధం కుదిరింది. నర్సయ్యను దుకాణం పనులతోపాటు, పెళ్ళి పనులకూ తిప్పుకోవటం మొదలుపెట్టాడు. దాంతో ఏ అర్ధరాత్రో ఇంటికి చేరేవాడు నర్సయ్య. ఇంట్లోవాళ్ళు బాలిశెట్టి దగ్గర పని మానేయమని ఒత్తిడి చేశారు. పెళ్ళికి మూడురోజుల ముందు బాలిశెట్టి ఇంట్లో దొంగలు పడి ఉన్న నగలు, నగదు దోచుకుపోయారు. కూతురు పెళ్లి ఆగిపోతుందని బాలిశెట్టి భయపడి నర్సయ్యకు చెప్పుకుని భోరున ఏడ్చాడు. ‘అయ్యా! మీరేం కంగారు పడకండి. మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి ఖర్చులు నేను సర్దుతాను’ అన్నాడు నర్సయ్య. ఆమాటకు బాలిశెట్టి ఆశ్చర్యపోయాడు. నర్సయ్యకు తన ఊరిలో పదిహేను ఎకరాల మాగాణి, ఇరవై ఎకరాల మామిడితోట, సొంత ఇల్లు ఉంది. ఇప్పుడు కొడుకు వ్యవసాయం పనులు చూసుకుంటున్నాడు. అతనికి ఇంట్లో కూర్చోని విశ్రాంతి తీసుకోవటం ఇష్టంలేకనే బాలిశెట్టి వద్ద పనిలో చేరాడని తెలిసింది. తన కూతురు పెళ్లికి నగదు సహాయం చేశాడు నర్సయ్య. ఆనాటి నుండి ఇతరులను తక్కువ అంచనా వేయటం, చులకనగా చూడటం మానేశాడు బాలిశెట్టి. — తేజశ్రీ -
పిల్లల కథ.. 'మల్లారం గ్రామంలో మారిన మాల్యాద్రి'..
మీర్పేట మహారాజు మాణిక్యవర్మ. అతని ఏకైక కూతరు మూకాంబికకు పక్షులంటే మహా ప్రాణం. కొందరు ఆమె పుట్టినరోజుకు ప్రత్యేకతలు నేర్చిన పక్షులను బహుమతిగా ప్రదానం చేసేవారు. వాటిని చూసి మూకాంబిక ముచ్చట పడేది. యువరాణికి పక్షిని బహుకరించినందుకు ఊహించనంత నగదు ముట్ట చెప్పేవాడు మాణిక్య వర్మ. ఆమె దగ్గర పాటలు పాడే కోకిల, మాటలు చెప్పే చిలుక, నాట్యం చేసే నెమలి ఉన్నాయి. మల్లారం గ్రామంలో మాల్యాద్రి అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా మెండివాడు. తన స్వభావం మార్చుకోమని ఎవరు చెప్పినా వినేనాడు కాదు. తనకు నచ్చింది చేసుకుపోయేవాడు. వచ్చే మాసంలో ఉన్న యువరాణి మూకాంబిక పుట్టినరోజుకు ఏదైన పక్షిని బహుకరించి నగదు పొందాలనుకున్నాడు మాల్యాద్రి. వెంటనే వల పట్టుకుని అడవి బాటపట్టాడు. వలవేసి ధాన్యం, పురుగులు చల్లి చెట్టు నీడలో చతికిల పడ్డాడు. కొద్ది సేపటికి వలలో ఒక అందమైన తెల్లని కొంగ పిల్ల చిక్కింది. కొంగను బుట్టలో వేసుకుని ఇంటికి బయలు దేరాడు. కొంగ తెల్లగా, అందంగా ఉన్నందుకు మురిసి పోయాడు. ‘అందమైన కొంగ యువరాణికి బహుకరిస్తే రాజుగారు ఊహించనంత నగదు ఇస్తాడని’ కలలు కన్నాడు. ఐతే కొంగకు ఏదో ఒక ప్రత్యేకత ఉంటేనే యువరాణి మెచ్చుతుంది. కొంగకు ఏం ప్రత్యేకత ఉందో మాల్యాద్రికి తెలీదు. దారిలో గుడిముందు ఒక సాధువు కనిపించాడు. వంగి నమస్కరించి ‘సామీ ! కొంగకు ఏమైనా ప్రత్యేకతలుంటాయా!?’ అడిగాడు మాల్యాద్రి. సాధువు బుట్టలో ఉన్న కొంగను గమనించాడు. చిన్నగా నవ్వి ‘సరిగమ పదనిస’ అనేవి సప్త స్వరాలని తెలుసు కదా! అందులో ప్రతి స్వరం పక్షి లేదా జంతువు అరుపు నుంచి తీసుకున్నవే. అందులో ‘మ’ అంటే ‘మధ్యమం’ కొంగ అరుపు నుండి తీసుకోబడిందని చెపుతారు. ఇలా కొంగకు కూడా ఓ ప్రత్యేకమైన అరుపు ఉంటుంది. కానీ చిలుకలా మాట్లాడదు. నేర్పితే నేర్చుకోదు’ అన్నాడు. ‘ఎందుకు నేర్చుకోదు సామీ! నాకాడ నాటకాలు నడవవు. నేను నేర్పిస్తాగా!’ అంటూ ముందుకు కదిలాడు. ఇంటికి చేరిన మాల్యాద్రి కొంగ పిల్లను పంజరంలో పెట్టాడు. దానికి పంజరంలో ఉండటం నచ్చలేదు. మల్యాద్రి కొంగకు జీడిపప్పు, బాధం పప్పు పెట్టాడు. కానీ దానికి స్వేచ్ఛగా ఎగిరి, కష్టపడి సొంతంగా ఆహారం సంపాదించటమే ఇష్టం. దానికి చెరువులో చేపల కోసం, తీరంలో ఎరలు, పురుగులు, కప్పలను వెతుకుతూ ఒడ్డు వెంబడి నిశ్శబ్దంగా నడవటం ఆనందం. నిశ్చలంగా నిలుచుని ఆహారం కనబడగానే చటుక్కున పట్టుకొని గుటుక్కున మింగటంలోనే తృప్తి. ఇలా కష్టం లేకుండా పంజరంలో పెట్టిన ఆహారం దానికి రుచించలేదు. కొంగతో చిన్న చిన్న పదాలు పలికించటానికి ప్రయత్నించాడు మాల్యాద్రి. అది ఏదన్నా తిరిగి ‘మా’ అని అరిచేదే తప్ప చిలుకలా తిరిగి పలికేది కాదు. చుట్టు పక్కలవాళ్లు ‘కొంగలు.. మనుషుల మాటలు విని తిరిగి పలుకలేవు. నీ ప్రయత్నం మానుకో’ అని చెప్పారు. కానీ మొండివాడైన మాల్యాద్రికి వారి మాటలు చెవికెక్కలేదు. పక్షం రోజులైనా కొంగ తిరిగి మాట్లాడలేదు. మాల్యాద్రికి కొంగపై విసుగొచ్చింది. అప్పుడే అటుగా పోతున్న సాధువు మాల్యాద్రిని చూసి ఆగాడు. ‘చెప్పాను కదా నాయనా ! కొంగ వినటమే తప్ప చిలుకలా మాట్లాడదని! చిలుకలకు వాటి శ్వాసనాళంలో ప్రత్యేక అవయవం ఉంటుంది. ఆ అవయవం చిలుకకు మానవ భాష మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటికైనా నీ ప్రయత్నం మానుకుని కొంగను పంజరం నుంచి విడుదలచెయ్యి’ అన్నాడు సాధువు. మాల్యాద్రి మొండితనం వీడి ఆలోచించాడు. చిలుక, కొంగలు పక్షులైనా స్వభావాలు వేరని గ్రహించాడు. మాల్యాద్రి తన స్వభావం మార్చుకున్నాడు. మారిన మాల్యాద్రి పంజరం నుంచి కొంగను విడుదల చేశాడు. — ముద్దు హేమలత ఇవి చదవండి: ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది.. -
ఎవరూ.. బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రి అది..
అర్ధరాత్రి దాటి రెండు గంటలు కావస్తోంది. తళతళలాడే లక్షలాది నక్షత్రాలతో ఆకాశం చుక్కల యవనికలా మిలమిల మెరిసిపోతోంది. పౌర్ణమి గడిచి వారం రోజులు కావస్తుండడంతో.. సగం చిక్కిన చంద్రుడు నింగిని అధిరోహించాడు, బలహీనమైన వెన్నెలలు ప్రపంచమంతా వెదజల్లే ప్రయత్నం బలహీనంగా చేస్తూ! మంచు కురవడం మొదలై దాదాపు గంటసేపు కావస్తోంది. దిశ మార్చుకున్న గాలి, చూట్టూ ఆవరించి ఉన్న ఎత్తైన పర్వతసానువులనుండి బలంగా వీచసాగింది. వాతావరణం శీతలంగా మారిపోయింది. అంతవరకూ ఇళ్ళలో ఆదమరచి పవళిస్తున్న ప్రజలు విసుక్కుంటూ లేచి కూర్చొని, కాళ్ల దగ్గర ఉంచుకున్న ఉన్నికంబళ్ళు కప్పుకొని, వెచ్చని నిద్రలోకి తిరిగి జారిపోయారు! దొంగలూ, క్రూరమృగాలూ తప్ప సాధారణ మానవులు బయటకు రావడానికి సాహసించని నిశిరాత్రిలో.. గజగజలాడిస్తున్న చలిలో రెండంతస్తుల భవనపు విశాలమైన మిద్దెపై ఒంటరిగా నిలుచొని.. ఆకాశం వేపు పరిశీలనగా చూస్తూ నిలుచున్నాడొక వ్యక్తి. ఆయన వయసు ఇంచుమించు నలభయ్యేళ్లు ఉండొచ్చు. ఆజానుబాహుడు.. స్ఫురద్రూపి. విశాలమైన ఫాలభాగం.. దానికి కిందుగా దశాబ్దాల తరబడి కఠోరమైన శ్రమదమాదులకోర్చి సముపార్జించుకున్న జ్ఞానసంపదతో జ్యోతుల్లా ప్రకాశిస్తున్న నేత్రద్వయం.. గుండెలోతుల్లో నిక్షిప్తమై ఉన్న దయాళుత్వాన్నీ, మానవత్వాన్నీ ఎలుగెత్తి చాటు తున్నట్టున్న కోటేరువంటి నాసికా, ఆయనలోని ఆత్మవిశ్వాసానికి బాహ్యప్రతీక వంటి బలమైన చుబుకం, వంపు తిరిగిన పల్చని పెదాలూ.. నిష్ణాతుడైన గ్రీకు శిల్పి ఎవరోగాని అచంచలమైన భక్తిశ్రద్ధలకోర్చి మలచిన పాలరాతి శిల్పంలా.. సంపూర్ణపురుషత్వంతో తొణికిసలాడుతున్న ఆ ఆర్యపుత్రుని పేరు.. ఆర్టబాన్. ప్రాచీన ‘మెడియా(ఇరాన్ దేశపు వాయవ్యప్రాంతం)’ దేశానికి చెందిన ‘ఎక్బటానా’ నగరానికి చెందిన వాడు. ఆగర్భశ్రీమంతుడు.. విజ్ఞానఖని.. బహుశాస్త్రపారంగతుడు! ఖగోళశాస్త్రం ఆయనకు అత్యంతప్రియమైన విషయం. ‘మెడియా’ దేశానికి చెందిన ప్రముఖ ఖగోళశాస్త్రవేత్తలలో ఒకరిగా గుర్తింపూ, గౌరవమూ గడించినవాడు. అంతటి ప్రసిద్ధుడూ, గొప్పవాడూ.. అటువంటి అసాధారణ సమయంలో.. ఒంటరిగా నిలబడి నభోమండలాన్ని తదేకదీక్షతో పరిశీలిస్తూ ఉండడానికి బలమైన హేతువే ఉంది. ఆనాటి రాత్రి.. అంతరిక్షంలో.. అపూర్వమైన అరుదైన సంఘటన ఒకటి చోటు చేసుకోబోతోంది. సౌరవ్యవస్థలో అతి పెద్దవైన రెండు గ్రహాలు.. గురుడూ, శనీ.. మీనరాశిలో కూటమిగా కలవబోతున్నాయి. ఆ కలయిక సమయంలో, అప్పటి వరకూ ఏనాడూ గోచరించని కొత్తతార ఒకటి, అంతరిక్షంలో అతికొద్ది సమయంపాటు కనిపించబోతోంది. దాని సాక్షాత్కారం.. మానవాళి మనుగడనూ, విశ్వాసాలనూ అతిబలీయంగా ప్రభావితం చేయబోయే మహోన్నతుడు, మానవావతారం దాల్చి, ఇశ్రాయేలీయుల దేశంలో అవతరించిన అసమానమైన ఘటనకు సూచన! జ్ఞానసంపన్నుడైన ఆర్టబాన్, ఆయన ప్రాణమిత్రులూ, సహశాస్త్రవేత్తలూ అయిన ‘కాస్పర్’, ‘మెల్కియోర్’, ‘బాల్తజార్’లతో కలిసి దశాబ్దాలుగా శోధిస్తున్న శాస్త్రాలు అదే విషయాన్ని విస్పష్టంగా ప్రకటిస్తున్నాయి. అపూర్వమైన ఆ సంఘటనను వీక్షించడానికే ఆర్టబాన్ తన స్వగ్రామంలోనూ, ఆయన స్నేహితులు అచ్చటికి ఇంచుమించు ఐదువందల మైళ్ళ దూరంలోనున్న ‘బోర్సిప్పా’ నగరంలోని ‘సప్తగ్రహ మందిరం’ (టెంపుల్ ఆఫ్ సెవెన్ స్ఫియర్స్)లోనూ నిద్ర మానుకొని, మింటిని అవలోకిస్తూ కూర్చున్నారు! ∙∙ మరో గంట నెమ్మదిగా గడిచింది. గురు, శనిగ్రహాల సంగమం పూర్తయింది. ‘ఇదే సమయం.. ఇప్పుడే ‘అది’ కూడా కనబడాలి. శాస్త్రం తప్పడానికి వీలులేదు’ అని తలపోస్తూ, అంతరిక్షాన్ని మరింత దీక్షగా పరికిస్తున్నంతలో ఆర్టబాన్ కళ్లబడిందా కాంతిపుంజం! కెంపువన్నె గోళం! ఏకమై ఒక్కటిగా కనిపిస్తున్న రెండు గ్రహాలను ఆనుకొని, కాషాయవర్ణపు కాంతిపుంజాలు వెదజల్లుతూ!! కొద్ది సమయం మాత్రమే, శాస్త్రాలలో వర్ణించినట్టే.. ప్రత్యక్షమై, తరవాత అంతర్ధానమైపోయింది!! రెండు దశాబ్దాల నిరీక్షణ ఫలించిన ఆనందంతో పులకించిపోయాడు ఆర్టబాన్. తన ఇష్టదైవమైన ‘ఆహూరా మజ్దా’ (జొరాస్ట్రియన్ దేవగణంలో అత్యంతప్రముఖుడు) ముందు సాగిలపడి, సాష్టాంగప్రణామాలు ఆచరించాడు. ‘బోర్సిప్పా’ చేరుకోడానికి అప్పటికి సరిగ్గా పదిరోజుల సమయం మాత్రమే ఉంది ఆర్టబాన్కు. ఎత్తైన పర్వతసానువుల గుండా, దట్టమైన అరణ్యాలగుండా సాగే ప్రమాదకరమైన మార్గం. ఎంత వేగంగా ప్రయాణించినా దినానికి యాభై మైళ్ళు మించి ప్రయాణించడానికి సాధ్యంకాని మార్గం. అనుకున్న సమయానికి చేరుకోలేకపోతే.. ముందుగా చేసుకున్న ఏర్పాటు ప్రకారం ‘జగద్రక్షకుని’ దర్శనానికి స్నేహితులు ముగ్గురూ పయనమైపోతారు. తను మిగిలిపోతాడు. ‘ఒకవేళ అదే జరిగితే.. ‘భగవత్స్వరూపుని’ అభివీక్షణానికి వెళ్లలేకపోతే’.. అన్న ఆలోచనే భరించరానిదిగా తోచింది ఆర్టబాన్కు. ఇక ఆలస్యం చెయ్యకూడదనుకున్నాడు. వెంటనే బయలుదేరాలనుకున్నాడు. ప్రయాణానికి అవసరమైన ఏర్పాట్లన్నీ అప్పటికే పూర్తిచేసుకొని, సిద్ధంగా ఉన్నాడేమో, తన జవనాశ్వం.. ‘వాస్దా’ను అధిరోహిచి బోర్సిప్పా దిశగా ప్రయాణం ప్రారంభించాడు. ప్రారంభించే ముందు, కొత్తగా జన్మించిన ‘యూదుల రాజు’కు కానుకగా అర్పించుకొనుటకు దాచి ఉంచిన విలువైన మణులు మూడూ భద్రంగా ఉన్నాయో లేదో ఒకసారి చూసుకున్నాడు. ఆసరికి తూర్పున వెలుగురేకలు చిన్నగా విచ్చుకుంటున్నాయి. ప్రపంచాన్ని కమ్ముకున్న చీకటి ఛాయలు నెమ్మదిగా తొలగిపోతున్నాయి. ప్రయాణం ప్రారంభించిన తొమ్మిదవనాటి సంధ్యాసమయానికి ‘యూఫ్రటీస్’ నదీతీరానున్న బాబిలోన్ నగరశివారులకు చేరుకున్నాడు. గమ్యస్థానమైన ‘బోర్సిప్పా’ అక్కడకు యాభైమైళ్ళ దూరం. నిర్విరామంగా ప్రయాణిస్తూ ఉండడంతో చాలా అలసిపోయి ఉన్నాడు ఆర్టబాన్. ‘వాస్దా’ మరింత డస్సిపోయి ఉంది. ‘నా కోసం కాకపోయినా, ‘దీని’ కోసమైనా ఈ రాత్రికి ఇక్కడ బసచేసి, రేపు సూర్యోదయానికి ముందే ప్రయాణం ప్రారంభిస్తే, సాయంకాలానికి గమ్యం చేరుకోవచ్చు. రాత్రికి అక్కడ విశ్రమించి, మిత్రులతో కలిసి మర్నాటికి ‘పాలస్తీనా’కు బయల్దేరవచ్చు’ అన్న ఆలోచనైతే కలిగిందిగాని, దాన్ని మొగ్గలోనే తుంచి పారేశాడు. కొద్ది సమయం మాత్రం అక్కడ విశ్రమించి, తిరిగి ప్రయాణం కొనసాగించాడు. ∙∙ మంచులా చల్లబడిన వాతావరణం వజవజ వణికిస్తోంది. చీకటికి అలవాటుపడిన ఆర్టబాన్ కళ్ళకు చుక్కల వెలుగులో మార్గం అస్పష్టంగా గోచరిస్తోంది. కాస్తంత విశ్రాంతి లభించడంతో ‘వాస్దా’ ఉత్సాహంగా దౌడు తీస్తోంది. తల పైకెత్తి, మిణుకు మిణుకుమంటూ ప్రకాశిస్తున్న నక్షత్రాలను పరిశీలనగా చూసి, సమయం అర్ధరాత్రి కావచ్చినదని గ్రహించాడు ఆర్టబాన్. ప్రత్యూష సమయానికి ‘సప్తగ్రహ మందిరానికి’ చేరుకోవచ్చన్న సంతృప్తితో నిశ్చింతగా నిట్టూర్చాడు. మరో మూడు మైళ్ళ దూరం సాగింది ప్రయాణం. అంతవరకూ ఎంతో హుషారుగా పరుగు తీస్తున్న ‘వాస్దా’ వేగాన్ని ఒక్కసారిగా తగ్గించివేసింది. ఏదో క్రూరమృగం వాసన పసిగట్టిన దానిలా ఆచితూచి అడుగులు వేయసాగింది. పదినిమిషాలపాటు అలా నెమ్మదిగా ప్రయాణించి, మరిక ముందుకు పోకుండా నిశ్చలంగా నిలబడిపోయింది. అసహనంగా ముందరి కాళ్ళతో నేలను గట్టిగా తట్టసాగింది. జరుగుతున్న అలజడికి తన ఆలోచనల్లోనుంచి బయట పడ్డాడు ఆర్టబాన్. ఒరలోనున్న ఖడ్గంపై చెయ్యివేసి, కలవరపడుతున్న ‘వాస్దా’ కంఠాన్ని మృదువుగా నిమురుతూ, కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. బాటకు అడ్డంగా, బోర్లా పడి ఉన్న మనిషి ఆకారం కంటబడిందా మసక వెలుతురులో. గుర్రం పైనుండి దిగి, అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తి వేపు అడుగులువేశాడు జాగ్రత్తగా. చలనం లేకుండా పడిన్నాడా వ్యక్తి. మెడమీద చెయ్యివేశాడు. వేడిగానే తగిలింది. నాడీ పరీక్షించాడు. బలహీనంగా కొట్టుకుంటోంది. ఆ ఋతువులో సర్వసాధారణంగా సోకే ప్రాణాంతకమైన విషజ్వరం బారిన పడ్డాడనీ, తక్షణమే వైద్యసహాయం అందని పక్షాన అతడు మరణించడం తథ్యమనీ గ్రహించాడు. తన దగ్గర ఉన్న ఔషధాలతో దానికి చికిత్స చెయ్యడం, వైద్యశాస్త్రంలో కూడా నిష్ణాతుడైన ఆర్టబాన్కు కష్టమైన పనికాదు. కాని స్వస్థత చేకూరడానికి కనీసం మూడురోజులైనా పడుతుంది. ‘ఈ అపరిచితుడికి శుశ్రూషలు చేస్తూ కూర్చుంటే పుణ్యకాలం కాస్తా గడచిపోతుంది. కొన్ని గంటల దూరంలో మాత్రమే ఉన్న బొర్సిప్పాకు సమయానికి చేరుకోవడం అసాధ్యమౌతుంది. ‘లోకరక్షకుని’ దర్శించుకోవాలన్న జీవితాశయం నెరవేరకుండాపోతుంది. నేను వెళ్ళి తీరాల్సిందే! ఇతనికి ఎలా రాసిపెట్టి ఉంటే అలా జరుగుతుంది’ అని తలపోశాడు ఆర్టబాన్. రెండడుగులు వెనక్కి వేశాడు కూడా! అంతలోనే.. ‘ఎవరొస్తారీ సమయంలో ఈ అడవిలోకి? ఎవరు సహాయం చేస్తారితనికి? ఇలాంటి సమయంలో ఇతని కర్మకి ఇతన్ని వదిలేసి వెళ్లిపోతే భగవంతుడు క్షమిస్తాడా? ‘నువ్వారోజు ఎందుకలా చేశావని అంతిమ తీర్పు సమయాన భగవంతుడు ప్రశ్నిస్తే ఏమని సమాధానం చెప్పగలడు తను?’ ఇటువంటి భావాలనేకం ముప్పిరిగొని, ఆందోళనకు గురిచేశాయి ఆర్టబాన్ను. మూడో అడుగు వెయ్యలేకపోయాడు. చిక్కగా పరచుకున్న నిశ్శబ్దంలో.. ఏం చెయ్యాలో నిర్ణయించుకోలేని సంకటస్థితిలో, ఆత్మశోధన చేసుకుంటూ నిలబడిపోయాడు. చాలాసేపు ఆలోచించిన మీదట స్పష్టమైంది.. మరణఛాయలో కొట్టుమిట్టాడుతున్న తోటిమనిషిని వదిలేసి, తన దారిన తాను పోలేడనీ, అంతటి కాఠిన్యం తనలో లేదనీ! దానితో మరో ఆలోచనకు తావివ్వకుండా వెనక్కు తిరిగి.. అచేతనంగా పడిఉన్న ఆ వ్యక్తివేపు అడుగులు వేశాడు. అపరిచితుని సేవలో మూడురోజులు గడిచిపోయాయి. అతనికి అవసరమైనంత స్వస్థతా, శక్తీ చేకూరిన తరవాత, తన వద్ద మిగిలిన ఆహారమూ, ఔషధాలూ, డబ్బుతో సహా అతని చేతిలో పెట్టి, స్నేహితులు ఇంకా తనకోసం ఇంకా వేచి ఉంటారన్న ఆశ పూర్తిగా అడుగంటిపోయినా, ‘బోర్సిప్పా’ దిశగా ప్రయాణం కొనసాగించాడు ఆర్టబాన్. కొద్ది గంటల్లోనే ‘సప్తగ్రహ మందిరాని’కి చేరుకున్నాడు. ఊహించినట్టే మిత్రత్రయం కనబడలేదక్కడ. అనుకున్నదానికన్నా ఒకరోజు అదనంగా తనకోసం వేచి చూశారనీ, కష్టమైనా వెరవక, ఒంటరిగానైనా తనను రమ్మని చెప్పారనీ, ఆలయపూజారి ద్వారా తెలుసుకొని, వెళ్లాలా? వద్దా? అన్న ఆలోచనలోనైతే పడ్డాడుగాని.. కొన్ని క్షణాలపాటు మాత్రమే! ∙∙ ఈసారి తలపెట్టిన ప్రయాణంలో అధికభాగం ప్రమాదకరమైన ఎడారి మార్గంగుండా! ఖర్చుతోనూ, సాహసంతోనూ కూడుకున్న పని. తనవద్ద ఉన్న ధనంలో చాలామట్టుకు తను కాపాడిన అపరిచితునికి దానంగా ఇచ్చేయ్యడంతో, ప్రయాణానికి సరిపడ సొమ్ము లేదు చేతిలో. ‘బోర్సిప్పాలో’ అప్పు పుట్టించడం కష్టమైన పనికాదు ఆర్తబాన్ కు. కాని ఎప్పుడు తిరిగివస్తాడో తనకే రూఢిగా తెలియని ఆర్టబాన్ అప్పుచెయ్యడానికి సుముఖంగా లేడు. కనుక.. భగవదార్పణ కొరకు కొనిపోతున్న మూడు రత్నాలలో ఒకదాన్ని విక్రయించి, వచ్చిన ధనంతో ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు చెయ్యాలన్న నిర్ణయం తీసుకోక తప్పలేదు. అగ్నిగుండంలా మండిపోతున్న ఎడారిని అధిగమించి, సిరియాదేశపు ఆహ్లాదకరమైన ఉద్యానవనాలలో సేదదీరి, పవిత్రమైన ‘హెర్మన్’ పర్వతపాదాల పక్కగా ప్రయాణించి, ‘గలలియ సముద్ర’ తీరానికి చేరుకున్నాడు ఆర్టబాన్. అక్కడి నుండి ‘యూదయ’ మీదుగా లోకరక్షకుడు అవతరించిన ‘బెథ్లెహేమ్’ గ్రామానికి శ్రమ పడకుండానే చేరుకోగలిగాడు. గొర్రెలూ, మేకల మందలతో నిండి ఉన్న ఆ గ్రామాన్ని చూసి ఆశ్చర్యానికి లోనయ్యాడు. అక్కడి ప్రజల పేదరికాన్ని గమనించి ఆవేదన చెందాడు. బసచేయడానికి అనువైన గృహం, ఏదీ కనబడకపోవడంతో దిక్కులు చూస్తూ నిలబడ్డాడు. అంతలో ఆయన వద్దకు వచ్చాడొక వృద్ధుడు. ఆ గ్రామానికి చెందిన మతగురువుగా తనను తను పరిచయం గావించుకున్నాడు. ముఖ్యమైన కార్యంపై బహుదూరం నుండి తమ గ్రామానికి విచ్చేసిన పరదేశి ఆర్టబాన్ అని తెలుసుకొని సంతోషం వ్యక్తపరిచాడు. తన గృహానికి అతిథిగా ఆహ్వానించాడు. ‘తిరస్కరించడానికి’ వీల్లేని ఆహ్వానాన్ని అంగీకరించక తప్పలేదు ‘మెడియా’ దేశపు జ్ఞానికి! అతిథేయి గృహంలో స్నానపానాదులు గావించి, విశ్రమించిన తరవాత తను ‘బెత్లెహేము’నకు వచ్చిన కారణాన్ని ఆయనకు తెలియజేశాడు ఆర్టబాన్. విన్న పెద్దాయన ఆశ్చర్యచకితుడయ్యాడు. కొద్దినెలల క్రితం రోమన్ చక్రవర్తి నిర్వహించిన జనాభా లెక్కలో నమోదు చేసుకోవడానికి ‘నజరేతు’ అని పిలవబడే గ్రామం నుండి ‘మరియ’, ‘యోసేపు’ అన్న భార్యాభర్తలు తమ గ్రామానికి వచ్చిన మాట వాస్తవమేననీ, ‘మరియ’ అప్పటికే నెలలు నిండిన గర్భవతి కావడాన మగశిశువుకు అక్కడే జన్మనిచ్చిందనీ, తరవాత కూడా కొంతకాలం వారక్కడే నివసించారనీ, కొన్ని వారాల క్రితం విలక్షణమైన వ్యక్తులు ముగ్గురు.. ‘ముమ్మూర్తులా మీలాంటివారే నాయనా’.. ఇక్కడకు వచ్చి ‘బాలుని’ దర్శించి, విలువైన కానుకలు సమర్పించారనీ చెప్తూ.. ‘వచ్చిన ముగ్గురూ ఎంత ఆకస్మికంగా వచ్చారో అంతే ఆకస్మికంగా నిష్క్రమించారు! వారు వెళ్ళిపోయిన రెండుమూడు రోజుల్లోనే, భార్యాభర్తలిద్దరూ కూడా తమ బిడ్డను తీసుకొని గ్రామం వదిలి వెళ్ళిపోయారు. వెళ్లిపోవడానికి కారణమైతే తెలియలేదుగాని, ‘ఐగుప్తు’కు వెళ్లిపోయారన్న పుకారు మాత్రం వినిపిస్తోంది’ అని తెలియజేశాడు! ఆయన మాటలు విన్న ఆర్టబాన్ నెత్తిన పిడుగుపడినట్టైంది. నెలల తరబడి పడిన శ్రమ మొత్తం బూడిదలో పోసిన పన్నీరైనందుకు హృదయం బాధతో విలవిలలాడింది. చేష్టలుడిగి మౌనంగా కూర్చుండిపోయాడు చాలాసేపు! ఇంతలో, అకస్మాత్తుగా ఇంటి బయట గొప్ప గందరగోళం చెలరేగింది. పురుషుల పెడబొబ్బలూ, ‘చిన్నపిల్లలను చంపేస్తున్నారు.. కాపాడండి’ అంటూ స్త్రీలు చేస్తున్న ఆర్తనాదాలూ, చిన్నపిల్లల అరుపులూ ఏడుపులూ, ఒక్కసారిగా మిన్నుముట్టాయి. ఆలోచనల్లో నుండి బయటపడ్డాడు ఆర్టబాన్. కలవరపాటుతో చుట్టూ చూశాడు. ఒక్కగానొక్క మనవడిని గుండెకు హత్తుకొని, వణుకుతూ ఒకమూల నిలబడిన వృద్ధుడూ, అతని కుటుంబసభ్యులూ కనిపించారు. తన తక్షణకర్తవ్యం తేటతెల్లమైంది ఆర్టబాన్కు. ఒక్క అంగలో ముఖద్వారాన్ని సమీపించాడు. ఉన్మాదుల్లా అరుస్తూ లోపలికి దూసుకువస్తున్న సైనికులు లోపలికి ప్రవేశించకుండా అడ్డుగా నిలబడి, వారి నాయకునివేపు తిరస్కారంగా చూస్తూ ‘మీరు చంపాలని వెదుకుతున్న చిన్నపిల్లలెవరూ లేరీ ఇంటిలో. ఇదిగో, ఇది తీసుకొని, మీ దారిన మీరు వెళ్ళండి. మళ్ళీ ఇటువేపు కన్నెత్తి చూడకండి’ అని ఆదేశిస్తూ, తనవద్ద మిగిలిన రెండు మణుల్లో ఒకటి వాడికి ధారాదత్తం గావించాడు. వాడి కరవాలానికి ఎరకావలసిన పసివాడి ప్రాణం కాపాడాడు! తనను అక్కున చేర్చుకొని, ఆశ్రయమిచ్చిన అన్నదాత కుటుంబాన్ని ఆదుకున్నాడు! మరో వారం రోజులు అక్కడే విశ్రమించి, ఆ తరవాత ‘ఐగుప్తు’ దిశగా పయనమైపోయాడు.. తన అన్వేషణ కొనసాగిస్తూ! ∙∙ ఐగుప్తుదేశపు నలుమూలలా గాలించాడు ఆర్టబాన్. ‘అలగ్జాండ్రియా’ నగరంలో ప్రతీ అంగుళాన్నీ వదలకుండా వెతికాడు. రాజమహళ్ళనూ, భవంతులనూ విస్మరించి, పేదప్రజలు నివసించే ప్రాంతాలను జల్లెడపట్టాడు. ఐగుప్తులో మాత్రమేకాక, దాని చుట్టుపక్కల గల దేశాలన్నింటిలోనూ గాలించాడు. కాని, బెత్లెహేము నుండి వలస వచ్చిన ఒక సాధారణ యూదుకుటుంబపు జాడ కనుగొనడంలో విఫలమయ్యాడు. అదే సమయంలో అక్కడి ప్రజల కష్టాలూ, కన్నీళ్లూ, బాధలూ వేదనలూ ప్రత్యక్షంగా చూశాడు. చలించిపోయాడు. వారి ఆకలి కేకలు విన్నాడు. తట్టుకోలేక పోయాడు. సరైన వైద్యం అందక, రోగులు రాలిపోవడం చూశాడు. భరించలేకపోయాడు. తనకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాడు. అన్నార్తుల ఆకలి తీర్చాడు.. బట్టల్లేని అభాగ్యులనేకమందికి వస్త్రాలిచ్చి ఆదుకున్నాడు. రోగులను అక్కున చేర్చుకొని, ఆదరించాడు. మరణశయ్యపైనున్నవారికి ఓదార్పు మాటలు చెప్పి, సాంత్వన చేకూర్చాడు. వీటికి కావలసిన ధనం కొరకు తన వద్ద మిగిలి ఉన్న ఒక్క మణినీ ఎటువంటి క్లేశమూ, ఖేదమూ లేకుండా విక్రయించేశాడు. ∙∙ రోజులు వారాలై, వారాలు నెలలై, నెలలు సంవత్సరాలుగా మారి.. మూడు దశాబ్దాల పైన మూడేళ్ళ కాలం చూస్తుండగానే గడిచిపోయింది. వృద్ధుడైపోయాడు ఆర్టబాన్. దరిద్రనారాయణుల సేవలో అలసిపోయాడు. మృత్యువుకు చేరువౌతున్నాడు. అప్పటికీ ఆయన అన్వేషణ మాత్రం అంతం కాలేదు. ఇహలోకంలో తన ప్రయాణం ముగిసేలోగా.. మృత్యువు తనను కబళించేలోగా తన అన్వేషణకు ముగింపు పలకాలనుకున్నాడు. ఒక్కటంటే ఒక్క ప్రయత్నం చిట్టచివరిగా చెయ్యాలనుకున్నాడు. జాగు చేయకుండా, యెరుషలేము నగరానికి ప్రయాణమైపోయాడు. ఆర్టబాన్ యెరుషలేము చేరుకునే సమయానికి పట్టణమంతా అల్లకల్లోలంగా ఉంది. ముఖ్యకూడళ్ళ వద్ద ప్రజలు వందల సంఖ్యలో గుమిగూడి ఉన్నారు. ఆయుధాలు ధరించిన సైనికులనేకమంది, అప్రమత్తులై మోహరించి ఉన్నారక్కడ ఎటుచూసినా. ∙∙ అక్కడేం జరుగుతోందో అర్థం కాలేదాయనకు. అడిగి తెలుసుకుందామంటే సమాధానమిచ్చే నాథుడెవడూ కనబడలేదు. ఒక కూడలిలో, కాస్త సౌకర్యంగా ఉన్నచోట చతికిలబడి, జరుగుతున్న తతంగాన్ని వీక్షించసాగాడు అనాసక్తంగా. ఇంతలో అనూహ్యంగా తన మాతృభాష ఆయన చెవినబడడంతో ప్రాణం లేచొచ్చినట్టైంది ఆర్టబాన్కు. అది వినబడిన దిశగా అడుగులు వేశాడు. ఏం జరుగుతోందిక్కడ అని ప్రశ్నించాడక్కడ ఉన్నవారిని. ‘ఘోరం జరగబోతోంది. ఇద్దరు గజదొంగల్ని ‘గోల్గొతా’ గుట్ట మీద శిలువ వెయ్యబోతున్నారు’ అని చెప్పారు వారు. ‘గజదొంగల్ని చంపడం ఘోరమా?’ ఆశ్చర్యపోయాడు ఆర్టబాన్. ‘కాదుకాదు.. వారితో పాటు, ఒక దైవాంశసంభూతుడ్ని కూడా శిలువ వెయ్యబోతున్నారు. ఆయన ఎంత మహిమాన్వితుడంటే, చనిపోయి మూడురోజులు సమాధిలో ఉన్నవాడిని బతికించేడట! అయిదారు రొట్టెలతోనూ, రెండుమూడు చేపలతోనూ వేలమందికి బోజనం పెట్టేడట! ఏదో పెళ్ళిలో తాగడానికి ద్రాక్షరసం లేదని అతిథులు గోల చేస్తుంటే క్షణాల్లో నీటిని ద్రాక్షరసంగా మార్చేడట! ఆయన ముట్టుకుంటే చాలు.. ఎలాంటి రోగమైనా నయమైపోవలసిందేనట. ఆయన కన్నెర్రజేస్తే దెయ్యాలూ భూతాలూ కంటికి కనబడకుండా మాయమైపోతాయట. అలాంటి మహానుభావుడ్ని కూడా శిలువ వేసేస్తున్నారీ దుర్మార్గులు. అది ఘోరం కాదూ?’ ‘ఈ రోమనులింతే. పరమదుర్మార్గులు. వాళ్ళు చేసిన అకృత్యాలు ఎన్ని చూశానో ఈ కళ్ళతో!’ ‘ఆయనని సిలువ వేయమన్నది ‘పిలాతు’ కాదయ్యా పెద్దాయనా.. ఎవరో ‘అన్నా’, ‘కయప’లట. యూదుమత పెద్దలట. ఆయనను శిలువ వేస్తేగాని కుదరదని కూర్చున్నారట. విసిగిపోయిన పిలాతు ‘‘ఈ గొడవతో నాకేమీ సంబంధం లేదు, మీ చావేదో మీరు చావండి’’ అని చెప్పి, చేతులు కడిగేసుకున్నాడట.’ ‘ఎందుకు బాబూ ఆయనంటే అంత కోపం వారికి?’ ‘ఎందుకంటే దేవుని ఆలయాన్ని చూపించి.. దీన్ని పడగొట్టి మూడురోజుల్లో తిరిగి కడతానన్నాడట! నేను దేవుని కుమారుడ్ని అనికూడా ఎక్కడో ఎవరితోనో చెప్పేడట! అదట ఆయన చేసిన నేరం.’ ‘అయ్యో.. ఇంతకీ ఆ మహానుభావుడి పేరు..?’ ‘యేసు.. యేసు క్రీస్తు.. ‘నజరేతు’ అనీ, ఆ గ్రామానికి చెందినవాడట. అందుకే నజరేయుడైన యేసు అంటారట తాతా ఆయన్ని!’ ∙∙ సమయం మధ్యాహ్నం మూడు గంటలు కావస్తోంది. ఎందుకోగాని, మిట్టమధ్యాహ్నానికే దట్టమైన చీకటి అలుముకుంది ఆ ప్రాంతమంతా. ఆ చీకటిలో, పడుతూ లేస్తూ.. గోల్గోతా గుట్టవేపు నెమ్మదిగా అడుగులు వేస్తున్నాడు ఆర్టబాన్. దూరాన్నుండి వినిపిస్తున్న రణగొణధ్వనులను బట్టి ‘గోల్గోతా’ ఎంతో దూరంలో లేదని గ్రహించాడు. శక్తినంతా కూడదీసుకొని నడవసాగాడు. ఇంతలో ఒక్కసారిగా భూమి కంపించడంతో, నిలదొక్కుకోలేక నేలపై పడిపోయాడు. తలకు బలమైన గాయం తగలడంతో, సొమ్మసిల్లిపోయాడు. ∙∙ స్పృహ కోల్పోయిన ఆర్టబాన్ మనోనేత్రం ముందు ప్రకాశమానమైన వెలుగు ప్రత్యక్షమైంది. ఆ వెలుగులో.. కోటిసూర్యుల తేజస్సుతో వెలిగిపోతున్న దేవతామూర్తి దర్శనమిచ్చాడు. రెండు చేతులూ చాచి, తన కౌగిలిలోకి రమ్మని ఆహ్వానించాడు ఆర్టబాన్ను. ‘ఎవరు స్వామీ తమరు?’ ప్రశ్నించాడు ఆర్టబాన్ వినయంగా. ‘గుర్తించలేదూ నన్ను? నీవు వెదుకుతున్న యేసును నేనే. రా నిన్ను ఆలింగనం చేసుకోనీ’ ఆనందసాగరంలో ఓలలాడుతూ, దేవకుమారుని కౌగిలిలోనికి పరుగు పెట్టలేదు సరికదా ‘ఎంత వెదికేను దేవా నీ కోసం? ఎన్నాళ్ల అన్వేషణ స్వామీ నాది? ఒక్కసారైనా కనిపించాలని అనిపించలేదూ నీకు? అంత పాపినా నేను?’ ఆక్రోశించాడు ఆర్టబాన్. ‘నేను కనిపించలేదంటావేంటి! ఆకలితో అలమటిస్తున్న నాకు ఎన్నిసార్లు కడుపు నింపలేదు నువ్వు? నీ శరీరం మీద వస్త్రాలు తీసి నాకు కప్పిన సందర్భాలు మరచిపోయావా? రోగంతో బాధపడుతున్న నాకు నిద్రాహారాలు మానేసి మరీ సేవలు చేశావుకదా.. అవన్నీ మరచిపోయి, కనిపించలేదని నన్ను నిందించడం న్యాయమా చెప్పు?’ ‘సాక్షాత్తూ దేవకుమారుడివి.. నీకు నేను నీకు సేవలు చెయ్యడమేంటి ప్రభూ? నీ భక్తుడ్ని ఇలా అపహసించడం ధర్మమేనా నీకు?’ ‘అపహసించడం కానేకాదు ఆర్టబాన్. సత్యమే చెప్తున్నాను. అది సరేగాని, నాకు కానుకగా ఇవ్వాలని మూడు విలువైన రత్నాలు తీసుకొని బయలుదేరావు కదా, అవేవీ? ఒకసారి చూడనీ..’ ‘లేవు దేవా, ఏనాడో వ్యయమైపోయాయవి.’ ‘ఖర్చైపోయాయా, దేనికి ఖర్చుచేశావో ఆ సంగతి చెప్పవయ్యా?’ ‘పేదలకొరకూ, దిక్కులేని వారి కొరకూ ఖర్చుచేశాను ప్రభూ..’ ‘దీనులకూ, దరిద్రులకూ చేసిన సహాయం ఏదైనా నాకు చేసినట్టేనని తెలీదూ? ఇప్పటికైనా గ్రహించావా నీకెన్నిసార్లు దర్శనమిచ్చానో!’ అప్పటికి గాని, ప్రభువు మాటల్లో మర్మం బోధపడలేదు నాల్గవజ్ఞానికి. ఆర్థమైన మరుక్షణం ఆయన అంతరంగం అలౌకికమైన ఆనందంతో నిండిపోయింది. దివ్యమైన వెలుగును సంతరించుకున్న ఆయన వదనం వింతగా ప్రకాశించింది. తన ముందు సాక్షాత్కరించిన భగవత్స్వరూపాన్ని తన్మయత్వంతో తిలకిస్తున్న ఆయన మనోనేత్రం.. శాశ్వతంగా మూతబడింది. ఆత్మ పరమాత్మలో ఐక్యమైంది. ("The Fourth Wiseman"గా ప్రఖ్యాతిగాంచిన ‘ఆర్టబాన్’ ప్రస్తావన బైబిల్లోనైతే లేదుగాని, శతాబ్దాలుగా క్రైస్తవలోకంలో బహుళప్రచారంలోనున్న ఇతిహాసమే!) — కృపాకర్ పోతుల -
'ఋతధ్వజుడు మదాలసల గాథ'
ఋతధ్వజుడి తండ్రి శత్రుజిత్తు మహారాజు. ఒకనాడు శత్రుజిత్తు కొలువుదీరి ఉండగా, గాలవుడు అనే బ్రాహ్మణుడు ఒక అశ్వాన్ని తీసుకుని వచ్చాడు. ‘‘మహారాజా! ఒక రాక్షసుడు నా ఆశ్రమాన్ని నాశనం చేస్తున్నాడు. మాయావి అయిన ఆ రాక్షసుడు ఏనుగు, సింహం వంటి జంతువుల రూపాలు ధరించి, అడవినంతా అల్లకల్లోలం చేస్తున్నాడు. వాడిని శపించడానికి నా శక్తి చాలదు. ఒకవేళ శపించినా, నా తపస్సంతా వ్యర్థమైపోతుంది. వాడిని ఏమీ చేయలేకపోతున్నానే అనే నిస్సహాయతతో ఆకాశంవైపు చూసి నిట్టూర్చాను. అప్పుడు ఆకాశం నుంచి ఈ దివ్యాశ్వం భూమి మీదకు వచ్చింది. అదే సమయంలో అశరీరవాణి ఇలా పలికింది: ‘ఈ దివ్యాశ్వం భూమి మీదనే కాదు, ఆకాశ మార్గంలోను, పాతాళంలోనూ సంచరించగలడు. గిరులను, సాగరాలను అధిగమించగలదు. సమస్త భూమండలాన్నీ శరవేగంగా చుట్టేయగలదు. అందువల్ల దీనిపేరు కువలయం. శత్రుజిత్తు మహారాజు కొడుకు ఋతధ్వజుడు దీనిని అధిరోహించి, నీ తపస్సుకు ఆటంకం కలిగిస్తున్న అసురాధముణ్ణి సంహరించగలదు’ అని చెప్పింది’ అని పలికాడు. గాలవుడి మాటలు విన్న శత్రుజిత్తు తన కుమారుడు ఋతధ్వజుణ్ణి పిలిచి, ఆ అశ్వాన్ని అప్పగించి, గాలవుడి ఆశ్రమానికి రక్షణగా పంపాడు. ఋతధ్వజుడు గాలవుడి ఆశ్రమానికి వెళ్లి, ఆశ్రమవాసులందరికీ రక్షణగా ఉండసాగాడు. ఋతధ్వజుడు అక్కడ ఉన్నాడన్న సంగతి తెలియని రాక్షసుడు యథాప్రకారం అడవిపంది రూపం ధరించి వచ్చి, నానా బీభత్సం మొదలుపెట్టాడు. ఆశ్రమంలోని గాలవుడి శిష్యులు హాహాకారాలు చేస్తూ పరుగులు తీయసాగారు. ఋతధ్వజుడు వారి ఆర్తనాదాలు విని, కువలయాశ్వాన్ని అధిరోహించి, ఆగడం సాగిస్తున్న అడవిపంది వెంట పడ్డాడు. దాని మీదకు పదునైన బాణాలను సంధించి వదిలాడు. బాణాల దెబ్బలు తాళలేక అడవిపంది రూపంలో వచ్చిన రాక్షసుడు అడవిలోకి పరుగు తీశాడు. రాక్షసుడి అంతు చూద్దామనే పట్టుదలతో ఋతధ్వజుడు వెంటాడసాగాడు. అడవి నలువైపులా పరుగులు తీసి అలసిపోయిన రాక్షసుడు ఒక పెద్ద గోతిలోకి దూకి మాయమయ్యాడు. ఋతధ్వజుడు కూడా తన కువలయాశ్వంతో పాటు ఆ గోతిలోకి దూకాడు. ఆ గోతిలోంచి అతడు పాతాళలోకానికి చేరుకున్నాడు. పాతాళలోకం దేదీప్యమానంగా వెలిగి పోతోంది. ఎటు చూసినా బంగారు ప్రాకారాల ధగధగలు కనిపించాయి. ఇంద్రలోకంలాంటి పట్టణం కనిపించింది. ఋతధ్వజుడు ఆ పట్టణంలోకి వెళ్లాడు. వీథుల్లో ఎవరూ కనిపించలేదు. కాసేపటికి ఒక యువతి హడావుడిగా వెళుతూ కనిపించింది. ‘ఎవరు నువ్వు? ఎక్కడకు పోతున్నావు?’ అని ప్రశ్నించాడు. ఆమె బదులివ్వకుండా దగ్గర్లోనే ఉన్న ఒక మేడ మీదకు వెళ్లింది. ఋతధ్వజుడు ఆమెనే అనుసరిస్తూ మేడ మీదకు వెళ్లాడు. మేడపైన గదిలో ఒక సౌందర్యరాశి కనిపించింది. అపరిచితుడైన రాకుమారుడు అకస్మాత్తుగా తన గదిలోకి వచ్చేసరికి ఆమె చకితురాలైంది. వెంటనే మూర్ఛపోయింది. ఋతధ్వజుడు వెంటనే ఆమె దగ్గరకు చేరుకుని, భయపడవద్దంటూ సముదాయించాడు. ఇంతలోనే ఆమె చెలికత్తె వచ్చి ఆ సౌందర్యరాశికి పరిచర్యలు చేయసాగింది. ‘ఆమె ఎందుకిలా మూర్ఛపోయింది’ అని చెలికత్తెను ప్రశ్నించాడు ఋతధ్వజుడు. ‘ఈమె గంధర్వరాజు విశ్వావసుడి కుమార్తె మదాలస. నేను ఈమె చెలికత్తెను. నా పేరు కుండల. మదాలస వనంలో ఆటలాడుకుంటుండగా, పాతాళకేతువు అనే రాక్షసుడు ఆమెను అపహరించుకు వచ్చాడు. వచ్చే త్రయోదశినాడు ఈమెను వివాహం చేసుకోబోతున్నాడు. అధముడైన రాక్షసుణ్ణి పెళ్లిచేసుకోవడం ఇష్టంలేక ఈమె నిన్ననే ఆత్మహత్యకు ప్రయత్నించింది. అప్పుడు ఒక గోమాత వచ్చి, భూలోకం నుంచి ఒక రాకుమారుడు వస్తాడని, రాక్షసుడిని చంపి మదాలసను వివాహమాడతాడని చెప్పింది. మిమ్మల్ని చూసిన మోహావేశంలో మా రాకుమారి మూర్ఛపోయింది. మీరు దైవాంశ సంభూతుల్లా ఉన్నారు. మామూలు మానవులు ఇక్కడ అడుగుపెట్టలేరు. మీ వృత్తాంతం చెప్పండి’ అంది కుండల. ఋతధ్వజుడు తనను తాను పరిచయం చేసుకుని, ఏ పరిస్థితుల్లో అక్కడకు వచ్చాడో వివరించాడు. ఇంతలో మూర్ఛనుంచి తేరుకున్న మదాలస తన ఎదుట ఉన్న రాకుమారుణ్ణి చూసి సిగ్గుపడింది. ‘రాకుమారా! ఈమె మీ మీద మనసుపడింది. గోమాత చెప్పిన రాకుమారుడు మీరే! గోవు అసత్యం చెప్పదు. అందువల్ల మీరు ఈమెను వివాహం చేసుకోండి’ అని కోరింది కుండల. ‘ఈమెను వివాహమాడటం నాకూ ఇష్టమే గాని, తండ్రి అనుమతి లేకుండా ఇప్పటికిప్పుడు ఎలా వివాహం చేసుకోగలను?’ అన్నాడు ఋతధ్వజుడు. ‘రాకుమారా! ఈమె దేవకన్య. ఇది ముందే జరిగిన దైవనిర్ణయం. మీరు అభ్యంతరం చెప్పకుండా ఈమెను వివాహం చేసుకోండి’ అంది కుండల. ‘సరే’నన్నాడు ఋతధ్వజుడు. కుండల వెంటనే తమ కులగురువైన తుంబురుణ్ణి స్మరించింది. తుంబురుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అక్కడికక్కడే అగ్నిహోత్రాన్ని వెలిగించి, మదాలసతో ఋతధ్వజుడికి శాస్త్రోక్తంగా వివాహం జరిపించి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కుండల కూడా సెలవు తీసుకుని, గంధర్వలోకానికి వెళ్లిపోయింది. ఋతధ్వజుడు మదాలసను తీసుకుని, అక్కడి నుంచి బయలుదేరడానికి కువలయాశ్వాన్ని అధిరోహించాడు. మదాలసతో అతడు అశ్వంపై వెళుతుండగా గమనించిన రాక్షసులు అతడి మీద దాడి చేశారు. వరుసగా ఆయుధాలను రువ్వారు. ఋతధ్వజుడు వారందరినీ ఎదుర్కొన్నాడు. తన బాణాలతో వారి ఆయుధాలను తుత్తునియలు చేశాడు. రాక్షసుల ద్వారా సంగతి తెలుసుకున్న పాతాళకేతువు స్వయంగా రంగప్రవేశం చేశాడు. ఋతధ్వజుడిపై అస్త్రాలను సంధించాడు. ఋతధ్వజుడు అతడి అస్త్రాలన్నింటినీ తన దివ్యాస్త్రాలతో నిర్వీర్యం చేశాడు. చివరగా త్వాష్ట్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం పాతాళకేతువు సహా రాక్షసులందరినీ మట్టుబెట్టింది. ఋతధ్వజుడు మదాలసతో కలసి క్షేమంగా తన రాజ్యానికి చేరుకున్నాడు. తండ్రికి జరిగినదంతా చెప్పాడు. శత్రుజిత్తు కుమారుణ్ణి ఆనందంగా ఆలింగనం చేసుకున్నాడు. కోడలిని చూసి అభినందించాడు. — సాంఖ్యాయన ఇవి చదవండి: వద్దమ్మా.. తప్పూ! -
ఈవారం కథ: 'తరలి వచ్చిన వసంతం'!
ఆమె నన్ను ఎప్పటికీ క్షమించదు : రమాకాంత్ సెప్టెంబర్ 3.. 2023 సంవత్సరం.. సాయంత్రం నాలుగు గంటలు. ఆసుపత్రి నుంచి డిశ్చారై్జ నేటికి మూడోరోజు. రియల్లీ సర్ప్రైయిజింగ్. భూమ్మీద నాకింకా నూకలున్నందుకు ఆనందించాలో.. విచారించాలో తెలియడం లేదు. నాలో ఇప్పుడు ఎలాంటి ఆశలు గానీ అసంతృప్తులు గానీ లేవు. డాక్టర్ నోటి వెంట వచ్చిన ఆ మూడుముక్కలు నా చెవిన పడ్డాక మనసు తేలికైంది. ఇక ఏ గొడవా లేదు. రోజులు లెక్కపెట్టుకుంటూ కాలం గడిపేయాల్సిందే. చివరిరోజుల్లో మనిషికి.. తనకు బాగా దగ్గరైన మిత్రులు గానీ, శత్రువులు గానీ గుర్తొస్తుంటారట. అందుకనేమో నాలో ఇప్పుడీ ఆలోచనలు.. ఏభైఆరేళ్ల నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు. వందల చిత్రాల్లో విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా బహుభాషా చిత్రాల్లో నటించాను. అవార్డులెన్నో గెలుచుకున్నాను. పేరు, గౌరవం, డబ్బు, సెలబ్రిటీ స్టేటస్.. ఇవేవీ నాకు తెలియనివి కావు. వేషాల కోసం ప్రొడక్షన్ హౌస్ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాను. వెన్ను తట్టి ప్రోత్సహించిన వాళ్లకంటే తిరస్కరించిన వాళ్ళే ఎక్కువ. తర్వాత వాళ్ళే నా డేట్స్ కోసం నా ఇంటిచుట్టూ తిరగడం నేనెరుగుదును. దానికి నేనేం గర్వంగా ఫీలవ్వను. ఎందుకంటే ఎవరి టైమ్ ఎప్పుడొస్తుందో చెప్పలేం గదా! కానీ ప్రతినాయక పాత్రల్లో ఆదరించి నన్నో స్టార్ని చేసిన ప్రేక్షకుల అభిమానాన్ని మాత్రం ఎప్పటికీ మరచిపోను. అందుచేత కృతజ్ఞతలు చెప్పాల్సివస్తే అది మొదట ప్రేక్షకులకే. తర్వాత సినీ రంగానికి! పరిశ్రమలోని ఎందరో ప్రముఖులు.. వారితో గల స్నేహాలూ, నైట్ పార్టీలూ నాకో కొత్త ఫిలాసఫీని పరిచయం చేశాయి. చివరకు అదే నా జీవితాన్ని తల్లకిందులు చేసింది. లోపలకు ఎవరో వచ్చినట్టున్నారు.. మంచంపై నిస్తేజంగా పడున్న నేను కళ్ళు తెరచి చూశాను. నా భార్య లత..ఆమెతో పాటు ఎవరో ఇద్దరు పరిచయస్తులు. నా అచేతనావస్థను చూసి సన్నగా వాళ్లలో గుసగుసలు.. ‘ఎలా ఉండేవాడు ఎలా అయిపోయాడు? ప్చ్.. అంతా అతని కర్మ!’ ‘అతని కర్మ కాదు.. ఆమె చేసిన కర్మ!’ ‘ష్.. అవన్నీ ఇప్పుడెందుకులే..’ మాటలు ఆగిపోయాయి. లతకు ధైర్యం చెప్పి వాళ్ళ మానాన వాళ్ళు వెళ్లిపోయారు. వారి సంభాషణలో దొర్లిన ‘ఆమె’ మాత్రం ఈమె కాదు. ఆమె ఒకప్పటి నా కలల ప్రపంచం. నా జీవన మాధుర్యం. పాతికేళ్ళనాటి ఆమె జ్ఞాపకాలు ఒక్కటొక్కటిగా నాలో.. తన తమిళ చిత్రంలోని హీరోయిన్ పాత్ర కోసం నాట్యం తెలిసిన అమ్మాయి గురించి నా దర్శక మిత్రుడొకడు అన్వేషిస్తున్న కాలమది. అంతకు మునుపు రవీంద్రభారతిలో నాట్య ప్రదర్శనతో అమితంగా ఆకట్టుకున్న ఓ అమ్మాయి చప్పున గుర్తొచ్చింది. ఆమె పేరు మధురిమ. ఆమె వివరాలను కనుక్కొని అతనికి పంపించాను. ఆమె హీరోయిన్గా సెలెక్టయ్యి నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఆ కృతజ్ఞతాభావంతో ఓ రోజు ట్రీట్ ఇస్తానని రెస్టారెంట్కు ఆహ్వానించడంతో వెళ్లాను. ఒకే టేబుల్పై ఎదురెదురుగా కూర్చొని దగ్గరగా అలా చూడటం అదే తొలిసారి. విరిసిన మందారంలా.. స్వచ్ఛంగా.. ముగ్ధమనోహరంగా ఉందామె. ‘చెప్పండి.. ఏం తీసుకుంటారు?’ తేనెలొలుకుతున్నట్టు మధురంగా వినిపించిందామె గొంతు. ‘ఏదైనా చెప్పండి.. నో ప్రాబ్లెమ్’ అన్నాను. ‘ఐతే.. నాకిష్టమైనవన్నీ చెప్పేస్తా. ఫర్వాలేదా?’ అంది. సమ్మోహనమైన ఆమె నవ్వు నాలోని సీరియస్నెస్ను బద్దలు కొట్టింది. నవ్వాను తొలిసారి మనసు నిండుగా. ఆర్డర్ చేసినవి వచ్చాయి. తింటున్నంతసేపూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉందామె. సొట్టబుగ్గల నడుమ ఆమె నవ్వు ముత్యాలహారంలా తళుక్కుమంటోంది. కలువకళ్ళ ఆమె ఓరచూపు ఆయస్కాంతంలా ఆకర్షిస్తూనే ఉంది. ఆమెతో గడిపిన ప్రతీక్షణం.. అద్భుత ఊహాలోకంలో హాయిగా విహరిస్తోన్న ఆనందపరవశం. ప్రేమిస్తున్నానని చెప్పేశాను ఒకరోజు ఆమోదించిందామె. ప్రపంచానికి చక్రవర్తినైనంత సంబరం నాలో! ఫోన్ కబుర్లూ.. షికార్లూ.. లాంగ్డ్రైవ్ల ద్వారా ఒకరి సాన్నిహిత్యాన్ని ఒకరం ఇష్టపడేవాళ్ళం. అప్పటికే పరిశ్రమలో మాపై రకరకాల కథనాలు ఇద్దరి ఇళ్ల వరకూ పాకాయి. అభ్యంతరాలేవి ఎటువైపు నుంచీ లేవు. కానీ ఆమెకు నామీద ఒకే ఒక్క విషయంపై అభ్యంతరమో.. ఆగ్రహమోగానీ తీవ్రంగా ఉండేది. ఎన్నోసార్లు దాన్ని బహిరంగంగా ప్రదర్శించింది. నన్ను మార్చాలని చూసింది. సున్నితంగా హెచ్చరించింది. మగాణ్ణి కదా.. అహం. గ్రహించలేకపోయాను. ఆ రోజు కార్తీక పౌర్ణమి. తన పుట్టిన రోజు. టెర్రస్ నుంచి విశాఖసాగర తీరం ఉరకలేస్తూ కనిపించసాగింది. పండు వెన్నెల వెలుగుల్లో ఇసుక తిన్నెలు బంగారు వర్ణంతో మెరుస్తున్నాయి. వీటన్నిటి సమక్షంలో తన పుట్టినరోజు వేడుక ఒక మధుర స్మృతిలా జరుపుకోవాలనేది మధు చిరకాల కోరిక. అది నెరవేరేసరికి రాత్రి తొమ్మిదయ్యింది. టేబుల్పై డిన్నర్ ఐటమ్స్ వున్నాయి. ‘మధూ.. ఇక భోంచేద్దామా’ అదుపు తప్పి తడబడిన మాటకు నా వైపు దూరం నుంచి సీరియస్గా చూసిందామె. ‘ఆకలిగా లేదు. నువ్వు భోంచెయ్’ అయిష్టంగానే అంది. ‘ఏం..ఎందుకని?’ ‘తినాలని లేదు’ ముఖంలోని గాంభీర్యం గొంతులో చేరి కఠినంగా వినిపించింది. ‘పోనీ.. నేను తినిపించనా?’ ‘ఎందుకు? నీ నోటి నుంచి వచ్చే వాసన భరించి తినడం కన్నా ఖాళీ కడుపుతో పడుకోవడం బెటర్.’ విసిరిన ఈటెలా వచ్చిపడిన ఆమె సమాధానానికి మత్తు దిగిపోయింది. కిందకు వెళ్లి సాయంత్రం నేను చేసిన ఘనకార్యమేమిటో గుర్తొచ్చింది. ‘సారీ మధు..’ అన్నాను. ‘మందు మానేస్తానని చేసిన ప్రామిస్ చేసిన సంగతి గుర్తుందా?’ ఆవేశంగా అంది. ‘ఉంది..కానీ ఈరోజు నీ పుట్టిన రోజు కదా అని..’ నసిగాను. ‘నీకెన్నిసార్లు చెప్పాలి.. డ్రంకర్డ్స్ అంటే నాకసహ్యమని! ఐనా నువ్వు మారడంలేదు. మారతావనే నమ్మకం కూడా లేదు. నీలాంటివాణ్ణి ప్రేమించినందుకు సిగ్గు పడుతున్నా.’ కళ్ళల్లో చేరిన సన్నటి కన్నీటిపొరను మునివేళ్ళతో తుడుచుకుంటూ అంది. ‘మధూ.. ఈ ఒక్కసారికి నమ్ము.. ప్లీజ్’ చిన్న పిల్లాడిలా అభ్యర్థించాను. ‘లేదు రమా.. ఈ రోజునుంచి మందు మానేస్తానని ఇదే లాస్ట్ ప్రామిస్ అని చెప్పి మరీ ఈ పని చేశావంటే నిన్నెలా నమ్మేది? ఇదిగో.. నువ్విచ్చిన గొలుసు. నాకవసరం లేదు. గుడ్ బై!’ గొలుసును నా చేతిలో పెట్టి రూమ్లోకి వెళ్లి తలుపేసుకుంది. ఎంతసేపు పిల్చినా.. బతిమాలినా స్పందన లేదు. ఉండుండి వినిపిస్తోన్న ఆమె ఏడుపు తప్ప! ఉదయాన్నే రూమ్ ఖాళీ చేసి నాకంటే ముందు వెళ్ళిపోయింది. ఇక అప్పటినుంచి నన్ను కలవడానికి గానీ, మాట్లాడానికి గానీ ఇష్టపడలేదు. సెట్లో కనిపించినా ‘మనిద్దరి ఆలోచనలు వేరు. మనస్తత్వాలు వేరు. అవి కలవవు. మరిచిపో నన్ను’ అని కటువుగా చెప్పేసి దూరం పెట్టేసింది. నిర్వీర్యుడినయ్యాను. నాలో సగభాగం తెగిపడినట్టుగా కుంగిపోయాను. నిజమే. తప్పు నాదే. తన ఇష్టాయిష్టాలను ఏమాత్రం పట్టించుకోని అబ్బాయిని ఏ అమ్మాయైనా ఎందుకు ఇష్టపడాలి? డిప్రెషన్లో కూరుకుపోయాను. పెళ్ళయితే నాలో మార్పు వస్తుందని భావించిన అమ్మ పెళ్లి చేసుకోమంది. ఆమె సంతోషం కోసం పెళ్లి చేసుకున్నాను. మూడేళ్లకు నాకో కొడుకు. మధురిమ గురించిన సమాచారం పత్రికల ద్వారా కొన్నాళ్లకు తెలిసింది. హీరో అభిజిత్ ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడనీ.. అతని భార్యగా జూబ్లీహిల్స్లోని ఖరీదైన భవంతిలో మహారాణిలా ఉంటోందని! విన్నాక నాకేం బాధనిపించలేదు. తనపై కోపం కూడా రాలేదు. జీవితం తనది.. దాన్ని ఎప్పుడు ఎవరితో ఎలా పంచుకోవాలో నిర్ణయించుకునే హక్కు ఆమెది. తనేం చిన్నపిల్ల కాదు గదా. కానీ ఎంతో ఇష్టంగా ప్రేమించిన మధురిమ జ్ఞాపకాల్ని ఎన్నాళ్ళైనా వదులుకోలేక పోయాను. ఆమెతో పంచుకున్న ప్రేమకబుర్లు చేసే గాయాల నుంచి తప్పించుకోలేకపోయాను. అదే నా పొరపాటు. నటనలో ఏకాగ్రత పోయింది. షూటింగ్లకు గైర్హాజరయ్యేవాడిని. రోజులు కాదు.. నెలలు. కొత్త తరంతో పోటీలో వెనకబడి పోయాను. అవకాశాలు కరువైపోయాయి. పార్టీలు ఎక్కువయ్యాయి. తాగుడికి బానిసనైపోయాను. భరించలేక మంచం పట్టి చనిపోయింది అమ్మ. లివరు పూర్తిగా, కిడ్నీలు పాక్షికంగా దెబ్బతిన్నాయని నేనిక బతకడం కష్టమని డాక్టర్లు తేల్చేశారు. వారంరోజుల చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేసి ఇంటికి పంపించేశారు. అందరూ వచ్చి చూసి పోతున్నారు. చనిపోయేలోగా మధునొకసారి చూడాలనీ వీలైతే మాట్లాడాలనీ ఎక్కడో మనసు మూలల్లో కోరిక ప్రబలంగా ఉంది. ఐనా నా పిచ్చి గానీ తనిక్కడికి వస్తుందా.. మనసారా మాట్లాడుతుందా.. ఇది జరిగే పనేనా? నా భార్య లత చాలా మంచిది. నా గురించి, మధురిమతో నాకున్న ఎఫైర్ గురించి తెలిసే పెళ్ళికి సిద్ధపడింది. ఎప్పటికైనా ఈ వ్యసనం నుంచి బయటపడి మారతాననేది ఆమె నమ్మకం. వమ్ము కావడానికి ఎంతో కాలం పట్టలేదు. ఐనా సరే.. నన్నామె ఏనాడూ తక్కువగా చూడలేదు. నా అభిమానిగా అదామె గొప్పతనం. అందుకు సదా ఆమెకు రుణపడి వుంటాను. స్వతహాగా ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్. ఆ సంపాదనతోనే కుటుంబ బాధ్యతను తన నెత్తికెత్తుకుంది. కొడుకును చదివించింది. ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో దర్శకత్వ శిక్షణ నిప్పించింది. వాడి ప్రయత్నాలేవో సాగుతున్నాయి. ఎప్పటికైనా వాడిని దర్శకుడిగా చూడాలనేది మా ఇద్దరి కల. అది ఎప్పటికి నెరవేరుతుందో.. మా ప్రయత్నాలు ఎంతవరకు సఫలమవుతాయో, నా ప్రాణం ఎంతవరకు నిలుస్తుందో కాలమే సమాధానం చెప్పాలి. నిజాయితీ లోపించిన ప్రేమ ఎప్పటికీ సఫలం కాదు : మధురిమ సెప్టెంబర్ 20.. 2023 సంవత్సరం.. ఉదయం పన్నెండు గంటలు.. ‘హలో మధూ..’ ‘చెప్పండి..’ ‘నీకీ విషయం తెల్సా ..’ ‘ఏంటి?’ ‘రమాకాంత్ చనిపోయాడట..’ ‘ఈజ్ ఇట్ ట్రూ?’ ‘యస్.’ ‘ఎప్పుడు?’ ‘నిన్న సాయంత్రం నాలుగు గంటలకు.. వాళ్లింట్లోనే..’ ‘మై గాడ్.. ఎంత ఘోరం..’ ‘కంట్రోల్.. ఐ కెన్ అండర్ స్టాండ్ యువర్ పెయిన్. ఎంతైనా నీ మాజీ లవర్ కదా!’ ఎప్పటిలాగే సూదుల్లా గుచ్చే అతని మాటలు. బాధనిపించలేదు. నాకివి మామూలే. ‘అంతేకాదు. ఒకప్పుడతను మన కోస్టార్. అది మరిచిపోకు. మనసు రాయి చేసుకుని ఉండలేం కదా నీలాగ!’ నావైపు కౌంటర్ ఇచ్చి ఫోన్ పెట్టేశాను. టీవీ ఆన్ చేశాను. రమాకాంత్ మరణవార్త ప్రసారమవుతోంది. కృష్ణానగర్లోని అతనింట్లో ఫ్రీజర్లో ఎముకల పోగులా అతని శరీరం.. చుట్టూ అతని బంధుమిత్రులు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఎలా ఉండేవాడు రమాకాంత్.. ఆరడుగుల ఎత్తుతో బలిష్టమైన దేహం.. చురుకైన కళ్ళతో.. ఎలాంటి పాత్రనైనా కొట్టి పిండి చేయగల సత్తాతో! అతని వెరైటీ విలనిజానికి ప్రత్యేక అభిమానవర్గం ఉండేది. సినిమాల్లో ఎంత క్రూరంగా ఉంటాడో బయట అంత సౌమ్యుడు. శత్రువుకైనా సాయం చేసే మనస్తత్వం! చిన్నప్పటినుంచి నాకు డాన్ ్స అంటే పిచ్చి. ఆ ఇష్టంతోనే ఐదేళ్లు కష్టపడి కూచిపూడి నేర్చుకుని ప్రదర్శనలు ఇవ్వడం మొదలుపెట్టాను. ఒక డాన్స్ ప్రోగ్రామ్లో నన్ను చూసిన రమాకాంత్ ఓ తమిళ సినిమాలో హీరోయిన్ పాత్రకోసం సంప్రదించారు. అమ్మకు ఇష్టంలేకపోయినా నా బలవంతమ్మీద సరేనంది. ఆ సినిమా సక్సెసయ్యి సుమారు పాతిక సినిమాల్లో నటించాను. రమాకాంత్తో ఉన్న పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఎక్కడకు వెళ్లాలన్నా ఏ ఫంక్షన్కు హాజరవ్వాలన్నా కలిసి వెళ్లి.. కలిసే వచ్చేవాళ్ళం. ఆ చనువును ఎప్పుడూ ఆసరగా లేదు. అమ్మకూ అతనంటే అభిమానమే. అందుకే అతన్ని పెళ్లిచేసుకునేందుకు సిద్ధపడ్డాను. కానీ అతనికి ఒకే ఒక బలహీనత ఆల్కహాల్. ఏమాత్రం ఖాళీ దొరికినా స్నేహితులతో మందు పార్టీకే తొలి ప్రాధాన్యత. మానెయ్యమని ఎన్నోసార్లు చెప్పాను. బతిమాలాను. ‘పరిశ్రమలో మనుగడ సాగించాలంటే అందరితో టచ్లో ఉండాలి. కలిసి మెలిసి తిరగాలి. కనుక పార్టీలు తప్పవు’ అనే ఒక విచిత్రవాదనను వినిపించేవాడెప్పుడూ. ‘అదే నిజమైతే సినిమాలు మానేయ్. సంపాదించిన దాంతో ఏదైనా బిజినెస్ మొదలుపెట్టు. జీవితాంతం నేన్నీకు తోడుంటాను’ అని చాలాసార్లు హామీ నిచ్చాను. అతను పట్టించుకోలేదు. అమ్మ బెంగాలీ. నాన్నది ఇక్కడే. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. డాడీకున్న తాగుడు వ్యసనం వలన అమ్మ ఎంత బాధ పడిందో.. ఎన్ని ఇబ్బందులు.. అవమానాలు ఎదుర్కొందో నాకు తెలుసు. అందుకే తాగేవాళ్లంటే భయం. అసహ్యం. మందు మానేస్తానని ఎన్నోసార్లు రమాకాంత్ మాటిచ్చాడు. కానీ కట్టుబడిలేడు. అందుకే అతన్ని పూర్తిగా నమ్మలేకపోయాను. ఎక్కడైనా నమ్మకమూ, ప్రేమా ఉన్నచోటే గదా అభిమానం, ఆరాధన ఉండేవి. వాళ్ళమ్మ కూడా ఈ విషయంలో చేసేదేంలేదని చేతులెత్తేసింది. నా మనసు విరిగిపోయింది. నా నిర్ణయాన్ని అతనితో కరాఖండీగా చెప్పేశాను అదీ నా పుట్టిన రోజునాడే. అలా చెప్పడానికి నాలో నేనెంత వేదన పడ్డానో! మరచిపోవడం అతనికే కాదు. నాకూ కష్టమే! కానీ తప్పదు. నేను చాలా ప్రాక్టికల్. ప్రేమ పేరిట భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేంత పిచ్చితనం నాలో లేదు. ఆ తర్వాత అతను ఇల్లు ఎక్కడికో మార్చాడట. అదెక్కడో కూడా నాకు తెలియదు. కొన్నాళ్లకు హీరో అభిజిత్ లవ్ ప్రపోజల్ తెచ్చాడు.అతన్ని పెళ్లి చేసుకున్నాను. మరో ఏడాదికి అబ్బాయి పుట్టాడు. వాడిప్పుడిప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్నాడు. నా భర్త చెడ్డవాడు కాదు. అలాగని మంచివాడూ కాదు. అతనొక మగాడు. అంతే! రమాకాంత్తో నా ప్రేమవ్యవహారాన్ని ముల్లులా గుచ్చుతూ ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేస్తుంటాడు.. అమ్మాయిలతో అతనికిగల సంబంధాల్ని ప్రశ్నించినపుడల్లా! రమాకాంత్ పూర్తిగా మద్యానికి బానిసయ్యాడనీ, భార్య సంపాదనతోనే ఇల్లు నడుస్తోందని తెల్సి చాలా బాధపడ్డాను. చేయి దాటిన పరిస్థితిని ఎవరు మాత్రం చక్కదిద్దగలరు? కేవలం సానుభూతి చూపించడం తప్ప. అతనలా మారడానికి కారణం నేనేనని ఎక్కడెక్కడో విని ఎన్నో రోజులు కుమిలిపోయాను. అతనికా వ్యసనం నా మూలంగా అబ్బలేదు. దాన్ని నేను ప్రోత్సహించనూ లేదు. అలాంటపుడు నన్నెలా నిందిస్తారు? మనుషులు గానీ, బంధాలు గానీ దక్కనపుడు కలిగే దుఃఖాన్ని భరించగలిగే మానసిక స్థితి లేదని తెలిసినపుడు మనిషి ఎంత జాగ్రత్తగా ఉండాలి? సంబంధాల్ని ఎంత సున్నితంగా నెరపగలగాలి? ఒక పక్క భర్త ప్రవర్తనకూ మరోపక్క లోకం అపవాదుకూ మధ్యన నలిగిపోతూ ఎన్నో నిద్రలేని రాత్రుళ్ళు గడిపాను. ఆ మానసిక ఒత్తిడి నుంచి త్వరగా బయటపడి నగరంలోని ఒక రిచెస్ట్ ఏరియాలో డాన్ ్స స్కూల్ పెట్టాను. డాన్స్ చేస్తూ.. చూస్తూ.. నేర్పిస్తూ.. ఏళ్లుగా కోల్పోయిన నన్ను నేను అక్కడ పొందుతున్నాను. వారం క్రితం మేమిద్దరం నటించిన తొలి చిత్రాన్ని పాతికేళ్ళు నిండిన సందర్బంగా రీరిలీజ్ చేశారు. ఐమాక్స్ థియేటర్లో మళ్ళీ ఆ సినిమా చూసి నాటిæ షూటింగ్ అనుభూతుల్ని.. మధురస్మృతుల్ని ప్రెస్ మీట్ పెట్టి అందరం పంచుకున్నాం. మెయిన్ విలన్ ఒక్క రమాకాంత్ తప్ప. అతను తీవ్ర అనారోగ్యంతో బయటకురాలేని స్థితిలో ఉన్నాడనీ.. తెలిసి హృదయం ద్రవించింది. అతని చిరునామా ఎలాగోలా తెలుసుకొని చూసి రావాలనిపించింది. అంతలోనే హఠాత్తుగా ఈరోజు మరణ వార్త.. ‘రమాకాంత్ సర్ వాళ్లింటి దగ్గరకు వచ్చేశామమ్మా..’ డ్రైవర్ అన్నమాటతో ఈ లోకంలోకి వచ్చాను. కారు దిగి చుట్టూ చూశాను. జనంతో రద్దీగా వుంది. అభిజిత్కు కాల్ చేశాను. రమాకాంత్ చివరిచూపు కోసం వెళ్తున్నానీ.. రావడం లేటవుతుందనీ చెప్పి కాల్ కట్ చేశాను. లేకపోతే అటు నుంచి ఏం జవాబొస్తుందో నాకు తెలుసు. అది వినడం ఇష్టం లేదు. జనాల్ని తప్పించుకుంటూ లోపలకు నడిచాను. ఇంటి బయట టెంట్ వేసి ఉంది. రమాకాంత్ అంతిమ సంస్కారం పూర్తయినట్టుంది. బాధనిపించింది. గది మూలన అతని ఫొటో, దాని కింద దీపం వెలుగుతూ ఉంది. లీలగా వినిపిస్తోన్న బంధువుల రోదనలు తప్ప ఇల్లంతా ప్రశాంతం. నన్ను చూడగానే వచ్చారా అన్నట్టుగా చూసిందతని భార్య. బాగా తెలిసినవాడిలా కుర్రాడొకడు నన్ను లోపలకు తీసుకెళ్ళాడు. విశాలమైన రూమ్లో.. షెల్ఫ్లో షీల్డులూ, ఫొటోలూ, సన్మాన పత్రాల మెమెంటోలూ, కొన్ని పెయింటింగ్స్ కొలువుదీరి ఉన్నాయి. మరోపక్క నా బస్ట్ సైజ్ రూపం వాటర్ పెయింట్ ఒకటి గోడపై ఉంది. పుట్టిన రోజున నేను తిరిగిచ్చిన గోల్డ్ చైన్ పూదండలా దానిపై వేలాడుతోంది. ‘అదృష్టం ఒక్కసారే తలుపు తడుపుతుంది. దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుందట. ఆ అదృష్టం నేను చేజార్చుకున్న నీ సాహచర్యం. దురదృష్టం నన్ను కౌగిలించుకున్న ఈ వ్యసనం. మధూ.. క్షమించానని ఒక్క మాట చెప్పవూ..’ అని పెయింటింగ్ కింద రాసి ఉంది. చదివేసరికి గుండెను పిండేసినట్టయింది. కనుకొలకుల్లో నీళ్లు. ‘స్వఛ్చమైన, నిర్మోహమైన ప్రేమ కోసం జీవితపర్యంతం పరితపించి ప్రాణాలొదిలిన ప్రియ సఖుడా.. ఇదే నా కన్నీటి నివాళి. మనస్ఫూర్తిగా మన్నించా! వెళ్లి రా.. ప్రియనేస్తమా.. వేచి ఉంటా.. మరుజన్మలో నీ కోసం!’ నా మనసు ఆర్తిగా రోదించింది. ‘డాడీ ఎప్పుడూ మీ గురించే చెప్తుండే వారండీ.. యు ఆర్ ఏ వండర్ఫుల్ యాక్ట్రెస్ అంటూ!’ అన్నాడా కుర్రాడు. ఆ కుర్రాడెవరో అప్పుడర్థమైంది. కళ్ళు తుడుచుకొని నిశితంగా అతన్ని చూశాను. యుక్త వయసు రమాకాంత్ కనిపించాడు. పేరు హరీష్ అని చెప్పాడు. అతనితో చాలాసేపు మాట్లాడాను. మూగగా ఏడుస్తున్న రమాకాంత్ భార్య దగ్గరకు వెళ్లాను. ‘చనిపోయారనే వార్త ఈరోజు ఉదయమే తెల్సింది. అసలు రమాకాంత్ పరిస్థితి విషమంగా ఉందని ఈ మధ్యే విన్నాను. వద్దామని అనుకునేలోపే ఇలా.. ఆఖరికి చివరిచూపు కూడా దక్కలేదు’ వేదనగా అన్నాను. నా వైపే నిశ్చలంగా చూస్తూ వింటోందామె. ‘ఆయన ఉన్నప్పుడు కలిసుంటే బావుండేదండీ’ ముక్తసరిగా అందామె. కళ్లు దించుకున్నాను. ఇద్దరి మధ్యా కాసేపు నిశ్శబ్దం. తర్వాత ఆమెతో మాట్లాడాను. ఈలోపు కాఫీ తెచ్చిచ్చాడు హరీష్. తాగడం మొదలుపెట్టాను. ‘హరీష్.. నీకో గుడ్ న్యూస్. ఇందాకే మేడమ్ చెప్పారు’ అందామె. తెలుసన్నట్టు చిన్నగా నవ్వాడతను. తల్లీ కొడుకుల ముఖాలు ఆనందంతో వెలిగిపోయాయి. ఆ వెలుగు నాలో కూడా కొంత ప్రసరించింది. స్తబ్ధత, నైరాశ్యం ఒక్కసారిగా మాయమై రీలీఫ్గా అనిపించింది. లేచి నిలబడ్డాను. ‘రేపు ఆఫీస్లోనే ఉంటాను. హరీష్ను పంపించండి. అతనిదే ఆలస్యం. మా బ్యానర్లోనే.. నేనే ప్రొడ్యూసర్ని. అతన్ని దర్శకుణ్ణి చేసే బాధ్యత నాది. సరేనా?’ అన్నాను.. అంతకుముందు ఇద్దరితో చెప్పిన మాటను మళ్లీ ఒక్కసారి నిర్ధారిస్తున్నట్టుగా. ఆమె నా రెండు చేతుల్ని తన గుప్పిట్లోకి తీసుకొని కళ్ళకు అద్దుకుంటూ ‘థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్’ అంది.. ఆమె గొంతు సన్నగా వణికింది. కారెక్కి కూర్చొని చూస్తే ఆమె చెంపల పైనే కాదు నా రెండు చేతుల పైన కూడా ఆమె కన్నీటి బొట్లే! ఇవి చదవండి: నిజాలతో నిమిత్తం లేని.. 'అదొక అబద్ధాల అట్టహాసం'! -
స్పూర్తిదాయకమైన కథ.. 'బాతు–కొంగ యుద్ధం!'
విశ్వామిత్రుడి కారణంగా హరిశ్చంద్రుడు రాజ్యభ్రష్టుడై అష్టకష్టాలు పడ్డాడు. ఎన్ని కష్టాలు పడినా సత్యసంధతను వదులుకోని హరిశ్చంద్రుడిని చూసి దేవతలు నివ్వెరపోయారు. ఆయనను స్వర్గానికి రమ్మని ఆహ్వానించారు. ధర్మప్రభువైన హరిశ్చంద్రుడు దేవతల కోరికను వెంటనే మన్నించలేదు. తనతో పాటు తన అయోధ్యానగర పౌరులందరికీ స్వర్గవాసం కల్పిస్తేనే వస్తానన్నాడు. హరిశ్చంద్రుడి కోరికను దేవేంద్రుడు మన్నించాడు. వేలాది విమానాలను రప్పించి, హరిశ్చంద్రుడితో పాటు అయోధ్య వాసులందరినీ స్వర్గానికి తరలించుకుపోయాడు. హరిశ్చంద్రుడి స్వర్గారోహణం చూసి దైత్యగురువు శుక్రాచార్యుడు చకితుడయ్యాడు. ‘హరిశ్చంద్రుడిలాంటి ప్రభువు ముల్లోకాల్లోనూ మరొకరు లేరు. తన త్యాగంతో, దానంతో మహాపుణ్యాన్ని ఆర్జించి, తన పౌరులను కూడా స్వర్గానికి తీసుకుపోయాడంటే అతడిది ఎంతటి త్యాగనిరతి! హరిశ్చంద్రుడి వంటి రాజు ఇంకెవడుంటాడు?’ అని శ్లాఘించాడు. హరిశ్చంద్రుడు స్వర్గానికి వెళ్లిన తర్వాత, అప్పటికి పన్నెండేళ్లుగా గంగా నదిలో మెడలోతు వరకు నీళ్లలో నిలబడి తపస్సు చేసుకుంటూ ఉన్న వశిష్ఠుడు తన తపస్సును చాలించి బయటకు వచ్చాడు. వశిష్ఠుడు హరిశ్చంద్రుడికి కులగురువు. తన శిష్యుడైన హరిశ్చంద్రుడి యోగక్షేమాలు తెలుసుకోవడానికి నేరుగా అయోధ్యకు వెళ్లాడు. అక్కడి జనాల ద్వారా విశ్వామిత్రుడు హరిశ్చంద్రుడిని పెట్టిన బాధలను తెలుసుకుని, అమిత ఆగ్రహం చెందాడు. ‘ఈ విశ్వామిత్రుడు ఎంతటి దుర్మార్గుడు! పూర్వం నా వందమంది కొడుకులను నిర్దాక్షిణ్యంగా చంపాడు. అప్పుడు కూడా అంత కోపం రాలేదు. సత్యధర్మ నిబద్ధుడైన హరిశ్చంద్రుడిని రాజ్యభ్రష్టుడిని చేసినందుకు మాత్రం నాకు పట్టరాని కోపం వస్తోంది’ అనుకున్నాడు వశిష్ఠుడు. ఎంత నియంత్రించుకోవాలనుకున్నా కోపం తగ్గకపోవడంతో వశిష్ఠుడు ‘దుర్మార్గుడు, బ్రహ్మద్వేషి, క్రూరుడు, మూర్ఖుడు, యజ్ఞవినాశకుడు అయిన విశ్వామిత్రుడు కొంగ రూపాన్ని పొందుగాక’ అని శపించాడు. వశిష్ఠుడి శాపాన్ని తెలుసుకున్న విశ్వామిత్రుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ‘నన్ను శపించ సాహసించిన వశిష్ఠుడు బాతు రూపం పొందుగాక’ అని ప్రతిశాపం ఇచ్చాడు. పరస్పర శాపాల కారణంగా విశ్వామిత్రుడు కొంగగా, వశిష్ఠుడు బాతుగా మారిపోయారు. వారి రూపాలు సామాన్యమైన కొంగ, బాతుల మాదిరిగా లేవు. కొంగ మూడువేల యోజనాల పొడవు ఉంటే, బాతు రెండు వేల యోజనాల పొడవు ఉంది. భీకరమైన కొంగ, బాతు రూపాలు పొందిన విశ్వామిత్ర, వశిష్ఠులు పరస్పరం తారసపడ్డారు. పూర్వవైరం ఇంకా చల్లారని వారిద్దరూ యుద్ధానికి తలపడ్డారు. బాతు, కొంగల రూపాల్లో వారు హోరాహోరీగా పోరు సాగిస్తుంటే, వారి ధాటికి మహావృక్షాలు నేలకూలాయి. పర్వతాల నుంచి గిరిశిఖరాలు నేల మీదకు దొర్లిపడ్డాయి. భూమి కంపించింది. సముద్రాలు అల్లకల్లోలంగా మారి హోరెత్తాయి. భీకరమైన బాతు, కొంగల కాళ్ల కిందపడి ఎన్నో జీవులు మరణించాయి. ఇన్ని ఉత్పాతాలు జరుగుతున్నా అవేమీ పట్టకుండా బాతు కొంగల రూపాల్లో వశిష్ఠ విశ్వామిత్రులు హోరాహోరీగా రోజుల తరబడి పోరు కొనసాగిస్తూనే ఉన్నారు. వారి యుద్ధానికి దేవతలు కూడా భీతిల్లారు. అందరూ బ్రహ్మదేవుడి వద్దకు పరుగులు తీశారు. ‘ఓ విధాతా! వశిష్ఠ విశ్వామిత్రులు పరస్పర శాపాలతో బాతు కొంగ రూపాలు పొంది భూమ్మీద పోరు సాగిస్తున్నారు. వారి యుద్ధంలో ఇప్పటికే ఎన్నో జీవులు మరణించాయి. ప్రకృతి అల్లకల్లోలంగా ఉంది. వారి యుద్ధాన్ని నివారించకుంటే, భూమ్మీద ప్రళయం వచ్చేలా ఉంది. వారి పోరును నువ్వే అరికట్టాలి. భూలోకానికి పెను విపత్తును తప్పించాలి’ అని ప్రార్థించారు. బ్రహ్మదేవుడు దేవతలందరితోనూ కలసి భూమ్మీద పోరు జరుగుతున్న చోటుకు హుటాహుటిన వచ్చాడు. ‘వశిష్ఠ విశ్వామిత్రులారా! ఏమిటీ మూర్ఖత్వం? తక్షణమే యుద్ధాన్ని ఆపండి’ ఆజ్ఞాపించాడు బ్రహ్మదేవుడు. బాతు కొంగ రూపాల్లో ఉన్న వారిద్దరూ బ్రహ్మదేవుడి మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా, మరింత ఘోరంగా యుద్ధం చేయసాగారు. ‘ఇప్పటికే మీ వల్ల ఎంతో అనవసర ప్రాణనష్టం జరిగింది. బుద్ధి తెచ్చుకుని యుద్ధాన్ని మానుకోండి’ మరోసారి హెచ్చరించాడు బ్రహ్మదేవుడు. వశిష్ఠ విశ్వామిత్రులు అప్పటికీ అతడి మాటలను పట్టించుకోకుండా యుద్ధాన్ని కొనసాగించారు. చివరకు బ్రహ్మదేవుడు తన శక్తితో వారిద్దరి తామస గుణాన్ని హరించాడు. వశిష్ఠ విశ్వామిత్రులు పూర్వరూపాల్లోకి వచ్చారు. బ్రహ్మదేవుడి వద్ద చేతులు జోడించి నిలుచున్నారు. ‘వశిష్ఠా! విశ్వామిత్రుడి తప్పేమీ లేదు. హరిశ్చంద్రుడి ధర్మనిరతిని లోకానికి చాటడానికే అతణ్ణి పరీక్షలకు గురిచేసి, స్వర్గానికి పంపించాడు. నువ్వు అదేదీ గ్రహించకుండా అతణ్ణి శపించావు. ఈ విశ్వామిత్రుడు కూడా కోపాన్ని అణచుకోలేక నిన్ను శపించాడు. మీ వల్ల ఎంతో అనర్థం జరిగింది. ఇకనైనా తామస గుణాన్ని విడనాడి, శాంతం వహించండి. మీ వంటి మహర్షులకు తామసం తగదు’ అని బ్రహ్మదేవుడు హితవు పలికాడు. బ్రహ్మదేవుడి మాటలకు వశిష్ఠ విశ్వామిత్రులిద్దరూ సిగ్గుపడ్డారు. పరస్పరం క్షమాపణలు చెప్పుకుని, ఒకరినొకరు కౌగలించుకున్నారు. ఈ దృశ్యం చూసి దేవతలంతా సంతోషించారు. బ్రహ్మదేవుడితో కలసి అక్కడి నుంచి సంతృప్తిగా నిష్క్రమించారు. — సాంఖ్యాయన ఇవి చదవండి: నా స్టూడెంట్ టీచర్ అయింది! -
ఫండే: కథ - 'ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు..!'
ఇంటి దగ్గరకు వచ్చే కొద్ది చీకటి చిక్కపడుతూ వచ్చింది. మనసు బాధతో ఒక్కసారి మూలిగింది. రాత్రి కూడా ఆఫీసులోనే గడిపితే – ఇల్లే కదా స్వర్గసీమ అనేది ఉత్త మాటేనా? బాధగానే తలుపు తట్టాను. అనుభవానికి భిన్నంగా తలుపులు వెంటనే తెరుచుకున్నాయి. చిమ్మచీకట్లో పూర్ణ చంద్రోదయం అయినట్లు, చిరునవ్వుతో ఎదురుగా నిలబడి వుంది మా ఆవిడ! ఆశ్చర్యంతో పెదవి పెగలలేదు నాకు. అడుగు ముందుకు పడలేదు. క్రికెట్లో పదకొండవ నెంబర్ ఆటగాడైన బౌలర్ రెండు వందలు కొట్టినట్లు వింటే కలిగేటంత ఆశ్చర్యం.. బహుమతి వచ్చిన లాటరీ టికెట్ను ఎవరో మతిలేనివాడు నాకు అందిస్తే కలిగేటంత ఆశ్చర్యం.. యాబై యేళ్ళ జీవితంలో ఒక్కసారైనా చూడని, పేరు వినని వాడు విశాఖలో అచ్చంగా నాకు వెయ్యిగజాలు ఉచితంగా రాసిచ్చాడని వింటే కలిగేటంత ఆశ్చర్యం అనిపించింది! ‘ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా నిలబడి పోయారు.. లోపలకు రండి’ గోముగా పలికింది మా ఆవిడ. ఆ పలికిన తీరు నా ఆశ్చర్యానికి మల్లెలు తురిమాయి ఏమైంది ఈ రోజు..? ఏమిటీ మార్పు? ఇంటి లోపలకు అడుగు పెడుతూనే చుట్టూ చూశాను. అత్తగారు కానీ మామగారు కానీ వచ్చారా.. లేకపోతే మా ఆవిడ అక్క కానీ..! ఏదో బలమైన కారణం ఉండాలి. లేకపోతే మా ఆవిడ ఇలా నవ్వుతూ పలకరించటమే! తుఫాను ముందు వీచే చల్ల గాలిలా, బహుశా ఏదైనా కొనమని అడుగుతుందేమో..! పండుగకి ఇంకో రెండు వారాలే! అయినా పండుగకి కొనవలసిన వాటికి టెండర్ పెట్టడమూ, ఒప్పుకోవటమూ అయిపోయిందిగా! మళ్ళీ, ఇప్పుడు ఇలా..! నాకు పాలుపోలేదు. కుర్చీలో కూర్చుని షూ లేస్ విప్పుకున్నాను. వేడి వేడి కాఫీతో వచ్చి నా పక్కనే కూర్చుంది.. ఆవిడ. అది మరో షోకు! ఆఫీసు నుంచి రాగానే అలా కాఫీ ఇవ్వటం, కాసేపు సరదాగా మాట్లాడుకోవటం మొదలైనవి గత చరిత్ర. ఏదైనా అవసరముంటే చెప్పటం, పొడి పొడిగా మాట్లాడుకోవటం, లేకపోతే ఎవరి పనిలో వాళ్లం ఉండటం నేటి చరిత్ర. ‘ఏవండీ.. అలా మాట్లాడకుండా కూర్చున్నారు?’ ఎదురుగా కూర్చున్నది మా అవిడేనా అనే సందేహం కలిగింది నాకు. పరిశీలనగా సూక్ష్మంగా చూశాను.. అవిడే! ‘దేవుడా.. ఈ రోజు ఏ సునామీ రాకుండా కాపాడు తండ్రీ’ అని ప్రార్థిస్తూనే అన్నాను..‘చెప్పు?’ ‘ఏముంటాయండీ.. మాకు చెప్పడానికి? రోజంతా ఇంట్లో మగ్గేవాళ్ళం. మీరే చెప్పండి..’ ఒక్క సిప్పు కాఫీ తాగాను.. కాఫీ.. రోజుకన్నా బాగుంది. అయినా ఆ మాట పైకి అనలేదు. కాసేపు పోయాక మా ఆవిడే చెప్పటం మొదలు పెట్టింది.. ‘మరేమోనండీ.. నాలుగు రోజుల క్రితం మా అక్క.. అదేనండీ.. మా పెద్దమ్మ కూతురు ఫోన్ చేసింది..’ రోజుల కొద్ది బయటకు చెప్పకుండా మనసులో దాచి ఉంచిన, చుట్టాల సంగతులు.. వాళ్ళ గొడవలు వగైరాలు నా ముందు వరదగా ప్రవహించాయి ఆనకట్ట పగిలినట్లు. సంవత్సరాల క్రితం గమనించిన ఆమెలోని చలాకీతనం మాట తీరు పునర్జన్మ ఎత్తినందుకు కొంత సంతోషించాను. ఆ మాటలు వినటం పోనూ పోనూ ఇబ్బంది అయినప్పటికీ! ‘అసలు సంగతి మర్చి పోయానండీ. సాయంత్రం బజ్జీలు వేశానండీ’ హఠాత్తుగా లేచింది. ‘ఆఫీసు నుంచి ఆకలితో వస్తారనీ..’ ‘ఇదొకటా..’ మనసులో అనుకున్నాను. వైశాఖంలో వాన చినుకులా..’ మా ఆవిడ సాయంత్రం టిఫిన్ చేయటం కూడానా! ఇంటికి వచ్చి ఆకలిగా ఉంది అని చెబితే ‘బయట తినలేక పోయారా?’ అని అంటుంది. ‘టైమ్ చూశావా? తొమ్మిది దాటుతోంది. ఇప్పుడు బజ్జీలేమిటీ.. అన్నంలో తినేస్తాను’ అంటూ లేచాను. ఫ్రిజ్ నుంచి తీసిన చలి విరగని కూరలు తినే బదులు సాయంత్రం చేసిన బజ్జీలు బెటర్ అనుకున్నాను. కానీ మరో షాకు ఇచ్చింది మా ఆవిడ. వెచ్చ వెచ్చగా చారూ కూర వడ్డించి! ‘ఇదేమిటే ఈ రోజు ఇలా షాకుల మీద షాకులు ఇస్తున్నావు.. వేడి వేడి వంటలు..’ ‘ఏదో, నేను ఎప్పుడూ మీకు వేడి వేడిగా వంటి పెట్టనట్లు!’ ఆవిడ ముఖం ఎర్రబడింది. ‘పోనీలే.. అయినా ఈ రోజు ఈ మార్పు ఏమిటి? ఏదో ఉంది. కారణం చెప్పు. ఏం టెండర్ పెడుతున్నావు?’ ‘మరీ బాగుంది మీ మాట.. ఏదైనా కొనాలని అడిగే ముందే మీకు నేను సేవ చేస్తున్నట్లు! లేకపోతే చేయట్లేనా?’ ‘అలా అనలేదే నేను. ఇంతకు నా బడ్జెట్లో వచ్చే వస్తువే అడగాలి సుమా’ హెచ్చరించాను. పదివేలు పెట్టి పండుగకి పట్టుచీర కొన్నాను. అందువల్ల చీర టెండర్ పెట్టదు. మరింకేం అడుగుతుంది? నేను ఆలోచనలో పడ్డాను.. హఠాత్తుగా గుర్తుకొచ్చింది. పండుగకి బోనస్ వస్తే ఒక్క వజ్రపు ముక్కు పుడక కొనమని అడుగుతోంది. ‘ఇంకా బోనస్ సంగతి తెలియదే’ అన్నాను. ‘అది కాదండీ..’ ఒక్క నిమిషం మాట్లాడలేదు మా ఆవిడ. ‘ఏమండీ..’ మళ్ళీ గోముగా పిలిచింది. ‘చెప్పు..’ ‘నా సెల్ఫోను పోయిందండీ..’ ఓ.. అదా సంగతి! అందుకా ఈ మార్పు. సెల్ ఉంటే సెల్ చెవికి అంటించుకుని రోజంతా మాట్లాడుతూ గడిపే మా ఆవిడకి సెల్ పోయేసరికి భర్తతో మాట్లాడాలని వంట చేయాలని గుర్తుకొచ్చిందన్న మాట! ‘ఎక్కడ పోతుందే.. నువ్వే ఎక్కడైనా పెట్టి మరిచిపోయుంటావు. బాగా వెతుకు.’ ‘అంతా వెతికానండీ..’ మా ఆవిడ దీనంగా నా వైపు చూస్తూ అంది. ‘కనబడలేదండీ..’ ‘అయితే ఇప్పుడు కొత్త సెల్ కొనాలన్న మాట. అంతేగా!’ ఒక్క పూట తిండి లేకపోయినా గడపవచ్చు కాని సెల్ ఫోను లేకపోతే నిమిషమైనా గడపలేం కదా ! ఏం చేస్తుంది.. పాపం! సంపాదన లేని ఇల్లాలు! ‘అలాగేలే. కొత్తది కొంటానులే’ అన్నాను. ఆవిడ ముఖం మీద చంద్రోదయం అయింది. నేను మనసులో నవ్వుకుంటూ అనుకున్నాను.. ‘ఒక్క నాలుగురోజులు పోయాక ఆఫీసులో దాచిన మా ఆవిడ సెల్ ఫోన్ ఇంటికి తీసుకు రావాలని, ఒక్క నాలుగు రోజులు ఆవిడ మాటలూ సాన్నిహిత్యాన్ని ఆస్వాదించాలని! — ఎల్. ఆర్. స్వామి -
ఫండే: ఈ వారం కథ - 'డీల్ ఓకే!'
అర్ధరాత్రి నిద్రలో మెలకువ వచ్చి కళ్లు తెరిచి తుళ్ళి పడ్డాను. చిమ్మచీకటి. పక్కనే ఉన్న ఓ మొహం. కేవలం దాని మీదనే వెల్తురు. విరబోసిన జుత్తు. చింతనిప్పుల్లా కళ్ళు. వికటాట్టహాసం. మళ్లీ కళ్లుమూసి ఆంజనేయ దండకం అందుకున్నాను. మత్తు కొంచెం వదిలాక కొంచెం నిదానం వచ్చాక ఒక కన్ను సగం తెరిచి చూశాను. అది మా ఆవిడే. దయ్యం కాదు. ఇపుడు భయం ఇంకా ఎక్కువైంది. ధైర్యం కూడదీసుకుని అడిగాను ‘ఏమిటిది’ అని. ‘యూ ట్యూబ్లో ఇది ఇంటరెస్టింగ్గా వుంది. చూస్తారా?’ ‘అర్ధరాత్రి ఈ అంకాలమ్మ శివాలెందుకు? అంతగా అయితే పొద్దున్న చూసుకోవచ్చు కదా!’ ‘భలేవారే. అప్పుడు వేరేవి చూడొచ్చు’ సిన్సియర్గా చెప్పింది. ఆవులించి, అటువైపు తిరిగి తలగడని కావలించి పడుకున్నాను. ఇది జరిగి రెండు నెలలయింది. అంటే ఆ తర్వాత అలా అవ్వలేదని కాదు. రోజూ అయ్యీ, అయ్యీ నాకలవాటయి పోయింది. ఇప్పుడు నేను తుళ్ళి పడటం లేదు. ఇలా జరగడానికి కారణం నేనే. మాది అన్యోన్య దాంపత్యం. నన్నొదిలి మా ఆవిడ ఒక్క క్షణం ఉండేది కాదు. ఎల్లవేళలా అంటిపెట్టుకునే వుండేది. అనుమానం తో కాదు. అభిమానంతో. నాకు కవిత్వం రాయడం ఇష్టం. అయితే ఎదురుగా ఎవరున్నా రాయలేను. పెన్ను కదలదు. ఆవిడ 24 గంటల నిరంతర వార్తా స్రవంతి చానెల్లాగా నాతోనే ఉండడం వల్ల ఈ మధ్య రాయడం అవ్వడం లేదు. ఆ మాట అనలేక ఒకసారి చెప్పి చూశాను ‘బంగారం.. ఏమైనా పుస్తకం తీసి చదువుకోవచ్చు కదా, మంచి వ్యాపకం కదా!’ ‘పుస్తకాన్ని చిన్నప్పటి నుంచీ చూసీ, చూసీ బోరు కొట్టేసింది. తాకితే చాలు.. చూడండి స్కిన్ ఎలర్జీలాగా ఒళ్లంతా బొబ్బలు వచ్చేస్తున్నాయి. వద్దు బాబోయ్.’ ‘పోనీ టీవీ చూడొచ్చు కదా!’ ‘అది కుదరదు. నేను టె¯Œ ్తలో ఉన్నప్పుడు ఒకసారి టీవీలో జీడిపాకం సీరియల్ చూస్తుండగా నాన్న వచ్చారు. చదువుకోకుండా అలా చూడడం ఆయనకు నచ్చక నన్ను కాణిపాకం తీసుకువెళ్ళి, ఒట్టేయించుకున్నారు, ఈ సీరియల్ అయిపోయేవరకూ టీవీ చూడకూడదని. ఆ సీరియల్ ఈ జన్మకి అయ్యేట్టు లేదు.’ ‘పోనీ నా కవితలు నోట్సుల నిండా కోకొల్లలుగా ఉన్నాయి. అవి చదివి ఎలా ఉన్నాయో చెప్పొచ్చు కదా!’ ‘కబుర్లు చెప్పండి. ఎన్నయినా వింటాను. కవితలంటే మాత్రం చెవులు కోసుకుంటాను. నిజంగానే. అస్సలిష్టం ఉండవు.’ ‘మా తల్లే, పెళ్లికి ముందు మీ నాన్న నేను కవిని అని తెలిసి.. మా అమ్మాయి కవితలంటే చెవి కోసుకొంటుంది అంటే ఈ అర్థంలో అనుకోలేదు’ గొణిగాను. అప్పుడు వచ్చిందో ఐడియా. యూ ట్యూబ్ని మెల్లగా తనకి అలవాటు చేసెయ్యాలి. అందులో ‘ఇది బాగుంది చూడు, అది బాగుంది చూడు’ అంటూ అడ్డమైనవీ చూపించడం చెయ్యాలి. అలా అలా మొదట కలిసి చూడడం అలవాటు చేశాను. చూస్తూ, చూస్తూ నేను మానేశాను. తను కంటిన్యూ చేస్తోంది. ఆ గ్యాప్లో నేను కవిత్వం రాసుకొంటున్నాను. అయితే తన అలవాటు ఇలా వెర్రితలలు వేసి నిద్రలు చెడగొడుతుందనుకోలేదు. ‘నీకో సర్ప్రైజ్ బంగారం.. నా కవిత్వం అంతా ఒక పుస్తకంగా పబ్లిష్ చేశాను. త్వరలో ఆవిష్కరణ. నువ్వు రావాలి.’ ‘ఓహ్. కంగ్రాట్స్. నేను రాకుండా ఎలా ఉంటాను, నచ్చకపోయినా? నాకేగదా అంకితం ఇచ్చారు?’ గుండెలో రాయి పడింది. ‘నీక్కాదోయ్. యూ ట్యూబ్కి’ గొణిగాను. ఓ చూపు చూసింది. అలాంటి చూపు ఇంతకు ముందు ఒకసారే అనుభవం. కాలేజీలో అడిగిన ప్రశ్నకి తిక్క జవాబు చెప్పినపుడు మాస్టారు చూసిన చూపు. పుస్తక ఆవిష్కరణ సభకి ఇద్దరం వెళ్ళాం. నా కవి మిత్రుల్ని, అభిమానుల సందోహాన్ని, పటాటోపాన్ని, నా పుస్తకాలకు ఎగబడే సాహితీ ప్రియుల్ని గర్వంగా మా ఆవిడకి చూపాలని గొప్ప ఆశగా ఉంది. సభ చూసి ఉస్సురన్నాను. గంట గడిచినా కుర్చీలు ఖాళీ. చూస్తే పట్టుమని పదిమంది లేరు. కవిగాయక కళాకారులు, బంధుమిత్రులు అంతా బందు. బొత్తిగా మొహమాటం లేదు వీళ్ళకి. వచ్చిన వాళ్లలో ఎవరైనా పుస్తకం పొరపాటున అడిగితే ఒట్టు. సభానంతరం కొంచెం గిల్టీగా అన్నాను.. ‘బంగారం.. అనవసరంగా పుస్తకం ప్రచురించి వేలకు వేలు తగలెట్టానేమో కదా!’ ‘మీరే అలా అనుకుంటే ఎలా అండీ? అమ్ముకుని సొమ్ము చేసుకుందామని కాదు కదా మీరు పబ్లిష్ చేసింది. ఇంటికి పదండి ముందు. మీకో సర్ర్పైజ్ న్యూస్ చెప్తాను.’ ‘ఏంటబ్బా’ అనుకుంటూ ఇంటికి చేరక ముందే ఉగ్గబట్టలేక, గేటు బయటే అడిగేశాను విషయమేంటని! గేటులోంచి నన్ను ఇంట్లోకి గిరవాటేసి సుడిగాలిలా వచ్చింది. నన్ను కుర్చీలో కూలదోసి తన సెల్లో యూ ట్యూబ్ ఓపెన్ చేసి చూడమంది. అందులో ‘తొక్క తీస్తా’ అన్న టైటిల్తో ఉన్న వీడియో. దాంట్లో అంతా చిక్కుడుకాయలకు, చింతకాయలకు తొక్క తీసే విధానం చూపుతూ వాయిస్ ఓవర్. పావుగంట సేపు సాగుతుంది. పరమ బోరు. కాకపోతే మిలియన్ల కొద్దీ సబ్స్క్రైబర్లు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే అని చూస్తే అది మా ఆవిడ చానెల్. ‘ఈ వీడియోలు చూసీ చూసీ నేనేం తక్కువ అని చానెల్ పెట్టానండీ. సక్సెస్ అయ్యింది. ఇక మరి చూసేదే లేదు. అప్లోడ్ చెయ్యడమే తప్ప!’ కొంచెంసేపటికి కోలుకున్నాను మెంటల్ షాక్ నుండి కాదు, ఆశ్చర్యం నుండి. ‘హమ్మయ్య, ఏమైతేనేం. మరి పిచ్చిగా యూ ట్యూబ్ చూడదన్నమాట.. పిచ్చి పిచ్చిగా అప్లోడ్ చెయ్యడం తప్పించి. థాంక్ గాడ్ ’ అనుకుంటూ ‘మంచి సర్ర్పైజ్’ అన్నాను. ‘అంతే కాదు మీ పుస్తకం ప్రచురణకయిన ఖర్చు నేనే భరిస్తాను. ముందు ముందు కావాలంటే మరిన్ని పుస్తకాలు ప్రచురించుకోండి. యూ ట్యూబ్ వల్ల నాకు వచ్చిన ఆదాయం అంతా మీకే. ఓకేనా?’ ఓ.. వీక్షకులను టార్చర్ పెడితే డబ్బులు కూడా ఇస్తారన్న మాట. అయితే నేను యూ ట్యూబ్కి అంకితం ఇవ్వడం అన్నది అతికినట్టు సరిపోయిందే. ‘థాంక్యూ బంగారం. అయితే ఒక షరతు. నీ చానెల్ నేను చచ్చినా చూడను, నా కవితలు నువ్వూ చూడొద్దులే. సరేనా?’ ‘అంతకన్నానా! నేనూ అదే అందామనుకున్నాను. మీ కవిత్వం చచ్చినా చూడను. నా చానెల్ మీరు చూడొద్దులే.’ ఆవిడ వీడియో సరంజామా వెతుక్కుంటూ వెళ్ళింది. నేను పెన్ను, పేపర్ అందుకున్నాను. — డాక్టర్ డీవీజీ శంకరరావు -
'సమ్యక్ దర్శనం' వల్లే సత్యాన్ని తెలుసుకోగలం!
మగధ రాజ్య రాజధాని రాజగృహ సమీపంలోని పక్షి పర్వతం. ఆ పర్వతం చివర విశాలమైన చదును భాగం. ఒకపక్క పెద్ద పెద్ద కొండరాళ్ళు. ఆ రాళ్ళ సందులో చిన్న గుహ. అది చల్లగా విశ్రాంతి తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. చదును భాగం చుట్టూ పనస చెట్లు దట్టంగా ఉన్నాయి. ఒకరోజు బుద్ధుడు సాయంత్రం వేళ ఆ గుహ ముందున్న రాతిమీద కూర్చొని ఉన్నాడు. ఆ సమయానికి వచ్చాడు దీర్ఘనఖుడు అనే సన్యాసి. అతను అగ్ని ఆరాధకుడు. దీర్ఘనఖుడు వచ్చి, వంగి బుద్ధునికి నమస్కరించాడు. ఒక పక్కన నిలబడ్డాడు. ఆ రోజుల్లో కొందరు తాపసులు ‘‘మీరు చెప్పేది ఏదీ నాకు సమ్మతం కాదు. దేన్నీ నేను ఒప్పుకోను’’ అనేవారు. ఏ విషయాన్ని చెప్పినా, దాన్ని ఏదో ఒక విధంగా విమర్శించేవారు. తప్పులు వెదికేవారు. అంగీకరించేవారు కాదు. ఇంకొందరున్నారు. వారు ప్రతిదాన్నీ అంగీకరించేవారు. ఆయా విషయాలపై వాదవివాదాలు చేసేవారు కాదు. ‘అలాగే... ‘అవునవును’ అంటూ తలలూపేవారు. ఇక మూడోరకం ఉన్నారు. వారు ‘‘మాకు కొంత సమ్మతం కాదు’’ అనేవారు. దీర్ఘనఖుడు ఇందులో మొదటి రకం వాడు. ‘‘ఏదీ నాకు సమ్మతం కాదు’’ అనేవాడు. ఆరోజు ఇదే విషయం గురించి చర్చించుకుంటూ.... ‘‘దీర్ఘనఖా! ఏదీ నాకు సమ్మతం కాదు’ అనేదైనా నీకు సమ్మతమేనా?’’ అని అడిగాడు. ‘‘గౌతమా! అది మాత్రం నాకు సమ్మతమే’’ అన్నాడు. బుద్ధుడు అతని వైపు తదేకంగా చూశాడు. బుద్ధుని ప్రశాంత దృక్కులు తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు గమనించాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘ఏదీ సమ్మతం కాదు... అనేవారి దృష్టి రాగరహితంగా ఉంటుంది. దేనితో కలవకుండా ఉంటుంది. ΄÷గడ్తలకు, ప్రతి దాన్నీ పొందాలనే భావనకూ దూరంగా ఉంటుంది. దేనినీ పట్టుకుని వేళ్ళాడదు!’’ అన్నాడు. ‘‘గౌతమా! మంచిది. మీరు నా దృష్టి కోణాన్ని మెచ్చుకుంటున్నారన్నమాట’’ అన్నాడు. ‘‘దీర్ఘనఖా! ఇంకా విను. ‘అంతా సమ్మతమే అనేవారు దీనికి భిన్నంగా ఉంటారు. వారి దృష్టి రాగంతో ఉంటుంది. ప్రతి దానితో కలసి΄ోతుంది. ΄÷గడ్తలను కోరుకుంటుంది. ప్రతి దాన్నీ పొందాలి అనుకుంటుంది. ఇక మూడోరకంవారి దృష్టి ఈ రెండు రకాలనూ కలగలుపుకుని ఉంటుంది. విశేషం ఏమిటంటే.. ఈ మూడు రకాల వారిలో ప్రతి ఒక్కరూ తమ దృష్ఠే సరైనదనుకుంటారు. ఇతరుల్ని విమర్శిస్తారు. వ్యతిరేకిస్తారు. తమ అనుభవంలో... తాము అనుకునేదానికి భిన్నమైన ఫలితం చూసినా, గ్రహించినా గానీ,,, వీరు మారరు. మూర్ఖంగా తాను అనుకున్నదే సత్యం అనుకుంటారు. సర్వం అదే అని నిర్ణయించుకుంటారు. మిగిలినదంతా మిధ్యే అని భావిస్తారు. దీని వల్ల ప్రజ్ఞని (ఎరుకను) కోల్పోతారు. సత్యాన్ని ఆవిష్కరించలేరు’’ అని చెప్పాడు. బుద్ధుడు అలా మూడురకాల దృష్టి గలవారి గురించి చెప్పాక, తన తప్పు ఏమిటో దీర్ఘనఖునికి అర్థమైంది. ద్వేషం, క్రోధాలు ఎలా సత్యాన్ని తెలుసుకోడానికి అవరోధాలలో... రాగం మోహం కోరికలు కూడా అలాంటి అవరోధాలే అని గ్రహించాడు. ఇవి తొలగించుకుని సమ్యక్ దర్శనం వల్లనే సత్యాన్ని సత్యంగా.. ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోగలం అని అర్థం చేసుకున్నాడు. మనస్సుని మాలిన్య రహితం చేసుకోవడం వల్ల సమ్యక్ దృష్టి కలుగుతుందని గ్రహించి... వినమ్రంగా బుద్ధుని పాదాలంటి నమస్కరించాడు. – డా. బొర్రా గోవర్ధన్ ఇవి చదవండి: గంగే మాం పాహి! -
మైరావణుని ప్రాణాలు తుమ్మెద రూపంలో
లంకలో రామ రావణ యుద్ధం జరుగుతోంది. వానరసేన ధాటికి, రామలక్ష్మణుల పరాక్రమానికి రాక్షస వీరులు ఒక్కొక్కరే హతమైపోయారు. చివరకు మహాబలశాలి అయిన రావణుడి సోదరుడు కుంభకర్ణుడు, దేవేంద్రుడిని సైతం జయించిన మేఘనాదుడు హతమైపోయారు. దిక్కుతోచని స్థితిలో పడ్డాడు రావణుడు. ఒంటరిగా కూర్చుని, తన మేనమామ మైరావణుడిని తలచుకున్నాడు. మైరావణుడు వెంటనే ప్రత్యక్షమయ్యాడు. రావణుడి పరిస్థితి తెలుసుకున్నాడు. ‘రావణా! విచారించకు. నా మాయాజాలాన్ని దాటి రాముడైనా, దేవుడైనా అంగుళం దాటి అవతలకు పోలేరు. రామలక్ష్మణులిద్దరినీ బంధించి, రేపే వాళ్లను దుర్గకు బలి ఇస్తాను’ అని ధైర్యం చెప్పాడు. విభీషణుడికి చారుల ద్వారా సంగతి తెలిసి, సుగ్రీవుడిని, వానరులను అప్రమత్తం చేశాడు. రామలక్ష్మణులకు కట్టుదిట్టంగా కాపాడుకోవాలని చెప్పాడు. వెంటనే హనుమంతుడు తన తోకను భారీగా పెంచి, రామలక్ష్మణుల చుట్టూ రక్షణవలయంలా ఏర్పాటు చేసి, తోకపై కూర్చుని కాపలాగా ఉన్నాడు. మైరావణుడికి ఇదంతా తెలిసి, రామలక్ష్మణులను తస్కరించుకు తెమ్మని సూచీముఖుడనే అనుచరుణ్ణి పంపాడు. హనుమంతుడి వాలవలయం లోపలికి సూక్ష్మరూపంలో ప్రవేశించడానికి ప్రయత్నించాడు. హనుమంతుడి వాల రోమాలను తాకడంతోనే అతడి ముఖం రక్తసిక్తం కావడంతో వెనుదిరిగాడు. సూచీముఖుడి వల్ల పని జరగకపోవడంతో పాషాణముఖుడిని పంపాడు. వాడు హనుమంతుడి వాలవలయాన్ని తన రాతిముఖంతో బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తే, వాడి ముఖమే బద్దలైంది. చివరకు మైరావణుడే స్వయంగా రంగంలోకి దిగాడు. మాయోపాయాలలో ఆరితేరిన మైరావణుడు హనుమంతుడి వద్దకు విభీషణుడి రూపంలో వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు సురక్షితమే కదా! రాక్షసులు మాయావులు. నేనొకసారి లోపలకు పోయి రామలక్ష్మణులను చూసి వస్తాను’ అన్నాడు. హనుమంతుడు తోకను సడలించి, అతడు లోపలకు పోయేందుకు మార్గం కల్పించాడు. లోపలకు చొరబడిన మైరావణుడు రామలక్ష్మణులను చిన్న విగ్రహాలుగా మార్చి, తన వస్త్రాల్లో దాచి పెట్టుకుని ఏమీ ఎరుగనట్లు బయటకు వచ్చాడు. ‘రామలక్ష్మణులు గాఢనిద్రలో ఉన్నారు. జాగ్రత్త’ అని హనుమంతుడితో చెప్పి, అక్కడి నుంచి తన పాతాళ లంకకు వెళ్లిపోయాడు. వారిని ఒక గదిలో బంధించి, తన సోదరి దుర్దండిని వారికి కాపలాగా పెట్టాడు. కాసేపటికి విభీషణుడు వచ్చాడు. ‘హనుమా! రామలక్ష్మణులు క్షేమమే కదా! ఒకసారి లోపలకు పోయి చూద్దాం’ అన్నాడు. ‘విభీషణా! ఇందాకే కదా వచ్చి వెళ్లావు. ఇంతలోనే మళ్లీ ఏమొచ్చింది’ అడిగాడు హనుమంతుడు. హనుమంతుడి మాటలతో విభీషణుడు ఆందోళన చెందాడు. ‘హనుమా! ఇంతకుముందు నేను రాలేదు. ఇదేదో మైరావణుడి మాయ కావచ్చు. చూద్దాం పద’ అన్నాడు. ఇద్దరూ లోపల చూశారు. రామలక్ష్మణులు కనిపించలేదు. విభీషణుడికి పరిస్థితి అర్థమైంది. ‘హనుమా! మనం క్షణం కూడా ఆలస్యం చెయ్యవద్దు’ అంటూ తనతో హనుమంతుడిని పాతాళ లంకకు తీసుకుపోయాడు. కావలిగా ఉన్న దుర్దండితో విభీషణుడు ‘భయపడకు. రామలక్ష్మణులు ఎక్కడ ఉన్నారో చెప్పు’ అన్నాడు. ‘రామలక్ష్మణులను తెల్లారే బలి ఇవ్వడానికి మైరావణుడు సిద్ధమవుతున్నాడు. వారు ఇదే గదిలో ఉన్నారు’ అని చూపింది. హనుమంతుడు గది తలుపులు బద్దలుకొట్టాడు. ఆ శబ్దానికి కాపలాగా ఉన్న రాక్షసభటులు పరుగు పరుగున ఆయుధాలతో అక్కడకు వచ్చారు. హనుమంతుడు భీకరాకారం దాల్చి, వారందరినీ దొరికిన వారిని దొరికినట్లే మట్టుబెట్టసాగాడు. పాతాళలంకలో రాక్షసుల హాహాకారాలు మిన్నుముట్టాయి. ఈ కలకలం విని మైరావణుడే స్వయంగా వచ్చాడు. రాక్షసులపై వీరవిహారం చేస్తున్న హనుమంతుడితో కలబడ్డాడు. మైరావణుడు తన మీద ప్రయోగించిన ఆయుధాలన్నింటినీ హనుమంతుడు తుత్తునియలు చేశాడు. చివరకు ఇద్దరూ బాహాబాహీ తలపడ్డారు. హనుమంతుడు ఎన్నిసార్లు తన పిడికిటి పోట్లతో ముక్కలు ముక్కలుగా చేసినా, మళ్లీ అతుక్కుని మైరావణుడు లేచి తలపడుతున్నాడు. హనుమంతుడు ఆశ్చర్యపడ్డాడు. ఇదంతా గమనించిన దుర్దండి ‘మహావీరా! కలవరపడకు. వీడి పంచప్రాణాలు ఐదు తుమ్మెదల రూపంలో ఉన్నాయి. ఆ తుమ్మెదలను ఈ బిలంలోనే దాచి ఉంచాడు’ అంటూ ఆ బిలాన్ని చూపించింది. బిలానికి మూసి ఉన్న రాతిని హనుమంతుడు పిడికిటి పోటుతో పిండి పిండి చేశాడు. బిలం నుంచి తుమ్మెదలు భీకరంగా ఝుంకారం చేస్తూ హనుమంతుడి మీదకు వచ్చాయి. హనుమంతుడు ఒక్కొక్క తుమ్మెదనే పట్టి, తన కాలి కింద వేసి నలిపేశాడు. ఐదు తుమ్మెదలూ అంతమొందడంతోనే, మైరావణుడు మొదలు తెగిన చెట్టులా కుప్పకూలిపోయాడు. రామలక్ష్మణులను విభీషణుడిని తన భుజాల మీద, వీపు మీద కూర్చోబెట్టుకుని హనుమంతుడు శరవేగంగా లంకలోని యుద్ధ స్థావరానికి చేరుకున్నాడు. జరిగినదంతా తెలుసుకుని సుగ్రీవుడు ఆశ్చర్యపోయాడు. హనుమంతుణ్ణి అభినందించాడు. ∙సాంఖ్యాయన (చదవండి: విఘ్నేశ్వరుని పూజ తరువాత వాయనదానం మంత్రం ) -
ముల్లా నసీరుద్దీన్ కథలు
ముల్లా నసీరుద్దీన్ వాక్చమత్కారానికి, సద్యఃస్ఫూర్తికి పెట్టింది పేరు. వ్యంగ్యంతో కూడిన హాస్య కథలు ఆయన సొత్తు. సామాన్యుడులా కనిపించే అసామాన్యుడు. అమాయకుడులా కనిపించే అఖండ మేధావి. విదూషకుడులా కనిపించే జ్ఞాని. సూఫీ తత్వవేత్త. డాబు, దర్పం ఏ మాత్రం ఎరుగని నిష్కల్మష హృదయుడు. ప్రజల మనిషి. ఇంతటి మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న ముల్లా నసీరుద్దీన్ టర్కీ దేశంలో పుట్టి ఏడు వందల ఏండ్లు గడిచిపోయినా ప్రపంచం ఆయన్ను మరచిపోలేదు. పోదు. ప్రజలు ఆయన్ను ఎంతగా ప్రేమించారంటే, చాలా దేశాలు ఆయన్ను తమ దేశానికి చెందిన వాడుగానే భావించి గౌరవిస్తున్నారు. మొదట్లో ఆయన పేరు మీద ఉన్న కథలు ఎన్నో చెప్పలేముగాని, ప్రతి తరంలోనూ కొత్త కొత్తవి చేర్చబడుతూ, పాతవి కొద్ది కొద్దిగా మార్పు చెందుతూ, నేటికి వాటి సంఖ్య వెయ్యి వరకు వచ్చింది. చాలా దేశాల్లో ఈ కతలు వాళ్ల వాళ్ల సంస్కృతీ సంప్రదాయాల కనుగుణంగా మార్పు చెంది, జానపద కథల్లో భాగమై పోయాయి. ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఈ కథలు అనువాదం చెందాయి. నలుగురు కలిసి కూర్చున్న చోట, నసీరుద్దీన్ కథలు చెప్పుకొని ఆనందించటం చాలా దేశాల సంస్కృతుల్లో ఆనవాయితీగా ఉన్నది. సందర్భానికి తగ్గట్టుగా ఏదో కథ ఉంటుంది. ప్రతి కథలో పైకి కనిపించే అర్థం ఒకటి, లోతుగా ఆలోచిస్తే తెలిసే లోపలి అర్థం ఇంకొకటి ఉంటుంది. గంభీరమైన తాత్వికార్థం ఉండబట్టే ఈ కథలకు అంతటి ఖ్యాతి, గౌరవం లభించింది. ముల్లా నసీరుద్దీన్ కథల గురించి ఉపన్యసించే కంటే, ఆ కథల్నే ఒకటి రెండు వినిపిస్తే వాటి గొప్పతనం వినేవాళ్లకు చప్పున స్ఫురిస్తుంది. ఎవరిని నమ్మేది? ముల్లా నసీరుద్దీన్ ఇంటికి ఓ పొరిగింటాయన వచ్చి తలుపు కొట్టాడు. ముల్లా తలుపు తీశాడు. ‘ఈ ఒక్కరోజుకు నీ గాడిదను అరువిస్తావా? పక్క ఊరికి సరుకు తీసుకు వెళ్లాలి’ అని అడిగాడు ఆ వచ్చినాయన. గాడిదను ఇవ్వడం ముల్లాకు ఇష్టం లేకపోయింది. తన అయిష్టత బయట పడకుండా ముల్లా సమాధానం చెప్పాడు.‘క్షమించాలి. ఏమనుకోకు. నేను ఈ వరకే గాడిదను ఇంకొకరికి ఇచ్చాను’సరిగ్గా అదే సమయానికి దొడ్లో కట్టివేసిన గాడిద ఓండ్ర పెట్టటం వినిపించింది. ‘ముల్లా. మరి నీ గాడిద అరుపు వినిపిస్తోంది గదా’ అన్నాడు ఆ పొరిగింటాయన. ‘ఎవర్ని నమ్ముతావు నీవు?’ చిరాగ్గా అడిగాడు ముల్లా. ‘నన్నా... ఆ గాడిదనా?’ ఒకటే రుచి ద్రాక్ష పళ్లతో నిండిన రెండు బుట్టల్ని గాడిద మీద వేసి తోట నుండి తిరిగి వస్తున్న ముల్లాను చూశారు కొంతమంది పిల్లలు. వాళ్లు నసీరుద్దీన్ చుట్టూ చేరి రుచి చూడటానికి కాసిని ద్రాక్ష పళ్లు అడిగారు. ముల్లా ద్రాక్ష గుత్తినొక దాన్ని తీసి తలా ఒక ద్రాక్ష పండు ఇచ్చాడు. ‘అన్ని ద్రాక్ష పళ్లు ఉన్నవి గదా నీ దగ్గర. మాకిచ్చేది ఇంతేనా?’ అని గొణిగారు వాళ్లు. ‘బుట్టడైనా, ఒక్కటైనా తేడా ఏం లేదు. అన్నింటిదీ ఒకటే రుచి’ అంటూ ముల్లా ముందుకు సాగిపోయాడు. ప్రసంగం: ఓసారి నసీరుద్దీన్ను మతం గురించి ప్రసంగించవలసిందిగా ఆ ఊరి వాళ్లు కోరారు. ప్రసంగించే ముందు నసీరుద్దీన్ అడిగాడు- ‘నేను ఏం చెప్పబోతున్నానో మీకు తెలుసా?’. తెలియదని చెప్పారు వాళ్లు. వెంటనే నసీరుద్దీన్ ‘నేను ఏం మాట్లాడబోతున్నానో తెలియనివాళ్ల ముందు ప్రసంగించటం నాకు ఇష్టం లేదు’ అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఊళ్లో వాళ్లు చాలా తర్జనభర్జన పడి, మర్నాడు మళ్లీ ఆయన్ను పిలిచారు. ఈసారి నిన్నటికి మల్లే అదే ప్రశ్న వేయగా అందరూ ‘తెలుసు’ అని సమాధానం చెప్పారు. వెంటనే ముల్లా ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు ముందుగానే తెలుసు గాబట్టి మీ సమయాన్ని నేను వృథా చేయను’ అని చెప్పి అక్కడ నుంచి వెళ్లిపోయాడు.దాంతో వూరి వాళ్లందరూ నిజంగానే అయోమయంలో పడ్డారు. ఇంకోసారి ప్రయత్నించి చూద్దామని, మరుసటి రోజు మళ్లీ నసీరుద్దీన్ను ఆహ్వానించారు. అతడు మళ్లీ అదే ప్రశ్న వేశాడు ‘నేను మాట్లాడబోయేది ఏమిటో మీకు తెలుసా?’ ఈసారి వాళ్లంతా ముందుగానే కూడబలుక్కుని వచ్చారు. అందువల్ల సగం మంది ‘తెలుసు’ అని, సగం మంది ‘తెలియదు’ అని సమాధానం చెప్పారు. అప్పుడు ముల్లా నసీరుద్దీన్ అన్నాడు- ‘తెలిసిన సగం మంది తెలియని సగం మందికి చెప్పండి’ అని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. లెక్క ఒకప్పుడు నసీరుద్దీన్ దగ్గర కొంత డబ్బు పోగైంది. దాంతో చాలామంది ఆయన చుట్టూ చీమల్లా చేరారు. ఒకాయన నసీరుద్దీన్ను అడిగాడు ‘ముల్లా. నీకెంత మంది స్నేహితులు ఉన్నారో లెక్క చెప్పగలవా?’ అని. అందుకు నసీరుద్దీన్ అన్నాడు, ‘ఇప్పటికిప్పుడు లెక్క చెప్పటం ఎలా కుదురుతుంది? చేతిలో పైసా లేనప్పుడు గదా ఆ లెక్క తెలిసేది? ’వెతకడం ఓసారి ముల్లా నసీరుద్దీన్ తన ఇంటి బయట ఏదో వెతుకుతూ ఒకతనికి కనిపించాడు. ఏమిటి అని అడిగితే తాళం చెవి కోసం అని సమాధానం చెప్పాడు. ఆ అడిగిన మనిషి కూడా ముల్లాతో పాటు వెతకటం మొదలుపెట్టాడు. కాసేపయ్యాక అతడు అడిగాడు. ‘నీవు సరిగ్గా ఎక్కడ పోగొట్టుకున్నావు?’ ముల్లా సమాధానం - ‘ఇంట్లో’ ‘మరి ఇక్కడ వెతుకుతున్నావెందుకు?’ ‘ఇంట్లో కంటే ఇక్కడ వెలుతురు ఎక్కువగా ఉంది’ అని ముల్లా సమాధానం. ఇలా ఉంటవి ముల్లా నసీరుద్దీన్ కథలు. అటు టర్కీ నుంచి ఇటు చైనా, రష్యాల దాకా ఇవాళ ఆయన పేరు విననివాళ్లు లేరు. ముల్లా నసీరుద్దీన్ను కొన్ని దేశాల్లో నసీరుద్దీన్ హోడ్జా అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ నసీరుద్దీన్ ఉత్సవం ప్రతి సంవత్సరం అతని నివాస స్థలమైన టర్కీలోని అక్సెహిర్ పట్టణంలో జూలై 5- 10 మధ్య జరుగుతుంది. యునెస్కో వారు 1996-97 సంవత్సరాన్ని అంతర్జాతీయ నసీరుద్దీన్ సంవత్సరంగా గుర్తించి, అతని కథలకు అతనికి ఒక ప్రత్యేకమైన గౌరవం కలుగచేశారు. - దీవి సుబ్బారావు
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
టీడీపీలో చేరి తండ్రి ఆశయాలను నీరుగార్చిన దద్దమ్మ..
‘వరుణ్ విషయంలో బీజేపీని సవాల్ చేయలేను’
సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
నువ్వా నన్ను విమర్శిస్తావ్.. దేవినేని ఉమాకు అబ్బయ్య చౌదరి కౌంటర్
కూటమికి ప్రజలే గుణపాఠం చెబుతారు: సజ్జల రామకృష్ణా రెడ్డి
IPL 2024- WI: అలా అయితే.. సన్రైజర్స్, రాజస్తాన్కు షాక్!
ఎంతమంది వచ్చినా.. ధర్మవరం గడ్డ కేతిరెడ్డి అడ్డా..
వైఎస్సార్సీపీ అభ్యర్థి కోసం ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్
కేజ్రీకి ఈ ఆలయం ఒక సెంటిమెంట్?
మీ భూమి మీది కాదు అని ఈనాడు, ఆంధ్రజ్యోతిలో రాశారు
తప్పక చదవండి
- సీఎం జగన్కు ఇంత మంది శత్రువులు ఎలా అయ్యారు?
- టీ20లలో సరికొత్త చరిత్ర.. బాబర్ ఆజం ప్రపంచ రికార్డు
- నీతో ప్రచారం చేస్తే నా ఓటమి ఖాయం... కేశినేని చిన్ని
- కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
- పశ్చిమలో వెంకన్న సైలెంట్.. అనుచరుల ఆగ్రహం
- కుప్పంలో టీడీపీ గూండాయిజం
- HYD: ఏపీకి క్యూ కట్టిన ప్రజలు.. పలుచోట్ల ట్రాఫిక్ జాం
- 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత ఆ ఓటీటీలో ఎంట్రీ ఇస్తున్న 'రామ్'
- గీతాంజలి పిల్లల పేరిట రూ.20లక్షలు ఎఫ్డీ
- ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
Advertisement