-
కృష్ణుడు మోశాడు
అది మహాభారత యుద్ధ సమయం. భీష్మాచార్యుడు మరుసటిరోజు సూర్యాస్తమయంలోగా పాండవుల్ని సంహరిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. దిక్కుతోచని ద్రౌపది విశ్వానికి ఏకైక దిక్కయిన శ్రీకృష్ణ పరమాత్ముని పాదాలను ఆశ్రయించింది. తన భర్తలని ఏ విధంగానైనా రక్షించి తన మాంగల్యాన్ని కాపాడమని వేడుకుంది. రక్షిస్తానని మాటిచ్చాడు కృష్ణుడు. ఆరోజు రాత్రి భీష్మాచార్యుడు తాను తొందరపాటుతో చేసిన ప్రతిజ్ఞ వల్ల మనస్సు వ్యాకులం చెందగా, తనలో తానే మథన పడుతూ, ఈ యుద్ధం వల్ల ఎన్ని అనర్థాలు ఎదురవుతున్నాయో అని నిద్దుర లేమితో గుడారంలో అటూ ఇటూ తిరుగుతున్నాడు. సరిగ్గా ఆ సమయానికి కృష్ణుడు ద్రౌపదిని తోడ్కోని భీష్మాచార్యుని గుడారం వద్దకు వెళ్లాడు. కృష్ణుని ఆజ్ఞ ప్రకారం ద్రౌపది ఒక్కసారిగా వెళ్లి భీష్ముని పాదాలపై వాలింది. ‘దీర్ఘ సుమంగళీ భవ’ అని ఆశీర్వదించి ‘నీవు ఎవరవమ్మా?’’ అని అడిగాడు భీష్ముడు. ఎదురుగా నిలుచున్న ద్రౌపదిని చూసి ఆశ్చర్యపోయాడు. దీర్ఘసుమంగళీ భవ’అని ఆశీర్వదించాక ఆమె భర్తలని తాను ఎలా చంపగలడు?! ఉద్వేగానికి లోనయ్యాడు భీష్మాచార్యుడు. ఇంతలో కృష్ణుడు గుడారంలోకి ప్రవేశించాడు. తెర వెనుక ఉన్న సూత్రధారి ఎవరో అప్పుడు భీష్మునికి అర్థమైంది. కృష్ణ దర్శనంతో కొంత ఉపశమనం పొందాడు. ఆకలనిపించింది. కృష్ణుని అంగవస్త్రంలో ఉన్న మూటను చూసి, అదేదో తినుబండారమై ఉంటుందని భావించి, తనకు పెట్టమని అడిగాడు. కృష్ణుడు తాను మోసుకొచ్చిన మూటను విప్పి చూపించగా అందులో పాదరక్షలు అగుపించాడు. భీష్ముడు నిర్ఘాంతపోయి, ‘‘ఇదేమిటి కృష్ణా!’’అన్నాడు. ‘‘చెప్పుల శబ్దం విని ద్రౌపది రాకను నీవు గమనించకూడదనే ఉద్దేశ్యంతో నేను ఆమె పాదరక్షలను మోసుకొచ్చాను’’ అని చెప్పాడు కృష్ణుడు. ఎలాగైతేనేం, భీష్మునితో దీర్ఘ సుమంగళిగా ఉండేటట్లు వరాన్నైతే ఇప్పించాడు ద్రౌపదికి. -
మహా పతివ్రత గాంధారి
ఈ దేశంలో కొంతమంది స్త్రీల చరిత్ర పరిశీలిస్తుంటే ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. అటువంటి ఉదాత్త స్త్రీలలో గాంధారి ఒకరు. ఆమె సుబలుడనే గాంధార రాజు కుమార్తె. మహా సౌందర్యవతి. మెరుపు తీగ. ఎక్కువ మంది సంతానం కలగాలని వరం పొందింది. సకల సుగుణ రాశి. చిత్రాంగదుడు, చిత్ర వీర్యుల దగ్గరనుంచీ ఎప్పుడూ సంతానం లేక కురువంశం బాధపడుతూ ఉండేది. కురువంశం అవిచ్ఛిన్నంగా కొనసాగుతుందని భీష్మాచార్యులవారు ఆమెను తీసుకొచ్చి ధృతరాష్ట్రుడికిచ్చి వివాహం చేయాలనుకున్నారు. ధృతరాజు పుట్టుకతో కళ్ళులేనివాడు. అటువంటి వ్యక్తిని అంత సౌందర్య రాశి ఎందుకు వివాహం చేసుకోవాలి? సుబలుడు అడిగాడు–‘అమ్మా! నీ కిష్టమేనా’ అని. ఆమె మామూలుగా అంగీకరించడం కాదు, అపారమైన ఔదార్యంతో అంగీకరించింది. ఎవరివలన అవతలివారి వంశం నిలబడితే, కళ్ళులేనివాడు తాను కూడా బిడ్డల్ని పొందానని సంతోషిస్తే అంతకన్నా తన జన్మకి సుకృతి ఏముంటుందని అంగీకరించింది. మహాతల్లి ఇంకా ఏమందో తెలుసా...‘‘నా భర్త ఏవి చూసి సంతోషించడంలేదో అవి చూసి నేను కూడా సంతోషించను..అని చెప్పి తన కళ్ళకు గుడ్డ కట్టేసుకుంది. భర్త పెను వేప విత్తు. పరమ దుష్ట ఆలోచనలున్నవాడు, పెద్ద కొడుకు దుర్యోధనుడు. నూరుగురు కొడుకులు. అల్లుడు సైంధవుడు, నీచుడు.. ఇంతమంది దుష్టుల మధ్యలో ఆమె పుటం పెట్టిన బంగారం. ఆమె ఔదార్యం ఎంతటిదంటే– ఒకనాడు ధృతరాష్టుడ్రు భార్యని పిలిచి అడిగాడు..‘‘పాండవులకు రాజ్యం ఇవ్వకుండా మన కుమారుడికి రాజ్యం ఇవ్వాలనుకుంటున్నాను. పట్టమహిషివి. నీ అభిప్రాయం ఏమిటి?’’... ఆమె కుండబద్దలు కొట్టినట్లు జవాబిచ్చింది–‘‘ మహారాజా ‘ మీకడుపున పుట్టిన దుర్యోధనుడు పరమ నీచుడన్న విషయం మీకు తెలియదా! వాడు నీచుడని తెలిసీ, రాజ్యం ధర్మంగా రాదని తెలిసీ, పాండురాజు కొడుకైన ధర్మరాజుకు వెడుతుందని తెలిసీ ఎందుకు కుట్ర చేస్తారు? మీ తమ్ముడి బిడ్డలు మీ బిడ్డలు కారా? ధర్మరాజుకు దక్కవలసిన రాజ్యం అతనికి ఇవ్వలేరా? కొడుకు, కొడుకన్న పుత్ర వ్యామోహంలోపడి ఎందుకు పరుగెడుతుంటారు? మీరు చక్రవర్తులు, మీరెలా ఇవ్వాలనుకుంటే అలా ఇవ్వవచ్చు. ఈ కురు సామ్రాజ్యన్నంతటినీ ధర్మరాజుకు ధారాదత్తం చేస్తే ఎదురుపడి ఆపగలిగిన వాళ్లున్నారా? భీష్మద్రోణాదులు ధర్మపక్షాన నిలబడరా. దుర్యోధనుడు నిన్ను చెణకగలడా? వాడిని ధర్మరాజు దగ్గరపెడితే వాడు వశవర్తియై బతకడా? అప్పటికయినా బుద్ధి మార్చుకోడా? మీ కొడుకు దీర్ఘాయుర్దాయం అంతా మీ చేతిలోనే ఉంది మహారాజా! మీ బిడ్డలని పుత్ర పాశములకు వశపడవద్దు. రాజ్యాన్ని ధర్మరాజుకు, ఆయన తమ్ముళ్ళకి ఇచ్చేయండి.’’ నిజంగా ఎటువంటి ఇల్లాలు ఆ తల్లి, అలా నిలబడగలిగిన వాళ్లు ఈ లోకంలో ఉంటారా? నూరుగురు కొడుకులు చచ్చిపోయిన తరువాత ధర్మరాజు వచ్చి ‘‘అమ్మా! నీ బిడ్డలను అందరినీ చంపిన పాపిష్టివాడిని నేనేనమ్మా, ధర్మం కోసం చంపానే గానీ, నా అంత నేను చంపలేదమ్మా! అది తప్పనిపిస్తే నన్ను కాల్చేయమ్మా’’ అన్నాడు. ఆమె ఒక్కమాట అనలేదు. కళ్ళవెంట నీరు కారింది. ధర్మరాజుని కౌగిలించుకుంది. కాన్నీ ఒక్క బిడ్డకూడా బతికిలేడనే బాధతో ఆమె చూసినపుడు కళ్ళగంత ఒక్కసారి సడలి ఆమె దృష్టి పడినందుకు ధర్మరాజంతటివాడి కాళ్ళు బొబ్బలెక్కాయి. అంతటి పతివ్రత గాంధారి. -
ప్రతిభకు కొలువు!
రాకుమారులంతా ఊరవతల బంతి ఆట ఆడుతున్నారు. బంతిని గట్టిగా తన్నాడు భీముడు. దెబ్బకి అది వెళ్ళి, దూరంగా ఉన్న నూతిలో పడిపోయింది. పరుగున పోయి చూశారంతా. అడుగున నూతిలో తేలుతూ కనిపించింది బంతి. ఏ రకంగా ప్రయత్నించినా అందడం లేదది. పైకి తీయడం అసాధ్యం అనుకుని, ఆలోచిస్తూ ఒకరి మొహం ఒకరు చూసుకున్నారు రాకుమారులు. అంతలో అక్కడికి ఓ వ్యక్తి అతను సన్నగా, పీలగా రకరకాల బాణాలూ, అమ్ముల పొదులూ పట్టుకుని ఉన్నాడు. నూతిలోకి తొంగి చూస్తూ, ‘‘నూతిలో బంతి పడిపోయింది, అంతేనా? అడిగాడు. ‘‘అవును’’ అన్నారు రాకుమారులు. ‘‘చూడబోతే మీరంతా రాకుమారుల్లా ఉన్నారు. పైగా ధనుర్విద్యలో మేటివాడైన కృపాచార్యుని శిష్యులు. నూతిలోని బంతిని ఎలా తియ్యాలో తెలియడం లేదా?’’ అన్నాడు ఆశ్చర్యం నిండిన గొంతుతో. తెలియడం లేదన్నట్టుగా అందరూ తలలూపారు.‘‘పోనీ, నేను తీసి చూపించనా?’’ అనడిగాడతను. ‘‘చూపించండి’’ అన్నారంతా. ‘‘అయితే చూడండి’’ అంటూ విల్లు అందుకున్నాడు. దానికి ఓ బాణాన్ని సంధించాడు. ఆ బాణం వెళ్ళి, నూతిలోని బంతిని నాటుకున్నది. మరోబాణం వదిలాడు. అది వెళ్ళి, మొదటిబాణానికి నాటుకున్నది. మరొకటి వదిలాడు. అది వెళ్ళి రెండోదాన్ని నాటుకున్నది. అలా బాణం తర్వాత బాణం వదిలి, బాణాల గొలుసును తయారుచేశాడు. దాంతో బంతిని పైకి తీసి, రాకుమారులకి అందించాడు. ఇదంతా తెలిసింది భీష్ముడికి. హుటాహుటిన అక్కడికి వచ్చాడు. ‘‘అయ్యా తమరి పేరు?’’ అడిగాడు భీష్ముడు. నన్ను ‘ద్రోణుడు’ అంటారు అన్నాడు ఆ వ్యక్తి. అంతే! ఒక్కసారిగా లేచి, నమస్కరించాడతనికి భీష్ముడు. ఎందుకంటే, అప్పటికే ద్రోణుని ప్రతిభాపాటవాల గురించి విని వున్నాడు భీష్ముడు. సాలోచనగా కళ్ళు మూసుకున్నాడు ఓ క్షణం. తర్వాత కళ్లు తెరచి తలపంకిస్తూ...‘‘ధనుర్విద్యలో పరశురాముణ్ణి మించినవారు మీరు. మీలాంటి వారు మా చిరంజీవులకు తారసపడటం మా అదృష్టం. ఇదిగో! ఈ పిల్లలంతా నా మనుమలు. వీరంతా నేటి నుంచి మీ శిష్యులు. వీరికి మీ మహాస్త్రవిద్యలన్నీ నేర్పండి’’ అన్నాడు. ‘‘తప్పకుండా’’ అన్నాడు ద్రోణుడు. ఆచార్యుడు ఆ మాటనగానే అర్జునుడు పరుగున వచ్చి, అతని పాదాలకు నమస్కరించాడు. అది చూసి భీష్మ ద్రోణులిద్దరూ ఆశ్చర్యపోయారు. ఆనందించారు కూడా. ఆ విధంగా ద్రోణుడు భరత వంశంలో ధనుర్విద్యా పాఠశాలలో గురువు అయ్యాడు. ఇక్కడ నీతి ఏమిటంటే, గురువనేవారిని వారి ప్రతిభా పాటవాలు, పాండిత్యం ఆధారంగానే నిర్ణయించాలి తప్ప, మనవాడా, ఇతరుడా అనే అభిప్రాయంతో కాదు. – డి.వి.ఆర్. భాస్కర్ -
భీష్ముడు
భీష్ముడనే పేరు దేవవ్రతుడికి రెండో పేరే అయినా, అదే మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు. భీష్ముడంటే భయంకరుడని అర్థం. ఏవిధంగా ఇతను భయంకరుడు? దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి, వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమైన ప్రతిజ్ఞ చేసిన మీదట, భీష్ముడనే పేరు స్థిరపడిందని చెబుతారు. ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడమూ కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండటమూ రెండూ చాలా దొడ్డ ప్రతిజ్ఞలే. అయితే, అవి ఎవరికి భయాన్ని పుట్టిస్తాయి? అబ్బో, ఎంత కష్టమైన ప్రతిజ్ఞ చేశాడని అబ్బురపడతాం తప్ప, మనకు దానివల్ల భయం ఎందుకు కలుగుతుంది? తండ్రి చెప్పకుండానే ఆయనకు కావలసినది చేసిన వైనంలో రాముడితో భీష్ముణ్ని సరిపోల్చవచ్చు. కానీ రాముణ్ని భీష్మవ్రతం చేపట్టాడని ఎవరూ అనలేదు. రాముడూ రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు; పద్నాలుగేళ్లు అడవుల్లో ఉన్నాడు. భీష్ముడు ఏళ్లతో ప్రమేయం లేకుండా శాశ్వతంగానే సింహాసనానికి దూరమయ్యాడు. పైగా రాజ్యంలోనే సింహాసనానికి దగ్గరగానే ఉంటూనే, దూరంగా ఉన్నాడు. అలాగే రాముడిది నాతిగల పద్నాలుగేళ్ల బ్రహ్మచర్యం; భీష్ముడిది పెళ్లిలేని జీవితాంత బ్రహ్మచర్యం. అందుకే రాముడిది భీష్మవ్రతమనకుండా దేవవ్రతుణ్నే భీష్ముడని అంటారు. భీష్ముడు, ఇరవైయొక్క సార్లు నేలమీద క్షత్రియుల్లేకుండా చేసిన పరశురాముణ్నే ఓడించిన ధనుర్విద్యాపారంగతుడు. తమ్ముడు విచిత్రవీర్యుడికి పెళ్లిచేద్దామని కాశిరాచకన్నెల స్వయంవరానికి తానే స్వయంగా వెళ్లాడు. స్వయంవరానికి వచ్చిన రాజులనందర్నీ గడ్డిపరకల మాదిరిగా తీసేసి, రాచకన్నెల్ని రథం ఎక్కించుకొని తెస్తూ, అడ్డుపడిన రాజుల్ని కూడా మట్టికరిపించాడు. ఆ ముగ్గురు ఆడపిల్లల్లో అంబ అనే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకొందామని ఉబలాటపడి వచ్చిన సాల్వుణ్ని కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు. తీరా ఇంటికి వచ్చిన తరవాత, అంబ తన ప్రేమకథని చెప్పి సాల్వుడి దగ్గరికి పంపించమని అడిగింది. సరే, అంబికా అంబాలికల్ని ఇద్దరినీ విచిత్రవీర్యుడికిచ్చి పెళ్లి చేశారు. అతనేమో ఆ పెళ్లాల రంధిలో మునిగిపోయి రాజయక్ష్మ రోగాన్ని తెచ్చుకొని ఏడేళ్లలోనే చచ్చిపోయాడు. అతిసంభోగంతో రాజయక్ష్మం వస్తుందన్నది ఇక్కడి పాఠం. అతను పోయిన తరువాత, సత్యవతి భీష్ముణ్ని అంబికా అంబాలికలతో కాపరం చేసి పిల్లల్ని కనమంది. కానీ ధర్మానికి కట్టుబడినవాడు గనక ఆ పనికి అతను ఒప్పుకోలేదు. ఇక అంబ విషయానికి వస్తే... ఆమెను పెళ్లిచేసుకోవడానికి ససేమిరా అన్నాడు సాల్వుడు. భీష్ముడి మీద కక్షకట్టిన అంబ... పరుశురాముడి సాయాన్ని కోరింది. అయితే క్షత్రియులందర్నీ పనిగట్టుకొని మరీ నాశనం చేసిన పరుశురాముణ్నే ఓడించిన జగజ్జెట్టి భీష్ముడు. ఇక అంబ, దెబ్బతిన్న పాముకి మల్లే కసితో తపస్సు చేసింది. శివుడి వరాన్ని పొంది, చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకొని, ద్రుపద మహారాజుకు కూతురుగా పుట్టింది. ఆ రాజు కూతురికి మగదుస్తులు వేసి మగవాడిగా పెంచడమేగాక, హిరణ్యవర్మ కూతురికిచ్చి పెళ్లి కూడా చేశాడు. మామగారు అగ్గి గుగ్గిలమై దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి, శిఖండి ఒక వనంలోకి పారిపోయింది. ఆ వనాన్ని స్థూణాకర్ణుడనే యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనితో గోడు చెప్పుకొంది. ‘గండం గడిచేంతదాకా నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను. నీ మామగారు తృప్తిపడి వెళ్లిపోగానే తిరిగి నా పుంస్త్వాన్ని నాకు ఇచ్చేద్దుగానిలే’ అని ఒడంబడిక చేసుకొని శిఖండిని మగవాడిగా చేశాడు. సత్యవతితో పెళ్లికాగానే సంతోషించిన శాంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణమనే వరాన్నిచ్చాడు. కానీ భగవంతుడు అఘటనఘటనా సమర్థుడు. ఎన్నెన్ని వరాలనైనా పొందనీ చావు ఏదోవిధంగా వచ్చితీరుతుంది. దానికి మార్గాన్ని భీష్ముడే ఏర్పరుచుకొన్నాడు. భీష్ముడికి ఒక వ్రతం ఉంది: ఆడదాన్ని గానీ ముందు ఆడదిగా ఉండి, తరవాత మగవాడిగా మారినవాణ్ని గానీ ఆడదాని పేరుపెట్టుకొన్నవాణ్ని గానీ ఆడదాని రూపమున్నవాణ్ని గానీ చూస్తే బాణాన్ని వేయడు. నిజానికి చైతన్యానికి మగా ఆడా తేడా ఉండదు. అలాగ వేరుతనాన్ని చూడటమే అహంకారమంటే. కురుక్షేత్ర యుద్ధంలో ఏ రోజుకారోజు పదివేల మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తూన్న భీష్ముని దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజే వెళ్లి ‘నువ్వెలాగ చచ్చిపోతావో నువ్వే చెప్పాలి’ అని వింతైన కోరిక కోరాడు. అప్పటికే చాలా విసుగెత్తి ఉన్నాడు భీష్ముడు. ‘శిఖండిని అడ్డుపెట్టుకొని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాల్ని వేయను గనక నేను పతనమైపోతాను’ అని తన చావును తానే చెప్పుకొన్నాడు. అలాగ బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదనే పడుకొని ఇంకా కొన్నాళ్లు బతికే ఉన్నాడు. చివరికి యుద్ధమైపోయిన తరవాత, అందర్నీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని, ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత. ఆ పని చేసిన తరవాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని ధ్యానం చేస్తూ బొందిని వదిలిపెట్టాడు భీష్ముడు. అసలైన భీష్మత్వం! పాండవులకు జయం విషయంలో భీష్ముడంటేనే భయం. మనం ఇంతకుముందే భీష్ముడు ఆభాసచైతన్యమని, అంటే, అహంకార చైతన్యమని చెప్పుకొన్నాం. జూదంలో ద్రౌపదిని గెలుచుకొని దుర్యోధనుడు దుశ్శాసనుడి చేత జులుం చేయడానికి సిద్ధపడ్డప్పుడు, ఇంతటి భయంకరుడన్న పేరున్న ఈయనగారు కిక్కురుమనలేదు. సింహాసనాన్ని కాపాడటానికి వ్రతంబూనితే మాత్రం అధర్మం జరుగుతూంటే చూస్తూ ఊరుకోవడం గానీ నామమాత్రంగా మంచి చెప్పి ఊరుకోవడం గానీ ఎంతటి యోద్ధనయినా భయపెట్టే ఇతనికి తగనే తగదు. ఇతను ధర్మాలన్నీ ఎరిగినవాడే; ధర్మాలను చెప్పగలిగినవాడే; వినకపోతే చెవి మెలిపి మరీ వినేలాగ నిర్బంధపెట్టగలిగిన కురువృద్ధుడూ మహాశూరుడూను. రాజ్యాన్ని కాపాడటమంటే, సింహాసనం మీద ఉన్నవాణ్ని కాపాడటం మాత్రం కాదు. రాజ్యం ధర్మపరంగా ఉండాలంటే, సింహాసనం మీద ఉన్నవాడు కూడా ధర్మంగా ఉండాలి. సింహాసనం మీద అధర్మపరుడుంటే, అతన్ని కాపాడటం చాలా అపరాధం. కానీ దుర్యోధనుడూ శకునీ దుశ్శాసనుడూ కర్ణుడూ మరీ పేట్రేగి ప్రవర్తిస్తూంటే, ఇంతటి మహాధనుర్ధారీ వాళ్లను కట్టడి చేయలేదు. ద్రోణుడంటారా ఒక రాజోద్యోగి, అతని భయాలు అతనికుంటాయి. కానీ భీష్ముడు వాళ్లందరికీ తాతేకాదు, అతని మాటంటేనే అందరికీ హడలు. కయ్యానికి పదేపదే కాలుదువ్వుతూన్న దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ కురువృద్ధుడు అంతకన్నా మించి మరేమీ చేయలేదు. అప్పుడైనా, ధర్మం ఎటువైపు ఉందో తెలిసిన ధర్మవేత్త పాండవులవైపుకు వెళ్లకుండా దుర్యోధనుడికొమ్మే కాశాడు. అంచేతనే భీష్ముడు అహంకార రూపమయ్యాడు. ఈ యుద్ధం వెనక ఉన్న మానసికమూ ఆధ్యాత్మికమూ అయిన స్వరూపాన్ని చూస్తే, భీష్మమైన అహంకారమే బుద్ధిమంతులైన పాండవుల ధర్మప్రవర్తనకు గండికొట్టడానికి ఎదురై నిలుచుందని అర్థమవుతుంది. అదే, అంతస్సులో ఆత్మచైతన్య సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నం చేసే అంతశ్శక్తుల గుండెల్లో అతి గుబులు పుట్టిస్తూ ఉండేది. పతంజలి చెప్పిన ‘అస్మిత’ అనే క్లేశం ఇదే. ‘అస్మి’ అంటే ‘నేనున్నాను’ అని అర్థం. దాని భావమే ‘అస్మిత’. లోపలున్న భగవంతుడి ప్రతిబింబమైన ఆత్మను మరిచిపోయి, తనను శరీరమూ మనస్సులకు సంబంధించిన పరికరాలతో ఒకటిగా అనుకోవడమే అహంకారం. ఇదే కురువృద్ధుడు. దీనికి మామూలు అర్థం కౌరవుల్లో పెద్దవాడని. కానీ అసలైన అర్థం ‘సృష్టి మొదలైన దగ్గర్నుంచీ అనాదిగా ఉంటూనే ఉన్న ప్రాపంచికుడు’ అని. మొత్తం సృష్టి అంతా ఇతని వ్యక్తిగతమైన బలం మీదనే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలూ ఇంద్రియాల అనుభవాలూ అనేవాటి వెనక మారకుండా ఉండే చైతన్యం తాలూకు ఏకత్వమే అహంకారం. ‘నేను ఆలోచిస్తున్నాను, నేను రాస్తున్నాను, నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను బాధపడుతున్నాను, నేను సుఖిస్తున్నాను’ అనే రకరకాల మార్పుల వెనక వాటికన్నిటికీ కర్త అయినదే అహంకారం. ఈ అనుభవాలకు ప్రభువైన ‘నేను’ నిజానికి ఈ ఆలోచనల కన్నా వేరైనవాడే. కళ్లు చూడలేనప్పుడు, కళ్లను మాత్రమే గుడ్డి అనవలసింది పోయి, ‘నేను గుడ్డివాణ్ని’ అని తనకే గుడ్డితనాన్ని ఆపాదించుకోవడం తప్పేగదా... కళ్లు పోయినంతమాత్రాన మనం నాశనమైపోవటం లేదు. కానీ ప్రతివాడూ అనుభవాన్నీ అనుభవించేవాణ్నీ కలిపేస్తూ ఉంటాడు. ఈ అహంకారం చనిపోవాలంటే, కళ్లు మూసుకొని, లోపలికి చూపును తిప్పి, అక్కడున్న మహాచైతన్యాన్ని తదేకంగా ధ్యానం చేయాలి; ఆ చైతన్యంతో ఒకటైపోవాలి. భీష్ముడు శ్రీకృష్ణమూర్తిని ఎదురుగా చూస్తూ ఆ మూర్తిని ధ్యానపథంలో ఉంచుకొనే ప్రాణాలను వదిలిపెట్టేడంటే ఇదే అర్థం. అహంకారాన్ని జయించాలంటే ధ్యానమొక్కటే మార్గం. లేకపోతే అహంకారం చావనే చావదు.
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైట్హౌస్కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
రాజధానిపై కూటమి కుట్ర బట్ట బయలు చేసిన దేవులపల్లి
టీడీపీ కార్యకర్తల దాడి అంబటి స్ట్రాంగ్ కౌంటర్
పిఠాపురంలో పవన్ చిత్తు చిత్తు.. ప్రచారంలో వంగా గీత కూతురు అల్లుడు
పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
How To Cast Your Vote : ఓటు వేద్దాం.. స్ఫూర్తి చాటుదాం (ఫొటోలు)
కడప కోర్టులో షర్మిల, సునీతకు మరోసారి ఎదురుదెబ్బ
నా స్కూటీని తగులబెట్టారు: రాగ మంజరి చౌదరి
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కడుపుమంట అదే : నాగార్జున యాదవ్
మొలకలతో బోలెడన్ని ప్రయోజనాలు, ఈ సైడ్ ఎఫెక్ట్స్తెలుసుకోండి!
తప్పక చదవండి
- ఒక్క క్లిక్తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు కొట్టిన సంజూ.. భారత తొలి క్రికెటర్గా..
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement